Chandrababu : ఆయన 44 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. 8 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 14 ఏళ్లుపాటు సీఎంగా పనిచేశారు. 14 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆయన రాజకీయాల నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైందా? ఈ ప్రశ్నకు 2024 ఎన్నికల ఫలితాలే సమాధానం చెబుతాయా? అయితే ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు . స్వయంగా చంద్రబాబే ప్రజల మధ్య ప్రకటించారు.
వ్యూహం ఇదే
ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. అయితే అప్పుడే అక్కడ పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. తనకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని టీడీపీ అధినేత కోరడం చర్చనీయాంశమైంది. టీడీపీని గెలిపించకపోతే 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అవుతాయని చంద్రబాబు చెప్పడంపై ఆ పార్టీ నేతలే విస్మయం చెందుతున్నారు. ఇలాంటి స్టేట్ మెంట్ వల్ల ప్రజలకు టీడీపీ గెలుపుపై నమ్మకం పోతుందని కొందరు నేతలు చాటుమాటుగా అనుకుంటున్నారు. అయితే ఎంతో సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అంత తేలికగా ఆ డైలాగ్ వదలలేదు. ఒక వ్యూహం ప్రకారమే లాస్ట్ ఛాన్స్ ఆయుధాన్ని ప్రజలపైకి వదిలారు. ఇదే సమయంలో అభివృద్ధి అజెండాను ఎత్తుకున్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీడీపీకి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. ఇదే వ్యూహంతో చంద్రబాబు ఇకపై ప్రజల్లో తిరగనున్నారు.
అప్పుడూ ఇదే పరిస్థితి
చంద్రబాబు విజన్ పై ఆ పార్టీ అభిమానులకే కాదు, సాధారణ ప్రజల్లోనూ మంచి అభిప్రాయమే ఉంది.అందుకే మళ్లీ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయం నాటికి టీడీపీ గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. 2009-2014 మధ్య జరిగిన ఏ ఉపఎన్నికలో ఆ పార్టీ గెలవలేదు. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులే గెలిచారు. రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. తెలంగాణ ప్రజల ఉద్యమపార్టీ టీఆర్ఎస్ కు పట్టంకట్టారు. అప్పటి వరకు వైఎస్ఆర్ సీపీ బలంగా ఉన్నా.. రాష్ట్ర విభజనతో ఏపీలో ప్రజల్లో మార్పు వచ్చింది. కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నేతే సీఎంగా ఉండాలనుకున్నారు. హైదరాబాద్ లాంటి రాజధాని నిర్మించాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని నమ్మారు. దీంతో 2014 ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు అనుభవానికి ప్రజలు ఓటేశారనేది అక్షర సత్యం. అప్పుడు బీజేపీ, జనసేనతో పొత్తు టీడీపీకి కలిసొచ్చింది.
అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా?
మళ్లీ ఇప్పుడు ఏపీలో రాజధాని ఇష్యూ నడుస్తోంది. రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలనేది టీడీపీ నినాదం. 3 రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మరోవైపు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ఆ పార్టీ నమ్మకంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మళ్లీ అభివృద్ధి మంత్రాన్ని అందుకున్నారు. తన అనుభవానికి ఓటువేయాలని కోరుతున్నారు. అభివృద్ధి మంత్రం, లాస్ట్ ఛాన్స్ సెంటిమెంట్ డైలాగ్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయి? ఏమో గుర్రం ఎగరా వచ్చు. 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గట్టిగానే పోరాడేందుకు సిద్ధమయ్యారని తాజా పర్యటనలే నిరూపిస్తున్నాయి.
ప్రజా తీర్పేంటి?
జగన్ గతంలో ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఏపీ ఓటర్లు ఆ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ప్రజలను లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. నెగిటివో, పాజిటివో ఈ డైలాగ్ ప్రజల్లోకి బలంగానే వెళ్లింది. మరి ప్రజలు చంద్రబాబుకు లాస్ట్ ఇస్తారో? లేదో వేచి చూడాలి.