Secunderabad to Vasco-da-Gama Express: దేశంలో ప్రముఖ పర్యటక ప్రాంతంగా గుర్తింపు ప్రదేశాల్లో గోవా ఒకటి. ప్రతి ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకు లక్షలాది మంది యువకులు గోవా టూర్ కు వెళ్తుంటారు. అయినప్పటికీ, సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా రైలు లేదు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే గోవాకు వెళ్లాలనుకునే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు స్పెషల్ ట్రైన్ ను ప్రారంభించబోతోంది. సికింద్రాబాద్ – వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ గా దీనికి పేరు పెట్టింది. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. నిజానికి ఈ రైలు ఎప్పటి నుంచో తీసుకురావాలని ప్రయాణీకులు విజ్ఞప్తి చేస్తుండగా, తాజాగా రైల్వేశాఖ గ్రీన్ ఈ రైలు సర్వీసుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 6న సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్ ను ప్రారంభించనున్నారు.
బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి.. గురు శనివారాల్లో వాస్కోడిగామా నుంచి..
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నుంచి వాస్కోడిగామా స్టేషన్ కు వెళ్లే రైలు 17039 నంబర్ తో బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. ఆ తర్వాతి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా స్టేషన్ కు చేరుకుంటుంది. అటు వాస్కోడిగామా స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కు 17040 నంబర్ తో గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్లలో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.
ఏ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందంటే?
సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అయ్యే ఈ రైలు కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్ డెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలుకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్ అక్టోబర్ 4 నుంచి ప్రారంభం అయ్యాయి.
గోవాకు వెళ్లే పర్యాటకులలో 20 శాతం తెలుగ వాళ్లే
ప్రతి ఏటా గోవాకు 80 లక్షల మంది భారతీయులు గోవాకు వెళ్తారు. వారిలో సుమారు 20 శాతం మంది తెలుగు వాళ్లే ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు నేరుగా గోవాకు వెళ్లే రైలు సౌకర్యం లేకపోవడంతో సొంత వాహనాల్లో వెళ్తున్నారు. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇక ఇప్పుడు నేరుగా సికింద్రాబాద్ నుంచి గోవాకు వారానికి రెండు సార్లు వెళ్లే రైలు అందుబాటులోకి రావడంతో ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇకపై వారం రోజుల ముందుకు గోవా టూర్ ప్లాన్ చేసుకున్నా రైల్లో హాయిగా వెళ్లొచ్చు. గోవాలో బీచ్ అందాలను చైసి ఎంజాయ్ చేయవచ్చు.
Read Also: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?