హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ వరుసగా మూడో సారి ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ బాలయ్యకు చెక్ పెట్టడానికి వైసీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు .. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే తన శిష్యుడి భార్య దీపికకు ఏరికోరి హిందూపూరం టికెట్ ఇప్పించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డారు. విచ్చలవిడిగా డబ్బులు వెదలజల్లారన్న ప్రచారం ఉంది. అయితే గత ఎన్నికల కంటే డబుల్ మెజార్టీతో .. అంటే 32 వేల 597 ఓట్ల మెజార్టీతో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు.
కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్కళ్యాణ్, హిందూపురంలో బాలకృష్ణలను మొన్నటి ఎన్నికల్లో జగన్ పర్సనల్గా తీసుకుని వారి ఓటమికి గట్టిగానే పావులు కదిపారు .. హిందూపురంపై అంత ప్రత్యేకంగా దృష్టి సారించడానికి కారణం.. అక్కడ వైసీపీ జెండానే కాదు. అంతకు ముందు కాంగ్రెస్ జెండా కూడా ఎప్పుడూ ఎగరలేదు. టీడీపీ ఆవిర్భావం తర్వాత అక్కడ 11 సార్లు ఎన్నికలు జరిగేతే అన్ని సార్లూ టీడీపీ అభ్యర్ధులకే పట్టం కట్టారు ఓటర్లు .. వైసీపీ పోటీ చేసిన మూడు సార్లూ అభ్యర్ధులను మార్చిన జగన్ చేతులు కాల్చుకున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి హిందూపురంలో పోటీ చేసిన మహ్మద్ ఇక్బాల్… ఈ ఎన్నికల ముందు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ బాలకృష్ణకు జై కొట్టారు … ప్రస్తుతం మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన దీపిక బెంగళూరు వెళ్లిపోవడంతో హిందూపురంలో వైసీపీకి పెద్ద దిక్కే లేకుండా పోయారు. ఆ క్రమంలో హిందూపురంలో సెగ్మెంట్లోని లోకల్ బాడీస్లో కూడా వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హిందూపురం మున్సిపల్ పీఠం అధిష్టించేందుకు టీడీపీకి లైన్ క్లియర్ అయ్యింది. వైసీపీకి చెందిన మునిసిపల్ చైర్పర్సన్ ఇంద్రజ టీడీపీలో చేరి తన పదవికి రాజీనామా చేశారు.
పలువురు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో చైర్మన్ సీటు టీడీపీ ఖాతాలో పడటం ఖాయమైంది. 2021లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ అత్యధిక స్థానాలు గెలిచింది. మునిసిపల్ చైర్మన్ స్థానం జనరల్ అయినప్పటికీ పార్టీలో అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో బీసీ కులానికి చెందిన ఇంద్రజకు చైర్పర్సన్గా వైసీపీ అవకాశం కల్పించింది. అయితే మొదటి రెండు మూడు నెలలు మాత్రమే పాలన సజావుగా సాగింది. వైసీపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోవడంతో ఇంద్రజకు ఇబ్బందులు మొదలయ్యాయంటారు. అయినా అప్పటి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఇక్బాల్ సహకారంతో వ్యవహారం సజావుగానే సాగింది.
Also Read: జగన్ గారూ.. మహిళల కోసం మీరు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది: అనిత
అయితే 2023లో ఇక్బాల్ను ఇన్చార్జ్గా తొలగించారు. దీపిక ఇన్చార్జ్గా వచ్చింది. అప్పటి నుంచి ఇంద్రజ డమ్మీ అవ్వక తప్పలేదు. పేరుకు ఆమె చైర్పర్సన్ అయినా పెత్తనమంతా పెద్దిరెడ్డి టీమ్దే నడిచింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో చైర్పర్సన్గా వైసీపీలో ఉండి అవమానాలు దిగమింగుకుంటూ వచ్చిన ఇంద్రజ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి పసుపు కండువా కప్పేసుకున్నారు. టీడీపీలో చేరిన మరుసటి రోజే చైర్పర్సన్ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు.
హిందూపురం మునిసిపాలిటీలో 38 వార్డులుండగా 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 30స్థానాలు తెలుగుదేశం 6, బీజేపీ1, ఎంఐఎం1 గెలిచాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన ఇద్దరు, ఎంఐఎం సభ్యురాలు టీడీపీలోకి చేరడంతో ఆపార్టీ బలం 9కి పెరిగింది. బీజేపీ కౌన్సిలర్తో కలుసుకుని పది మంది ఉండగా తాజాగా చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో తెలుగుదేశం బలం 20కి పెరిగింది. వైసీపీకి మిగిలి 18 మంది కౌన్సిలర్లలో 8 మంది మాత్రమే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మిగిలినవారిలో అయిదుగురు టీడీపీ తలుపులు తడుతున్నారంట.
అదలా ఉంటే చైర్పర్సన్గా ఇంద్రజ రాజీనామా ఆమోదం.. టీడీపీ కౌన్సిలర్గా గెలిచిన నేత చైర్మన్ సీటు అధిరోహించడం లాంఛనమే. తెలుగుదేశం పార్టీ తరపున చైర్మన్ కావడానికి 20మంది సభ్యులు అవసరం కాగా 20 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్అఫిషియో సభ్యులుగా ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే బాలకృష్ణ ఓట్లు ఉండటంతో కావాల్సినదాని కంటే రెండు ఓట్లు అధికంగానే ఉంది. ఆ ప్రకారం తెలుగుదేశం పార్టీకి 22ఓట్లు, వైసీపీకి 18ఓట్లే ఉంటాయి. అందుకే మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నా బాలకృష్ణ సహా పార్టీ నేతలు వారికి నో చెప్పేస్తున్నారంట. మొత్తానికి హిందూపురంలో వైసీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందిప్పుడు.