IRCTC Tickets Booking: ప్రతి రోజూ IRCTC ద్వారా కోట్లాది మంది ప్రయాణీకులు టికెట్లను బుక్ చేసుకుంటారు. తమతో పాటు బంధువులు, మిత్రులకు సైతం టికెట్స్ బుక్ చేస్తుంటారు. అయితే, ఒకరి IRCTC ఐడీతో వేరొకరికి టికెట్లు బుక్ చేయడం నేరమంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్ష పడే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో IRCTC ఐడీ ఉన్నవాళ్లు ఇతరులకు టికెట్ బుక్ చేసేందుకు భయపడ్డారు. IRCTC బుకింగ్ గురించి అవగాహన లేని వాళ్లు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలియక ఆందోళన చెందారు. ఈ విషయం రైల్వే అధికారులకు తెలియడంతో కీలక ప్రకటన చేశారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ ప్రచారం ప్రయాణీకులను పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని వెల్లడించారు.
IRCTC ద్వారా ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చు
IRCTC ఐడీ ద్వారా ఎవరు ఎవరికైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఇంటిపేరుతో సంబంధం లేకుండా టికెట్లు పొందచ్చని తెలిపారు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కు టికెట్లు తీసుకోవచ్చన్నారు. అయితే, తెలియని వారికి టికెట్లు బుక్ చేయకూడదని చెప్పారు. “వేర్వేరు ఇంటి పేర్లతో ఉన్నవారికి టికెట్లు బుక్ చేయడం నేరం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. అవన్నీ ప్రయాణీకులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. IRCTC ఐడీ నుంచి తమ కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ కు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంటి పేర్లతో ఎలాంటి సంబంధం లేదు. అయితే, తెలిసిన వారికి మాత్రమే టికెట్స్ బుక్ చేయడం మంచిది” అని IRCTC వివరణ ఇచ్చింది.
ఒక్కో వ్యక్తి నెలకు 12 టికెట్లు పొందే అవకాశం
IRCTCలో టికెట్ల బుకింగ్ అనేది రైల్వే బోర్డు గైడ్ లైన్స్ ప్రకారమే జరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ గైడ్ లైన్స్ వివరాలన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయన్నారు. IRCTC ఐడీ ఉన్న వారి ఇంటి పేరు, ప్లేస్ లాంటి వివరాలతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే, ఒక ఐడీ నుంచి నెలకు 12 టికెట్లు పొందే అవకాశం ఉందన్నారు. మరో వ్యక్తి ఆధార్ ను లింక్ చేస్తే 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
టికెట్లను అలా చేస్తే శిక్ష తప్పదు!
వ్యక్తిగత ఐడీలను ఉపయోగించి బుక్ చేసే టికెట్లను కమర్షియల్ గా అమ్మడం నేరమని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే చట్టం 1989 ప్రకారం ఇలా చేస్తే కేసులు నమోదు అవుతాయని వెల్లడించారు. వ్యక్తిగత ఐడీల ద్వారా ఎవరు, ఎవరికైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైల్వేశాఖ గురించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Read Also: ఒకే టికెట్ కు రెండు ధరలా? రైల్వేలో ఇలా కూడా జరుగుతుందా?