IRCTC Ticket Booking: రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ కు సంబంధించి భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును నెల రోజుల పాటు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ టైమ్ 120 రోజులు ఉండగా, ఇప్పుడు ఆ వ్యవధిని 60 రోజులకు కుదిస్తున్నట్లు వెల్లడించింది. కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇందుకోసం రైల్వేశాఖ IRCTC నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం రైలు ప్రయాణానికి మూడు నెలలు.. అంటే 120 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ సమయాన్ని రెండు నెలలలకు అంటే 60 రోజులకు తగ్గించింది రైల్వేశాఖ. ఈ నేపథ్యంలో ఇప్పటికే 120 రోజుల ముందుకు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకుల పరిస్థితి ఏంటి? అని చాలా మందిలో అనుమానం కలుగుతోంది. ఈ విషయంపై రైల్వే అధికారులు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. వారి రిజర్వేషన్ ప్రకారమే బెర్తుల కేటాయింపు జరుగుతుందని తెలిపింది. నవంబర్ 1 నుంచి కొత్తగా తీసుకొచ్చిన నిబంధన అమలు అవుతుందని తెలిపింది. అంటే ఈనెల(అక్టోబర్) 31 వరకు టికెట్ బుక్ చేసుకునే వారికి 120 రోజుల నిబంధనే అమలు అవుతుందని తెలిపింది.
#IndianRailways has shortened the Advance Reservation Period (ARP) from 120 to 60 days, effective from November 1.
However, all the bookings done up to 31st October this year will remain intact. @RailMinIndia said, there will be no change in the case of limit of 365 days for… pic.twitter.com/sAZcGxTlap
— All India Radio News (@airnewsalerts) October 17, 2024
ఆ రైళ్లలో మార్పులు ఉండవు!
రైల్వేశాఖ తాజాగా తీసుకొచ్చిన నిబంధన కొన్ని రైళ్లకు వర్తించదని వెల్లడించింది. తాజ్ ఎక్స్ ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్ లాంటి స్పెషల్ రైళ్లలో బుకింగ్ టైమ్ లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. ఇప్పటికే ఈ రైళ్లలో బుకింగ్ టైమ్ తక్కువగా ఉందని తెలిపింది. అయితే, ఫారిన్ టూరిస్టులు ఏడాది ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నిబంధనలో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించింది.
అప్పట్లో 60 రోజుల నుంచి 120 రోజులకు పెంపు
వాస్తవానికి అడ్వాన్స్ బుకింగ్ గడువు గతంలో 60 రోజులు ఉండేది. కానీ, కొద్ది సంవత్సరాల క్రితం 120 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కానీ, ఇప్పుడు మళ్లీ పాత పద్దతినే కొనసాగించడం విశేషం.
రిజర్వేషన్ కష్టాలు తగ్గే అవకాశం
రైల్వేశాఖ తాజాగా తీసుకొచ్చిన 60 రోజుల అడ్వాన్స్ బుకింగ్ పద్దతి ద్వారా ప్రయాణీకులకు చాలా లాభాలు కలుగుతాయని రైల్వేశాఖ భావిస్తోంది. ప్రయాణీకులకు టికెట్ రిజర్వేషన్ కష్టాలు తగ్గుతాయని తెలిపింది. ఎమర్జెన్సీ టికెట్స్ తోపాటు నెల రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకునే వారికి ఈ నిబంధన తో లాభం కలుగుతుందని తెలిపింది. అంతేకాదు, టికెట్ బుకింగ్ టైమ్ తగ్గించడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించవచ్చని భావిస్తున్నది. సాధారణ ప్రయాణీకులకు అడ్వాన్స్ బుకింగ్ మరింత అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.