Anand Mahindra offers a Job to Teen: తెలివితేటలకు, సమయస్ఫూర్తికి వయసుతో సంబంధం లేదు. సందర్భాన్ని బట్టి మనిషి సమయస్ఫూర్తికి పదును పెడతాడు. మీరు గమనించినట్లైతే.. ఇటీవల ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అలెక్సాను వాడి.. 13 ఏళ్ల బాలిక తన మేనకోడలిని కోతుల బారి నుంచి రక్షించుకుంది. యూపీలోని బస్తీ జిల్లాకు చెందిన నికిత అనే బాలిక చేసిన సాహసమిది. కాదు కాదు.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరు ఇది.
15 నెలల వామికతో కలిసి నికిత ఆడుకుంటూ ఉండగా.. కోతుల సమూహం ఇంట్లోకి ప్రవేశించి ఆహారాన్ని, వస్తువులను పాడుచేశాయి. వాటిలో ఒకటి నికిత, వామికల వద్దకొచ్చింది. అదేం చేస్తుందోనని నికిత భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. వెంటనే అలెక్సా గుర్తొచ్చింది. అంతే.. దానికి కుక్కలా మొరుగు అని కమాండ్ ఇచ్చింది. వెంటనే అలెక్సా డాగ్ లా మొరుగుతూ పెద్దగా శబ్దాలు చేయడంతో కోతులు భయపడి అక్కడి నుంచి ఉడాయించాయి. ఈ విషయాన్ని నికిత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఆ వీడియో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కంట పడింది. మామూలుగానే ఆయన ఇలాంటి ఆసక్తికరమైన విషయాలపై తరచూ స్పందిస్తుంటారు. నికిత సమయస్ఫూర్తికి ఫిదా అయిపోయారు.
Also Read: విప్రో సీఈఓ రాజీనామా.. కొత్త బాస్ ఎవరంటే..?
“టెక్నాలజీకి మనం బానిసలుగా మారుతామా లేక టెక్నాలజీ మాస్టర్స్ అవుతామా అన్నది ఈ యుగంలో మనముందున్న ప్రధాన ప్రశ్న. కానీ.. ఈ బాలిక అలెక్సాను వాడిన తీరు చూశాక.. సాంకేతికత మన ఆజ్ఞలను పాటించేదే అన్న భావన కలిగింది. కోతుల ముందు ఆమె సమయస్ఫూర్తిగా వ్యవహరించిన తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. చదువు పూర్తయ్యాక.. ఆ బాలిక కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేయాలనుకుంటే.. మహీంద్రా రైజ్ లో చేరాలని ఆహ్వానిస్తున్నాం. ఆమెకు మేము ఉద్యోగమిస్తాం” అని ఆనంద్ మహీంద్రా X వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కింద నికిత ఎదుర్కొన్న పరిస్థితి వివరిస్తూ పోస్ట్ చేసిన వీడియో లింక్ ను కూడా జత చేశారాయన.
The dominant question of our era is whether we will become slaves or masters of technology.
The story of this young girl provides comfort that technology will always be an ENABLER of human ingenuity.
Her quick thinking was extraordinary.
What she demonstrated was the… https://t.co/HyTyuZzZBK
— anand mahindra (@anandmahindra) April 6, 2024