Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారానికి చేరుకునేసరికి నాగార్జున కూడా పలువురు కంటెస్టెంట్స్ ప్రవర్తనపై, హౌజ్లో చీఫ్ల వ్యవహార శైలిపై సీరియస్ అయ్యారు. బిగ్ బాస్ 8 మొదటి వారంలో కంటెస్టెంట్స్ గురించి తమ తోటి కంటెస్టెంట్సే మాట్లాడాలని జడ్జిమెంట్ తమకే వదిలేశారు. ఈసారి కూడా కంటెస్టెంట్స్ ఎలా ఆడారు అనే విషయాన్ని చీఫ్స్లను నిర్ణయించమని చెప్పారు. దీంతో ముందుగా తన టీమ్ గురించి చెప్పడానికి యష్మీ ముందుకొచ్చింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఈ ప్రోమో చూసిన తర్వాత యష్మీ మహానటన తట్టుకోలేకపోతున్నామని ప్రేక్షకులు అప్పుడే కామెంట్లు మొదలుపెట్టారు.
అభయ్ తోశాడు
‘‘మీ టీమ్ పర్ఫార్మెన్స్ ఏంటి అని మీరే చెప్పాలి’’ అంటూ ప్రోమో మొదట్లోనే ముగ్గురు చీఫ్లను నిలబెట్టి మరీ చెప్పారు నాగార్జున. రెడ్, గ్రీన్ అంటూ రెండు కేటగిరిలు ఇచ్చి తన టీమ్ సభ్యులలో ఎవరు రెడ్లో ఉండాలి, ఎవరు గ్రీన్లో ఉండాలి నిర్ణయించమన్నారు. ముందుగా తన టీమ్లోని అభయ్ను గ్రీన్ జోన్లో పెట్టింది యష్మీ. ‘‘నీ ఉద్దేశ్యంలో అభయ్ టాస్కులు బాగా ఆడాడు’’ అని నాగార్జున అనగానే అవును అని సమాధానమిచ్చింది యష్మీ. ‘‘మరి విష్ణుప్రియ ఉద్దేశ్యంలో?’’ అంటూ సాక్స్ టాస్క్లో అభయ్.. విష్ణుప్రియాను తోసేయడం గురించి ప్రస్తావించారు. అదే విషయాన్ని విష్ణుప్రియాను కూడా అడిగారు. ‘‘నన్ను ఒకానొక సమయంలో అభయ్ తోశారు. అన్న ఏమో నేను అలా చేయలేదు అని వాదిస్తున్నాడు’’ అని విష్ణుప్రియా చెప్పుకొచ్చింది.
Also Read: యష్మీకి బుల్లితెర ప్రేక్షకుల శిక్ష.. ఇక సీరియల్స్ మానుకొని ఇంటికి వెళ్లక తప్పదా?
గట్టి వార్నింగ్
అసలు అభయ్, విష్ణుప్రియా మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం అందరికీ సాక్స్ టాస్క్ వీడియో చూపించారు నాగార్జున. అభయ్ తర్వాత పృథ్విని గ్రీన్ జోన్లో పెట్టింది యష్మీ. ‘‘పృథ్వి ఏ టాస్క్ ఆడినా వందశాతం కష్టపడ్డాడు’’ అని యష్మీ చెప్తుండగానే వ్యాక్సింగ్ టాస్క్లో మధ్యలో వెళ్లిపోయిన విషయాన్ని గుర్తుచేశారు నాగార్జున. ‘‘ఆటలో కొన్ని వాడకూడని పదాలు వాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకో లేదనుకో’’ అంటూ గన్ చూపించి పృథ్వికి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత తన టీమ్లోని ప్రేరణను రెడ్ జోన్లో పెట్టింది యష్మీ. ‘‘ప్రేరణ సంచాలకురాలిగా వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది’’ అని యష్మీ చెప్పింది.
సంచాలకురాలిగా ఫెయిల్
ప్రేరణకు సపోర్ట్గా నాగార్జున.. ‘‘తను కన్ఫ్యూజ్ అయ్యిందా? మీ టీమ్ అంతా కలిసి చుట్టూ చేరి కన్ఫ్యూజ్ చేశారా? సంచాలకుల విషయం మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఒక విషయం అడుగుతాను. మణికంఠ, సీత.. వాళ్లిద్దరి ఆటలో నువ్వే సంచాలకురాలు. 250 గ్రాముల విషయంలో నీ నిర్ణయం కరెక్టా’’ అని యష్మీని అడిగారు. ఆ విషయంలో యష్మీని ముందే స్పష్టంగా అడిగాను అని మణికంఠ చెప్తుండగానే అడగలేదు అని యష్మీ జోక్యం చేసుకుంది. దీంతో అసలు ఏం జరిగిందో వీడియో చూపించారు నాగార్జున. అందులో యష్మీ అబద్ధం చెప్పినట్టు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దీంతో మొసలి కన్నీళ్లతో నాటకం మొదలుపెట్టింది. నైనికా టీమ్ గెలవాలని అలా చేశానని చెప్పగా ముందే ఒప్పుకోవచ్చుగా అని నాగార్జున అన్నారు.