బలమైన క్యాడర్.. సమర్ధుడైన అధ్యక్షుడు ఉన్నప్పటికీ.. జనసేనకు వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లో సరైన నాయకులు లేరు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన విషయంలో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. మొన్నటి ఎన్నికల్లో పవన్కళ్యాణ్ పార్టీ 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఆ సందర్భంగా పవన్ సైతం నాయకత్వలేమిని పరోక్షంగా అంగీకరించారు. అయితే పొత్తుల బలం, పవన్ ఛరిష్మాతో జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది. జనసేనాని డిప్యూటీ సీఎం అయ్యాక ఆ పార్టీ ఫేట్ మారిపోయింది.
జగన్ బాసిసజంతో విసిగివేసారి పోయిన వైసీపీ బడా నేతలంతా ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. అలాంటి సీనియర్లకు ఇప్పుడు జనసేన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో జనసేనకు బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఇంత వరకు చెప్పుకోదగ్గ లీడర్లు లేరు. ఇప్పుడు మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రూపంలో ఆ పార్టీకి జిల్లాలో సరైన ఆయుధం దొరికింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి.. జనసేనకు ఫిక్స్ అయ్యారు. దాంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేనకు కొత్త జోష్ వచ్చినట్లైంది.
ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకునిగా పేరున్న బాలినేని ఇప్పటికే తన రాజీనామా లేఖను జగన్కు పంపారు. కొన్నాళ్లుగా ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తి ఉన్న బాలినేని. ఎట్టకేలకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పాశారు. జనసేనలో ఎంట్రీ సమయానికే బాలినేని జనసేనకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారంట. ఒంగోలు కార్పొరేషన్ను జనసేనానికి బహుమతిగా ఇవ్వాలని బాలినేని డిసైడ్ అయ్యారంట. అందులో భాగంగా వైసీసీ నుంచి టీడీపీలోకి వెళ్లిన తన అనుచరులైన 20 మంది కార్పొరేటర్లను.. తిరిగి జనసేనలో చేర్చేందుకు ఫిక్స్ అయ్యారంట. 50 డివిజన్లు ఉన్న ఒంగోలులో వైసీపీ 41 మంది కార్పొరేటర్లను గెలుచుకుంది. ఇప్పటికే 20 మంది పార్టీ మారడంతో వైసీపీ మైనార్టీలో పడిపోయింది. ఆ క్రమంలో ఒంగోలు మేయర్ పదవిని జనసేన చీఫ్ పవన్కు గిఫ్ట్గా ఇవ్వాలని బాలినేని ప్లాన్ చేస్తున్నారంట.
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తన అనుచర వర్గంతో కలిసి జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జగ్గయ్యపేటలో 1999 నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సామినేని కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆ సీనియర్ నేతకు జగన్ కేబినెట్లో బెర్త్ దక్కలేదు. అప్పటి నుంచి ఒకింత అసంతృప్తితో కనిపిస్తున్న ఆయన.. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి పూర్తిగా దూరమయ్యారు. తాజాగా బాలినేని రాజీనామా తరహాలోనే ఉదయభాను కూడా ముందు వైసీపికి రాజీనామా చేసి జనసేన జెండాను భుజానికి ఎత్తుకోవడానికి రెడీ అయ్యారు.
Also Read: జగన్ను వెంటాడుతున్న శని, పుష్కరకాలంపాటు..
కాంగ్రెస్, వైసీపీల్లో సీనియర్ నాయకుడిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ప్రభుత్వ విప్గా ప్రాతినిధ్యం వహించిన ఉదయభానుకు సముచిత స్థానం ఇచ్చేలా జనసేన నాయకత్వం నుంచి హామీ లభించిందంటున్నారు. ఆయన నేడో రేపో జగన్కు రాజీనామా లేఖ పంపించి పవన్కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 22న జనసేనలో చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందంటున్నారు.
మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రెండు జిల్లాల్లో ఖాతా తెరవలేకపోయిన వైసీపీ ఇప్పుడు వలసలతో ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా 2019 ఎన్నికల్లో పవన్కళ్యాణ్పై అనూహ్య విజయం సాధించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇప్పుడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారంట. మొన్నటి ఎన్నికల్లో పరాజయం తర్వాత గ్రంథి వైసీపీ కార్యకలాపాల్లో కనిపించడమే మానేశారు. అయితే ఆయన వైసీపీని వీడి మరో పార్టీలో చేరతారా? లేకపోతే రాజకీయాలకు దూరమవుతారా? అన్నది చర్చల్లో నలుగుతోంది. ఆయనకు జనసేన తలుపులు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు.
గత ఎన్నికల ముందు పవన్కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించిన గ్రంథిపై జనసైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పవన్ ప్యాకేజ్ స్టార్ అని ప్యాకేజీలకు అమ్ముడుపోయే నాయకులు రాజకీయాలకు పనికి రారని సింగిల్ గా పోటీ చేసే దమ్ము పవన్ కల్యాణ్ కు లేదని గ్రంథి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో చెలరేగిపోయారు. దాంతో వైసీపీని వీడతే ఆయన రాజకీయ పయనం ఎటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఉండి నుంచి వైసీపీ తరపున రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన పీవీఎల్ నరసింహరాజు కూడా ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుతుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్గా ఉన్న నరిసింహరాజు కూడా జగన్కు ఝలక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటున్నారు. మరి వైసీపీలో రాజకీయాల పర్వం ఆ పార్టీని ఏ ఓడ్డుకి చేరుస్తుందో చూడాలి.