Bigg Boss Nainika: బిగ్ బాస్ సీజన్ 8 నుండి నైనికా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. మిడ్ వీక్ జరిగిన ఎలిమినేషన్లో నైనికా డేంజర్ జోన్లో ఉన్నా కూడా ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వడంతో అప్పుడు ఆ ఎలిమినేషన్ నుండి తప్పించుకుంది. ఇప్పుడు ఫైనల్గా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్లక తప్పలేదు. నైనికా, సీత హౌస్లో బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో వదిలి వెళ్లడానికి చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్ నుండి స్టేజ్పైకి వచ్చిన తర్వాత హౌస్లోని అందరి గురించి మాట్లాడింది నైనికా. అంతే కాకుండా తనలో తానే ఒక కొత్త యాంగిల్ కనుగొన్నానని చెప్పుకొచ్చింది. తన రియల్ ఫ్రెండ్, ఫేక్ ఫ్రెండ్ ఎవరో కూడా బయటపెట్టింది.
చాలాసార్లు వెన్నుపోటు
బిగ్ బాస్ స్టేజ్పైకి వచ్చి తన జర్నీ చూసుకున్న తర్వాత తనలో అంత కోపం ఉందని మొదటిసారి తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది నైనికా. అంతే కాకుండా బిగ్ బాస్ అనేది జీవిత పాఠాన్ని నేర్పిస్తుందని తెలిపింది. ఇక హౌస్లో కంటెస్టెంట్స్లో ఒక్కొక్కరికీ ఒక్కొక్క ట్యాగ్ ఇవ్వమని చెప్పగా.. ముందుగా మ్యానిపులేటర్ అనే ట్యాగ్ను ప్రేరణకు ఇచ్చింది. తనకు గేమ్ మీద ముందే క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి ఎవరు ఎలా ఆడాలో ముందే ఊహిస్తుందని స్టేట్మెంట్ ఇచ్చింది. వెన్నుపోటు పొడిచే వ్యక్తి ఎవరు అంటే మణికంఠ అని చెప్పింది. అంతే కాకుడా తనకు ఓవర్ థింకింగ్ వదిలేయని, ప్రజలు తనను ఇష్టపడుతున్నందుకు మంచిగా ఆడమని సలహా ఇచ్చింది.
Also Read: బిగ్ బాస్ నుంచి నైనిక అవుట్.. 5 వారాలకు అన్ని లక్షలు తీసుకుందా?
గేమ్ మీద క్లారిటీ
బిగ్ బాస్ హౌస్లో నకిలీ స్నేహితుడు ట్యాగ్ను విష్ణుప్రియాకు ఇచ్చింది. సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా బాధలో ఉన్నప్పుడు తోడుగా ఉండేవారినే ఫ్రెండ్ అంటారని కానీ గతవారం నుండి తనతో సరిగా ఉండడం లేదని చెప్పుకొచ్చింది. పృథ్వికి ఊరికే అటెన్షన్ కావాలని ఉంటుందని, అద్దం ముందు నుండి అసలు కదలడని బయటపెట్టింది. అవకాశవాది ట్యాగ్ను నబీల్కు ఇచ్చింది. అసలు ఆ మాటకు నైనికాకు అర్థం తెలుసో తెలియదో కానీ.. నబీల్ గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పింది. తనకు గేమ్ మీద చాలా క్లారిటీ ఉందని, చాలా స్ట్రాంగ్గా ఆడతాడని తెలిపింది. నిజమైన ఫ్రెండ్ ఎవరూ అంటే అందరూ ఊహించినట్టుగానే సీత పేరు చెప్పింది.
తనే పోటీ
బిగ్ బాస్ షోలోకి రాకముందే సీతను చూసి తను ఫ్రెండ్ అవుతుందని ఊహించానని తెలిపింది నైనికా. తనతో కలిసి చేసిన బిగ్ బాస్ జర్నీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని చెప్తూ ఎమోషనల్ అయ్యింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో గేమ్ ఛేంజర్ ఎవరు అంటే నిఖిల్ అని చెప్పింది. టాస్క్లో తనను ఎప్పుడూ పోటీ అనుకునేదాన్ని అని, తన ఎమోషనే తన బలమని ప్రశంసించింది. తను ఎప్పటికీ విన్నరే అని తెలిపింది. మంద బుద్ధి అనే ట్యాగ్ను యష్మీకి ఇచ్చింది. అది ఎందుకు ఇచ్చిందో కూడా తనకు తెలుసని నవ్వింది. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టగానే యష్మీని చూసి తనను పోటీ అనుకున్నానని, అందరూ గర్వపడేలా చేయమని మోటివేషన్ ఇచ్చి వెళ్లిపోయింది నైనికా.