Twitter : ట్విట్టర్ ను కొనుగోలు చేసిన సమయంలో ఈ సంస్థను నిజమైన వాక్ స్వేచ్ఛకు వేదికగా మారుస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఆ సంస్థలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు మార్పులు తప్పవని మస్క్ ప్రకటించారు. ఆ తర్వాత అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలతో విసుగుపోయిన ఉద్యోగులు స్వచ్ఛందంగా సంస్థను వీడేందుకు సిద్ధమవుతున్నారు. కంపెనీ కోసం కష్టపడి పనిచేస్తారా.. లేక వెళ్లిపోతారా అంటూ ఉద్యోగులకు మస్క్ ఓ మెయిల్ పంపారు. ఇలా లిఖితపూర్వకంగా హామీ కోరడాన్ని అనేక మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్న భయంతో చాలా మంది ఉద్యోగానికి గుడ్ బై చెప్పడానికే మొగ్గుచూపుతున్నారు. దీంతో సంస్థ కార్యకలాపాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. మస్క్ ఇచ్చిన 3 నెలల గడువు తర్వాత సంస్థను వీడేందుకు చాలా మంది సిద్ధమయ్యారని తెలుస్తోంది. కంపెనీ అంతర్గత సమాచార వేదికల్లో ఉద్యోగులంతా సెల్యూట్ ఎమోజీలను పోస్ట్ చేస్తున్నట్లు సమాచారం.
ట్విట్టర్ ఎదుగుదలలో కీలకంగా పనిచేసిన ఉన్నత ఉద్యోగులు బయటకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మస్క్ తీసుకొస్తున్న మార్పుల వల్ల వచ్చే సమస్యల్ని పరిష్కరించడం సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారట. మస్క్ ట్విట్టర్ను సొంతం చేసుకున్నప్పటి నుంచి అమెరికా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం.
ఉద్యోగుల నిర్ణయంతో అప్రమత్తమైన ట్విట్టర్.. సోమవారం వరకు కార్యాలయాలను మూసివేసినట్లు బ్లూమ్బెర్గ్ వెల్లడించింది. ఈ విషయంపై యాజమాన్యం ఉద్యోగులకు లేఖ రాసినట్లు సమాచారం. కంపెనీ నిబంధనల ప్రకారం ఎవరూ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయొద్దని కోరినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల్ని బుజ్జగించేందుకు మస్క్ ప్రయత్నించారట. కొన్ని నిబంధనల విషయంలో వెనక్కి తగ్గారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటి నుంచి పని విషయంలో పనితీరు బాగుందని మేనేజర్లు ధ్రువీకరించిన వారికి మినహాయింపు ఇచ్చే యోచనలో ఉన్నారట. అయినా ఉద్యోగులు వెనక్కి తగ్గడం లేదంటే ట్విట్టర్ భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థంగా మారింది.