Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన కంటెస్టెంట్స్ అంతా మొదటిరోజే బాగా కలిసిపోయారు. వారందరికీ కలిపి రాయల్స్ అనే పేరు కూడా ఇచ్చారు బిగ్ బాస్. టాస్కుల విషయంలో, పాత కంటెస్టెంట్స్ను ఎదిరించే విషయంలో అందరూ కలిసికట్టుగా నిలబడ్డారు. కానీ రెండు వారాల తర్వాత వారిలో మనస్పర్థలు మొదలయ్యాయి. రాయల్స్ టీమ్లో హరితేజ, నయని పావని ఒకవైపు.. మిగతా టీమ్ అంతా ఒకవైపు అయిపోయింది. అసలు అబ్బాయిలు తప్పా అమ్మాయిలకు ఆడడానికి ఛాన్స్ ఇవ్వకుండా నయని పావని ఫీలింగ్స్ను హర్ట్ చేసింది టీమ్. అవతలి వైపు ఓజీ టీమ్లో కూడా ప్రేరణ విషయంలో ఇదే అన్యాయం జరుగుతోంది.
తేజనే ఎందుకు?
బీబీ రాజ్యం టాస్క్లో ఓజీ టీమ్ నుండి వరుసగా నిఖిల్, పృథ్వి, నబీల్ మాత్రమే ఆడడానికి వస్తున్నారు. వారి టీమ్లో ఉన్న ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియా అయితే కనీసం ఆడడానికి ఆసక్తి ఉందని కూడా చెప్పకుండా టీమ్ గెలిస్తే చాలు అని అబ్బాయిలనే ముందుకు తోస్తున్నారు. కానీ రాయల్స్ టీమ్లో అలా కాదు.. నయని పావని, హరితేజకు దాదాపు ప్రతీ టాస్క్ ఆడాలనే ఉంటుంది. కానీ అవతలి టీమ్ నుండి అబ్బాయిలు వస్తున్నారు కాబట్టి ఈ టీమ్ నుండి కూడా స్ట్రాంగ్గా అబ్బాయిలే వెళ్తే బాగుంటుంది అని వారు లెక్కలు వేస్తున్నారు. బీబీ రాజ్యం టాస్క్లో టేస్టీ తేజను పంపడానికి ఒప్పుకుంది టీమ్. అది నయని పావనికి అస్సలు నచ్చలేదు. అందుకే రోహిణితో డిస్కషన్ పెట్టింది.
Also Read: బిగ్ బాస్లో మరో మిడ్ వీక్ ఎలిమినేషన్.. మళ్లీ అదే రిపీట్
నయని హర్ట్
ఓజీ టీమ్ నుండి నిఖిల్ వచ్చాడు కాబట్టి నయని పావనిని ఆడనివ్వకుండా చేసేంత స్టామినా తన దగ్గర ఉందని రోహిణి వివరించింది. అయినా కూడా తేజ తనకంటే స్ట్రాంగ్ కాదని నయని ఫీలయ్యింది. ఇక హరితేజ కూడా టాస్కులు ఎంత బాగా ఆడినా, ఎంత యాక్టివ్గా ఉన్న తనకు ఒక్కసారి కూడా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం దక్కలేదు. దీంతో తను కూడా హర్ట్ అయ్యింది. అలా హరితేజ, నయని పావని ఇద్దరే కాస్త విడిగా ఉండడం మొదలుపెట్టారు. ఈ మార్పులను ఇతర టీమ్ సభ్యులు కూడా గమనించారు. అయితే వారి మధ్య ఉన్న మనస్పర్థలను దూరం చేయడం కోసం గౌతమ్ రంగంలోకి దిగాడు. టీమ్ అందరినీ కూర్చొబెట్టి మాట్లాడాడు. తనకు ప్రతీ టాస్క్లో ఆడాలని ఉన్నా పంపించడం లేదని బాధంతా బయటపెట్టింది నయని పావని.
పట్టించుకోని ఫ్రెండ్స్
మరోవైపు ఓజీ టీమ్లో కూడా ప్రేరణతో ఇతర టీమ్ సభ్యులకు మనస్పర్థలు వస్తున్నాయి. ఫ్రెండ్ అని చెప్పుకొని తిరిగే యష్మీ కూడా ప్రేరణతో సరిగ్గా ప్రవర్తించడం లేదు. ఓజీ నుండి పృథ్విని మెగా చీఫ్ కంటెండర్ చేయడం ప్రేరణకు ఇష్టం లేదు. కానీ ఎందుకు ఇష్టం లేదు అనే కారణం వినడానికి కూడా యష్మీ సిద్ధంగా లేదు. పైగా తిరిగి ప్రేరణపైనే అరిచింది. మరోసారి అవకాశం వచ్చినప్పుడు కూడా అందరూ కలిసి నిఖిల్ను మెగా చీఫ్ కంటెండర్గా ఎంపిక చేశారు. ప్రేరణ, విష్ణుప్రియా ఇప్పటివరకు మెగా చీఫ్స్ కాకపోయినా అసలు వారి పేర్లు చెప్పడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు. తనకు చీఫ్ అవ్వాలని ఉందని ప్రేరణ నోరుతెరిచి చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదు.