Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో మరో సండే ఫన్డే వచ్చేసింది. ఈ సండే ఫన్డే కోసం కంటెస్టెంట్స్ అంతా రెట్రో స్టైల్లో రెడీ అయ్యారు. సినిమా పాటలకు పజిల్స్ ఆడి వాళ్లు ఎంటర్టైన్ అవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ప్రతీ సండే లాగా ఈసారి కూడా విష్ణుప్రియా, పృథ్వి పెయిర్ హైలెట్ అయ్యింది. అంతే కాకుండా విష్ణుప్రియా పర్ఫార్మెన్స్కు నాగార్జున సైతం ఫిదా అయ్యారు. పాత పాటలు, సినిమా పజిల్స్తో సండే ఫన్డే ఎపిసోడ్ అంతా ఎంటర్టైనింగ్గా మారింది. ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఈ సన్డే ఫన్డే ప్రేక్షకులకు కూడా మంచి ఫన్ ఇచ్చేలా ఉందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
విష్ణుప్రియానే నెంబర్ 1
‘‘ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు ట్యూన్ పట్టు గెస్ కొట్టు’’ అంటూ ఆట గురించి నాగార్జున వివరించడంతో ప్రోమో మొదలవుతుంది. ఈ టాస్క్ ప్రకారం సమయానుసారం కొన్ని ట్యూన్స్ వినిపిస్తారు బిగ్ బాస్. ఆ పాట ఏంటి, అందులో నటించిన నటీనటులు ఎవరు అని గెస్ చేసి, అక్కడ ఒక పజిల్లోని ఫోటోలను ముందుగా కనిపెట్టి బోర్డ్పై అతికించిన వారే విన్నర్స్. ఫస్ట్ రౌండ్లో ఈ టాస్క్ ఆడడానికి విష్ణుప్రియా, పృథ్వి ముందుకొచ్చారు. ‘హలో బ్రదర్’లోని ప్రియరాగాలే పాటను ముందుగా విష్ణుప్రియా కరెక్ట్గా గెస్ చేసింది. నాగార్జున, సౌందర్య ఫోటోలను తీసుకొని ముందుగా బోర్డ్పై పెట్టింది. దీంతో గెలిచిన సంతోషంలో ఆ పాటకు పృథ్వితో కలిసి స్టెప్పులేసింది కూడా.
Also Read: బిగ్ బాస్ నుండి సోనియా ఔట్.. కారణాలు ఇవే అంటున్న ప్రేక్షకులు
కళమ్మ తల్లి ముద్దుబిడ్డ
ప్రియరాగాలే పాటలోని ప్రతీ స్టెప్పును గుర్తుపెట్టుకొని చేసింది విష్ణుప్రియా. ‘‘నేనే ఆ స్టెప్స్ మర్చిపోయాను. నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావంటే నిజంగానే కళమ్మ తల్లి ముద్దుబిడ్డవి’’ అని పొగడగానే విష్ణుప్రియా మురిసిపోయింది. ఆ తర్వాత ప్రేరణ, యష్మీ.. ఈ పోటీలోకి దిగారు. అందులో వెంకటేశ్ ఫోటో ముందుగా యష్మీకి దొరకగా.. అసిన్ ఫోటో మాత్రం ప్రేరణకు దొరికింది. దీంతో ఒకరి చేతిలో ఉన్న ఫోటోను మరొకరు లాక్కోవడానికి ప్రయత్నించారు. అందులో ప్రేరణనే రెండు ఫోటోలు లాక్కొని అతికించింది. ఆ తర్వాత ఆదిత్య ఓం, సీత ఆటలోకి దిగారు. అందులో సీతనే పాటను కరెక్ట్ గెస్ చేసి ఫోటోలు ముందుగా బోర్డ్పై అతికించింది.
నామినేషన్స్లో ఆ కంటెస్టెంట్స్
చివరిగా విష్ణుప్రియా, సోనియా వచ్చినప్పుడు కూడా విష్ణుప్రియానే గెలిచింది. దానికి పృథ్వితో పాటు ఇతర కంటెస్టెంట్స్తో కలిసి స్టెప్పులేసింది. ఫైనల్గా నామినేషన్స్లో ఇంకా సోనియా, ఆదిత్య ఓం, పృథ్వి, ప్రేరణ, మణికంఠ ఉన్నారు. ఇక శనివారం ఎపిసోడ్లో కంటెస్టెంట్స్లో చాలామంది మణికంఠకు జీరో అని స్టాంప్ వేయడంతో తను డేంజర్ జోన్లోకి వెళ్లిపోయాడు. కానీ ఇప్పటికే సోనియా ఎలిమినేట్ అయ్యిందని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ బయటికొచ్చింది. దీంతో సోనియాను ఇష్టపడని ప్రేక్షకులంతా తను ఎలిమినేట్ అవ్వడం కరెక్టే అంటున్నారు. అంతే కాకుండా అసలు నిఖిల్, పృథ్వి తను లేకుండా హౌస్లో ఎలా ఉంటారో అని సెటైర్లు వేస్తున్నారు.