Bigg Boss : పాపులర్ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సెట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఏకంగా 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు ఒక వ్యక్తి. మరి అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అసలు ప్రమాదం ఎలా జరిగింది ? అనే వివరాల్లోకి..
బిగ్ బాస్ సెట్లో ప్రమాదం
స్మాల్ స్క్రీన్ రియాల్టీ షోలలో బిగ్ బాస్ కు అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికి 7 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ తమిళ షో 8వ సీజన్ త్వరలో ప్రారంభం కానుందని తాజాగా ప్రోమోను విడుదల చేశారు. బిగ్ బాస్ తమిళ్ 8వ సీజన్కి హోస్ట్ మారాడు అప్పటిదాకా హోస్ట్ గా చేసిన కమల్ హాసన్ షో నుండి వైదొలగడంతో నటుడు విజయ్ సేతుపతి హోస్ట్ చేయబోతున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ సెట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈవీపీ ఫిల్మ్ సిటీ పూంతమల్లి పక్కన చెంబరం బాక్కంలో ఉంది. ఈ ఫిల్మ్ సిటీలో వివిధ సినిమాలు, టీవీ సిరీస్ లు, షోల సెట్లు నిర్మించి, షూటింగులు చేస్తారు. అదే విధంగా ఒక ప్రైవేట్ ఛానల్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్ షో కోసం కూడా ఇక్కడ భారీ హౌస్ సెట్ ను నిర్మించి, చిత్రీకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ తమిళ్ 8వ సీజన్ అక్టోబర్ 6న ప్రారంభం కానుండగా, దాని కోసం ఏర్పాటు చేసిన బిగ్ బాస్ హౌస్ లోపల కొంత మెయింటెనెన్స్ వర్క్ జరుగుతోంది. ఈ పనిలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ కి చెందిన సైన్ ఖాన్ (47) బిగ్ బాస్ సెట్స్లో పని చేస్తుండగా, 20 అడుగుల ఎత్తు నుండి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన అక్కడున్న వారు అతడిని వెంటనే దగ్గరలోకి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. తంటాలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి సదరు వ్యక్తిని తీసుకెళ్లగా, ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై నసరపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అంత ఎత్తు నుంచి కింద పడినా ఆ వ్యక్తి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా కేవలం గాయాలతో బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వణుకు పుట్టిస్తున్న ఫిల్మ్ సిటీ
ఈవీపీ ఫిల్మ్ సిటీ పేరు చెప్తేనే వణికిపోయే సంఘటనలు జరుగుతున్నాయి అక్కడ. భారీ సినిమాల చిత్రీకరణకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ ఫిల్మ్ సిటీలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల సెట్స్ లో షూటింగ్ జరుగుతుండగా, ఇండియన్ 2, కాలా, బిగిల్ వంటి సినిమాల సెట్స్ వేసే క్రమంలో క్రేన్ పడిపోవడంతో పాటు, కొందరు చనిపోయారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏకంగా 20 అడుగుల ఎత్తు నుంచి పడి చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాడు. మరి ఇంకా ఇలా అజాగ్రత్తగా ఉంటూ ఎంత మంది ప్రాణాలను బలి తీసుకుంటారు? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఫిల్మ్ సిటీలో కొత్త సెట్ల ఏర్పాటు పనులు సాగుతుండగా.. పోలీసులు వెళ్లి తగిన అనుమతులతోనే ఈ సెట్లు వేస్తున్నారా లేదా అనే కోణంలో విచారణ జరిపించాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఉత్తర రాష్ట్ర కార్మికులు సరైన భద్రతా పరికరాలు లేకుండా పని చేస్తున్నారని, తగిన జాగ్రత్తలు తీసుకున్నాకే వాళ్ళను పనిలోకి తీసుకోవాలని కోరుతున్నారు.