Jagan Rushikonda Palace Secrets: ప్రజల సొమ్ముపై తనకు పేటెంట్ ఉన్నట్లు ఇష్టానుసారం ఖర్చుచేసి.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాచరిక పాలన సాగించారు జగన్. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజాసంక్షేమం కన్నా తన విలాసాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఒకవైపు అప్పులు పుట్టించడంలో తనదైన టెక్నిక్లు ప్రదర్శిస్తూ.. తన రాజసం ఏ మాత్రం తగ్గకూడదన్నట్లు తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసును ప్రభుత్వ సొమ్ముతో అత్యంత మోడ్రన్గా మార్చారు. అటు రుషికొండలో టూరిజం ఆదాయానికి గండికొట్టి మళ్లీ అధికారంలోకి వస్తానన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో మరో మహల్ కట్టించారు. గద్దె దిగగానే ఆయన రాచరిక అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ.. ప్రజలకు ఊహించని షాక్లు ఇస్తున్నాయి.
అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజాసంక్షేమం కన్నా తన విలాసాలకే ప్రాధాన్యత ఇచ్చిన జగన్. ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా అదే రాచరికం కొనసాగిస్తున్నారు. ప్రజాధనాన్ని సొంత సొమ్ములా ఖర్చుపెట్టుకున్న మాజీ సీఎం ఇప్పటికీ అదే పోకడలు పోతుండటం విమర్శల పాలవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నానని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దాంతో పాపం అమరావతి రాజధాని ప్రాంత వాసులు గుడ్డిగా నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక తనదైన మార్క్ చూపించారు. మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూశారు. తాడేపల్లి కోటను అధికారిక సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. అక్కడ ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రహదారిని సొంత రోడ్డులా ఆక్రమించి ఆ వైపు ఏ ఒక్కరినీ అనుమతించకుండా నిషేధించారు. జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపు 5 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు వరకు డబుల్ లేన్ రోడ్డు వేయాలని నిధులు మంజూరు చేస్తే వాటితో కేవలం తన ప్యాలెస్ దగ్గర మాత్రమే రోడ్డు నిర్మించారు.
జగన్ ఇంటి దగ్గర ఉన్న కరకట్టపై వందల కుటుంబాలు నివాసముంటాయి. ఆ మార్గంపై కూడా రాకపోకలు నిలిపివేయడంతో స్థానికులు నానా పాట్లూ పడ్డారు. రేవేంద్రపాడు వైపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గృహ నిర్మాణాలు ఉన్నప్పటికీ ఐదేళ్లుగా అటు వైపు ఎవరినీ అనుమతించలేదు. ఇక జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజాధనం వినియోగించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఆ భవనం ప్రైవేటు కట్టడం అయినప్పటికీ భద్రత పేరుతో ఇంటి చుట్టూ ప్రహరీపై 20 అడుగుల ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్, 1.13 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అదంతా ప్రభుత్వ సొమ్ముతోనే చేయించుకున్నారు.
Also Read: తొలిసారి క్షేత్రస్థాయి టూర్.. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన
క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్, ఇతర సామగ్రి కూడా ప్రజాధనంతో కొనుగోలు చేసినవే.. దాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి హెచ్ బ్లాక్ నుంచి యూపీఎస్, కంప్యూటర్లను అక్కడికి తరలించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత క్యాంపు కార్యాలయంలో రాజకీయ భేటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. దాన్ని ప్రస్తుతం వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్చుకున్నారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్, ఇతర సామగ్రినే అక్కడ వాడుతున్నారు.
దానిపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అప్పట్లో నిధుల మంజూరుకు విడుదల చేసిన జీవోలు, ప్రజాధనంతో ఏయే సామగ్రిని కొనుగోలు చేశారనే వివరాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే విచారణకు ఆదేశించడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక విశాఖలో రుషికొండ ప్యాలెస్ .. అమరావతి రాజధానిగా అసెంబ్లీలో జగన్ మద్దతు ఇచ్చి తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. పచ్చటి రుషికొండకు మాజీ సీఎం జగన్ తవ్వించేశారు.. దేశంలో ఎక్కడా లేనటు వంటి విలాసవంతమైన భవనాలను నిర్మించారు. అత్యంత రహస్యంగా వీటిని నిర్మించారు. లాభాల్లో ఉన్న టూరిజం భవనాలు కూల్చి రాజ భవనాలు నిర్మించారు.
అమరావతిలో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికకు అనుమతులు లేవని కూల్చివేయించి.. తన విధ్వంస పాలన మొదలుపెట్టారు జగన్ అయితే మరోసారి సీఎం అవుతానన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో విశాఖకు రాజధాని మార్చాలని రుషికొండలో ఎలాంటి అనుమతులు లేకుండానే రాజప్రసాదం కట్టించారు .. దానిపై కేసులు పెడితే కోర్టుకు కూడా తప్పుడు సమాచారం అందించారు. 61ఎకరాల్లో మొత్తం ఏడు బ్లాకులు నిర్మించారు. దానికి వెచ్చించిందంతా ప్రజల సొమ్మే.
గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు, కార్యకర్తలు రుషికొండ వస్తే అడ్డుకున్నారు. కేసులు పెట్టించారు. విశాఖ నుంచే జగన్ పరిపాలన సాగుతుందని వైసీపీ ప్రభుత్వం అనేక ముహూర్తాలు ఫిక్స్ చేసింది. అయితే అమరావతి రైతుల న్యాయపోరాటంతో మూడు రాజధానుల దిశగా.. జగన్ ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు .. అంత సీక్రెట్గా జగన్ మోజుపడి ప్రజలసొమ్ముతో కట్టించుకున్న రుషికొండ రాజమహల్ రహస్యం ఇప్పుడు తెలిసిందని భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎట్టకేలకు రుషికొండ భవనాలను పరిశీలించిన ఆయన ఎన్నో ఏళ్ల ఉత్కంఠ ఇవాళ తీరిందన్నారు.
Also Read: ఏపీ టీడీపీ అధ్యక్షుడి పేరును ప్రకటించిన చంద్రబాబు
మొత్తానికి మూడు రాజధానులు అక్కర్లేదు.. అమరావతి రాజధాని రాజధాని చాలంటూ.. ప్రజలు వైసీపీకి దారుణంగా బుద్ది చెప్పారు.. విశాఖ మహానగరంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకుండా చేశారు. 500 కోట్ల రూపాయల ప్రజా ధనంతో మాజీ సీఎం అంత ముచ్చటపడి కట్టించుకున్న ఆ రాజమహల్ను ప్రస్తుతం ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుందో? ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై ఏం నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తి రేపుతుంది.