Telangana BJP New President: ఆలస్యం.. అమృతం.. విషం.. అన్నట్లుగా తయారైంది తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక అంశం. ఇప్పటికే రెండు వర్గాలుగా చీలగా వారిని ఏకతాటిపైకి తీసుకురావాలని యోచిస్తున్న అగ్రనాయకత్వం. ఈ అంశాన్ని నాన్చటంపై శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్టీని, అభ్యర్థులను గెలిపించుకునే వారికే పట్టం కట్టాలంటూ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు.. హాట్ టాపిక్గా మారాయి. త్వరలోనే కొత్త బాస్ ఎంపిక ఉన్నా.. అది తలకు మించిన భారంగా ఉంటుందని రాజకీయవర్గాల టాక్.
తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక అంశం.. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉన్న పార్టీని బండి సంజయ్ పగ్గాలు తీసుకున్నాక ఉరుకులు పెట్టించారనే చెప్పొచ్చు. సంజయ్ హయాంలో టీబీజేపీ బలోపేతం కావడమే కాకుండా..ఎన్నికల్లోనూ సత్తా చాటిందని సొంత పార్టీ నేతలే చెప్పుకున్నారు. తర్వాత రోజుల్లో బండి సంజయ్ను తప్పించిన కేంద్ర నాయకత్వం.. ఆ బాధ్యతను కిషన్రెడ్డికి అప్పగించింది. అప్పటి నుంచి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుందనే వాదనలు తెరపైకి వచ్చాయి.
బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీను గ్రామస్థాయిలో తీసుకెళ్లటం సహా పలు పోరాటాలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలంగా ఉన్న సమయంలోనూ సంజయ్ ఆధ్వర్యంలో కమలం సత్తా చాటింది. పార్టీని గాడిన పెట్టేందుకు సంజయ్ కూడా తనదైన మార్కుతో దూసుకుపోయారని రాజకీయవర్గాల టాక్. ప్రధాని సంజయ్ నాయకత్వంపై ఆనందం వ్యక్తం చేశారు. భారీ జనసమీకరణ చేయటంలో విజయం సాధించారంటూ సంజయ్ భుజాలను తట్టి ప్రోత్సహించారు.
Also Read: టీపీసీసీ పోస్టు.. హైకమాండ్ గ్రీన్సిగ్నల్.. రేపో మాపో ప్రకటన..
బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన కేంద్ర నాయకత్వం.. ఆ స్థానాన్ని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి అప్పగించింది. కిషన్రెడ్డి కూడా పవర్పుల్ నేతగా ఉన్నా.. పార్టీ బలోపేతం విషయంలో మాత్రం అంతంత మాత్రమేనని సొంతపార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. దానికి తోడు కిషన్కు పగ్గాలు అప్పగించాక.. టీబీజేపీ మరింత క్షీణించిందనే వాదనలు లేకపోలేదు. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు దానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సొంత ఎమ్మెల్యేలను కూడా కిషన్రెడ్డి పట్టించుకోవటం లేదని.. అన్నీ తానీ వ్యవహరిస్తూ..తమను డమ్మీలుగా చేస్తున్నారని కాషాయనేతలు ఆవేదనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అందుకే పార్టీలో నేతలు రెండుగా చీలిపోయారనే వాదన తెరపైకి వచ్చింది.
గత ఎన్నికల్లో మిషన్-90 లక్ష్యంతో బరిలో నిలిచిన బీజేపీ.. కనీసం డబల్ డిజిట్ కూడా క్రాస్ చేయలేకపోవటం ఢిల్లీ పెద్దలను ఆశ్చర్యాన్ని గురి చేసింది. 90 స్థానాలు గెలిచి..తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర నాయకత్వం పలుమార్లు చెప్పినా కేవలం 8 మంది మాత్రమే గెలిచారు. అక్కడ నుంచి కిషన్రెడ్డి నాయకత్వంపై వ్యతిరేకత మొదలైంది. ఎన్నికల్లో గెలిచిన ఎనిమిది మందిలోనూ చీలిక రావటంపై పార్టీ నాయకత్వం ఆలోచనలో పడిందట. కారణాలు అన్వేషణలో నాయకత్వ లోపం ఒక అంశంగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ చీఫ్ మార్పు అనివార్యమైంది.
Also Read: ధర్నాలు చేస్తే దాడులా? రైతులకు సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం: బీఆర్ఎస్
ఇక్కడవరకూ ఓకే. ఇప్పుడు తెలంగాణ బీజేపీ బాధ్యతలు ఎవరి చేతులో పెట్టాలనే అంశం తెరపైకి వచ్చింది. కిషన్రెడ్డిని తప్పించి.. ఆ బాధ్యతలను మళ్లీ బండి సంజయ్కు అప్పగిస్తారంటూ వార్తలు వినిపించినా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ పదవి బీసీలకు కట్టబెట్టేందుకు కేంద్ర నాయకత్వం ఆలోచన చేస్తోందని సమాచారం. దీంతో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు తెరపైకి వచ్చాయి. దీనికి తోడు ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉంటున్నాయని పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నారట. ఒక అడుగు ముందుకేసిన ఎంపీ ధర్మపురి అరవింద్.. సత్తా ఉన్న వారికే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మార్పు తథ్యం అనే సంకేతంతో పాటు సమర్థులకు పట్టం కట్టాలనే వాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ పోరాట సమరంతో పాటు, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర మాదేనంటూ గొప్పలు చెప్పుకున్నా.. గత ఎన్నికల్లో పట్టుమని పది సీట్లు కూడా రాకపోవటంతో బీజేపీ డైలమాలో పడింది. కేంద్రంలో అధికారంలో ఉండి.. తెలంగాణలో బలంగా ఉన్నామని భావిస్తున్న తరుణంలో ఎన్నికల ఫలితాలు నేతలను ఆలోచనలో పడేశాయి. దీంతో పార్టీలో సమూల మార్పులు చేసేందుకు ఢిల్లీ అగ్రనాయకత్వం అడుగులు వేస్తోందట. గతంలో ఈ పదవికోసం ఈటల రాజేందర్, డీకే ఆరుణ, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్, గూడెం నగేష్ వంటి పేర్లు వినిపించినా.. తెలంగాణలో బీసీ కార్డును ఉపయోగించాలనే యోచనలో అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అలా అయితే.. ఆ పదవి ఎవరిని వరిస్తుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.