తన అన్న జగన్ వైసీపీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీకి మూలస్థంభంగా నిలిచారు వైఎస్ షర్మిల.. అన్న జైల్లో ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి పార్టీకి పునాదులు వేశారు. ఆ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణానంతరం జగన్, షర్మిలలు పొలిటికల్గా హైలెట్ అయినప్పటి నుంచి.. అంటే 2012లో వైసీపీ స్థాపించినప్పటి నుంచి వైఎస్ ఫ్యామిలీలో రాఖీ పండుగ హడావుడి కనిపించేది. జగన్ ఇంటికెళ్లి మరీ షర్మిల రాఖీ కట్టి వచ్చేవారు. జగన్ ఆమెకు స్వీట్లు తినిపిస్తూ ఆశీర్వదించేవారు. సదరు ఫొటోలు ప్రతి ఏడాది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వైఎస్ అభిమానులను అలరించేవి.
అయితే కొన్నేళ్లుగా సీన్ మారిపోయింది. అన్నాచెల్లెల్లు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల పీసీసీ ప్రెసిడెంట్గా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వారి మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయింది. 2022 నుంచే వారి మధ్య రాఖీ కట్టించుకునే బంధం తెగిపోయింది. అప్పట్లో తెలంగాణలో పార్టీ పెట్టుకుని వైటీపీ అధినేత్రిగా ఉన్న షర్మిల ట్విట్టర్ వేదికగా తన అన్నకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ఏడాదీ అదీ లేకుండా పోయింది. ఇప్పటికే వైసీపీతో పాటు జగన్ను ఒక రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం జగన్ ఓటమే ధ్వేయంగా ప్రచారం చేశారు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె అన్నని వదలడం లేదు. వైసీపీ ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని శాపనార్థాలు పెడుతూ.. జగన్ పుండుపై కారం చల్లుతూనే ఉన్నారు.
అలా ఫక్తు పొలిటీషియన్గా మారిన షర్మిల ఈ సారి జగన్కు కనీసం రాఖీ శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. జగన్ కూడా బెంగళూరు ప్యాలెస్లో సేద తీరుతూ.. ఎక్ష్ ఖాతాలో పోస్టు పెట్టారు. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలని పోస్టు పెట్టిన ఆయన తన సొంత చెల్లెలి పేరు కూడా ప్రస్తావించలేదు. ఇక తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో రాఖీ పండుగ హడావుడి ప్రతి ఏడాది కనిపించేది. ఎమ్మెల్సీ కవిత తన అన్న కేటీఆర్కి ప్రతి ఏడాది రాఖీ కట్టేవారు.. ఢిల్లీ అయితే ఆమె లిక్కర్ స్కాంలో అరెస్టయి ఐదు నెలలకు పైగా హైదరాబాద్ కు దూరమయ్యారు. కవిత అనూహ్యంగా సొంత కుంటుబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది.
Also Read: మాజీ మంత్రి జోగి రమేష్కు మరిన్ని కష్టాలు.. ఫ్యామిలీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. తిహార్ జైల్లో ఉన్న కవిత.. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నెల 12న పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం.. సీబీఐ, ఈడీ స్పందనలు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
సరిగ్గా ఏడాది కిందట రాఖీ పండుగ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కవిత అన్న కేటీఆర్ తెలంగాణలో కీలక శాఖల మంత్రిగా ఉన్నారు… దీంతో కేటీఆర్ కు కవిత రాఖీ కట్టే ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆమె జైల్లో ఉన్నారు. ఆమె బెయిల్ కోసం కేటీఆర్ ఢిల్లీ వెళ్లి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించడం లేదు. ఆ క్రమంలో రాఖీ పండుగ సందర్భంగా కేటీఆర్ తన సోదరిని తలచుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు.
‘‘నువ్వు ఇవాళ రాఖీ కట్టకపోయినా నీ కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటాను.’’ అంటూ ట్వీట్ లో కేటీఆర్ పేర్కొన్నారు. దానికి గతంలో కవిత రాఖీ కట్టినప్పటి, ఆమెను ఈడీ అరెస్టు చేస్తున్న సమయంలోని ఫొటోలను జత చేశారు. మొత్తానికి రెండు రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్లు మాజీ ముఖ్యమంత్రులయ్యాక అలా తయారైంది పరిస్థితి.