E-Flying Taxis: దేశంలో అత్యంత ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే ఎయిర్ పోర్టు ఏదైనా ఉందంటే, అది బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే. ఎయిర్ పోర్టుకు వెళ్లాలన్నా, ఎయిర్ పోర్టు నుంచి రావాలన్నా ట్రాఫిక్ చిక్కులు తప్పవు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది కర్నాటక ప్రభుత్వం. అందులో భాగంగానే ఫ్లైయింగ్ టాక్సీలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ తో కలిసి సరళా ఏవియేషన్ సంస్థ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం బెంగళూరులోని కీలక ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు ఫ్లైయింగ్ ట్యాక్సీలను నడపాల్సి ఉంటుంది. ఇవి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు లేని ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. జర్నీ టైమ్ సైతం గణనీయంగా తగ్గుతుంది.
డ్రైవర్ తో పాటు ఏడుగురు ప్రయాణించేలా ఫ్లైయింగ్ ట్యాక్సీ
ఫ్లైయింగ్ ట్యాక్సీలు(eVTOL) పూర్తిగా ఛార్జింగ్ తో నడుస్తాయి. ఏడు సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హెలికాఫ్టర్లతో పోల్చితే వేగంగా, నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయి. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించవు. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీకి ప్రీమియం టాక్సీలో వెళ్లాలంటే దాదాపు 152 నిమిషాలు పడుతుంది. ధర రూ. 2,500 అవుతుంది. ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీలను ఉపయోగించి కేవలం 19 నిమిషాల్లో వెళ్లొచ్చు. ధర కేవలం రూ. 1,700 అవుతుంది. ఫ్లైయింగ్ ట్యాక్సీలు సిటీ రవాణాలో గేమ్-ఛేంజర్గా మారబోతున్నాయి. ఇందిరా నగర్ నుంచి ఎయిర్ పోర్టుకు సుమారు 1.50 గంటలు పడితే ఈ ట్యాక్సీల ద్వారా కేవలం 5 నిమిషాల్లో వెళ్లే అవకాశం ఉంటుంది.
2026లో అందుబాటులోకి ఫ్లైయింగ్ ట్యాక్సీలు
ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రారంభం దశలోనే ఉంది. ప్రొటో టైప్ రూపకల్పన జరగలేదు. రెగ్యులేటరీ అనుమతులు కూడా రాలేదు. అన్ని అనుమతులు రావాలంటే కనీసం రెండు సంవల్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. 2026 చివరల్లో లేదంటే 2027లో ఫ్లైయింగ్ ట్యాక్సీలు ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, 2026 నాటికి భారత్ లో ఫ్లైయింగ్ ట్యాక్సీ సేవలు ప్రారంభించేందుకు ఆర్చర్ లాంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా eVTOL ఫ్లైయింగ్ ట్యాక్సీల కోసం గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తాయని ఏవియేషన్ నిపుణులు భావిస్తున్నారు.
హైదరాబాద్ పైనా సరళా ఏవియేషన్ ఫోకస్
బెంగళూరులో ఫ్లైయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సరళా ఏవియేషన్ సంస్థ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో ఫ్లైయింగ్ ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కీలక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఫ్లైయింగ్ ట్యాక్సీలో అందుబాటులోకి వస్తే మహా నగరాల్లో ట్రాఫిక్ చిక్కులు తప్పే అవకాశం ఉంది.