EPAPER

Sports: ఆటల్లో మనమెక్కడ?

Sports: ఆటల్లో మనమెక్కడ?

Indian Athletes: దేశంలోని క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించి, మన దేశానికి ఒక విశిష్టమైన గుర్తింపు తెచ్చిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌. ఆయన జన్మదినమైన ఆగస్టు 29ని మనం జాతీయ క్రీడాదినోత్సవంగా ఏటా జరుపుకుంటున్నాం. ధ్యాన్‌చంద్ పేరిట కేంద్రం ఏటా ఇచ్చే ఖేల్‌రత్న అవార్డు దేశంలోని క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత గౌరవంగా భావించబడుతోంది. ధ్యాన్‌చంద్‌ 1905లో ఆగస్టు 29న నేటి ప్రయాగ్‌రాజ్‌ నగరంలో జన్మించారు. బాల్యం నుంచే హాకీ అంటే పిచ్చి. దీంతో ఆటతో మమేకమైపోయాడు. దీంతో హాకీ స్టిక్‌ అతని చేతిలో మంత్రదండగా మారిపోయింది. బంతిపై నియంత్రణ, డ్రిబ్లింగ్‌ చాతుర్యం, పాసింగ్‌లో అసాధారణ నైపుణ్యం ఆయనను హాకీ మాంత్రికుడిగా చేశాయి. ధ్యాన్‌చంద్ నాయకత్వంలో 1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌‌లో భారత్ బంగారు పతకాలు సాధించింది. ఆయన బంతిని నియంత్రించే విధానం అభిమానులతో పాటు తోటి ఆటగాళ్లనూ మంత్ర ముగ్దులను చేసేది. ప్రపంచ హాకీ‌లో ‘ది విజార్డ్’గా ధ్యాన్‌చంద్ గుర్తింపు పొందాడు. 1936 నాటి ఒలింపిక్స్‌తో మన జట్టు జర్మనీ టీంతో ఫైనల్ ఆడింది. అందులో ధ్యాన్‌చంద్ 9 గోల్స్ చేసి జర్మనీ టీమ్‌ను మట్టి కరిపించటం చూసి, అక్కడి గ్యాలరీలోని నాటి జర్మనీ పాలకుడు అడాల్ఫ్ హిట్లర్ షాకయ్యాడు. ‘ఆ కెప్టెన్ హాకీ స్టిక్‌లో ఏదో మాయ ఉంది. లేకపోతే.. అతను అలా ఆడలేడు’ అన్నాడట. అదే రోజు రాత్రి ధ్యాన్‌చంద్‌ని పిలిపించుకొని ‘నువ్వు భారత సేనలో సుబేదార్‌గా ఉన్నావు. నువ్వు జర్మనీ తరపున ఆడితే ఎయిర్‌ఫీల్డ్ మార్షల్‌గా నియమిస్తా’ అని హిట్లర్ ఆఫర్ ఇవ్వగా, ధ్యాన్‌చంద్ దానిని సున్నితంగా తిరస్కరించాడు.


అయితే, వర్తమానంలో మన దేశం క్రికెట్ తప్ప మిగిలిన అన్ని క్రీడల్లో వెనకబడిపోయింది. తాజా ప్యారిస్ ఒలింపిక్స్‌ ఫలితాలే అందుకు నిదర్శనం. 2024 ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 329 పతకాలకు 200ల దేశాలకు చెందిన 10,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 117 మంది క్రీడాకారులు 16 విభాగాల్లో పోటీ పడగా, మన దేశం 6 పతకాలకే పరిమితమైంది. ఇప్పటివరకు 25 సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న మనదేశానికి వచ్చింది 35 పతకాలు మాత్రమే. ఇక.. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ.3,442.32 కోట్ల నిధులు కేటాయించారు. నిరుటి కంటే కేవలం రూ. 45.36 కోట్లు అదనంగా క్రీడలకు నిధులు దక్కాయి. ఇందులో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘ఖేలో ఇండియా’కు రూ.900 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌లకు రూ.340 కోట్లు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.822.60 కోట్ల నిధులు సమకూర్చారు. ఇవిగాక, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి రూ.22.30 కోట్లు, నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీకి రూ.22 కోట్లు విడుదలచేశారు. మొత్తం 48.2 లక్షల కోట్ల దేశ బడ్జెట్‌‌లో క్రీడారంగపు వాటాను గమనిస్తే.. మనం క్రీడలలో ఎందుకు వెనకబడి ఉన్నామో అర్థమవుతోంది.

ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు అత్యధిక పతకాలు అందించిన హాకీ ఒకప్పుడు వెలుగు వెలిగింది. అయితే, 1983 క్రికెట్ ప్రపంచకప్ విజయం తర్వాత హాకీ సోదిలో లేకుండా పోయింది. ఎంతలా అంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌‌కు మన హాకీ జట్టు అర్హత కూడా సాధించలేకపోయింది. దాంతో కాసులు కురిపించే క్రికెట్‌ను కాదని ఇతర ఆటలను ప్రమోట్ చేసేందుకు స్పాన్సర్లు ముందుకు రాలేదు. అప్పటివరకు హాకీ టీమ్ స్పాన్సర్‌గా ఉన్న సహారా గ్రూపు 2018లో తప్పుకుంది. ఈ దుస్థితిని గమనించిన నాటి ఒడిశా మాజీ సీఎం నవీన్ ప‌ట్నాయ‌క్ ఈ ఆటను బతికించేందుకు ముందుకొచ్చారు. హాకీ ఆటగాడైన నవీన్.. ఒడిశా ప్రభుత్వం తరపున రూ. 100 కోట్లు కేటాయించి జట్టును స్పాన్సర్ చేశారు. అదే భారత హాకీ టీమ్ రాత‌ను మార్చింది. ఈ ఒప్పందం కారణంగా.. మన హాకీ టీమ్ టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచింది. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటగలిగింది. ఇప్పుడు నవీన్ బాటలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను దేశంలోనే స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


Also Read: MLC Resign: మోపిదేవి కంటే ముందే షాకిచ్చిన ఎమ్మెల్సీ.. వైసీపీకి రాజీనామా

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్‌ సిటీ (ఫోర్త్‌ సిటీ)లో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దాదాపు 12 వివిధ క్రీడల అకాడమీలను ఈ వర్సిటీ కేంపస్‌లోకి తేవటంతో బాటు స్పోర్ట్స్‌ సైన్స్‌ సెంటర్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ సెంటర్‌ ఏర్పాటుకూ రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ క్యాంపస్‌ను ఒలింపిక్స్‌ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా చూడటంతో బాటు విదేశీ కోచ్‌లతో శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే, తన దక్షిణ కొరియా పర్యటనలో ప్రపంచంలోనే ఉత్తమ స్పోర్ట్స్‌ వర్సిటీగా గుర్తింపు ఉన్న సియోల్‌లోని కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని సీఎం సందర్శించారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త స్పోర్ట్స్ పాలసీని అమలు చేయాలని, గతంలో హైదరాబాద్‌లో నిర్మించిన స్టేడియాలకు పూర్తిస్థాయిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్టేడియాలలో మౌలిక సదుపాయాలు కల్పించి మెరుగుపరచటం ద్వారా జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు భాగ్యనగరం వేదికగా మారుతుందని సీఎం భావిస్తు్న్నారు.

చదువు తప్ప మరొకటి అక్కర్లేదనే ప్రస్తుతకాలపు తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి కారణంగానే దేశంలో ఎక్కువ మంది క్రీడారంగంలోకి రావటం లేదు. కానీ, ఆటలతో పిల్లల ఫిజికల్ ఫిట్‌నెస్‌తో బాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, పిల్లలు బద్ధకానికి దూరమై, ఉత్సాహంగా ఉంటారని, తోటివారితో, పెద్దలతో, కోచ్‌లతో, తమ సీనియర్లతో ఎప్పుడు, ఎలా ఉండాలో ఆటలు నేర్పిస్తాయని, దీనివల్ల లైఫ్ స్కిల్క్స్ అలవడతాయని నిపుణులు వివరిస్తున్నారు. అలాగే, టైమ్ మేనేజ్‌మెంట్, డెసిషన్ మేనేజ్‌మెంట్, ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి చేకూరుతుందని వారు చెబుతున్న మాట. రోజూ ఆటలు ఆడే పిల్లలకు క్రమశిక్షణ అలవడుతుందని, అది వారిని తర్వాతి కాలంలో ఉన్నత స్థాయికి చేరుస్తుందని, కెప్టెన్, వైస్ కెప్టెన్ వంటి బాధ్యతల ద్వారా పిల్లలకు నాయకత్వ లక్షణాలు అలవడతాయని వారు చెబుతున్నారు. ఆటలో గెలవటం కంటే దానిని ఆస్వాదించటం, వేరే జట్టు గెలిచినప్పుడు అభినందించటం వల్ల పిల్లలు అసూయ ద్వేషాలకు అతీతంగా ఆలోచించగలుగుతారని, ఆటల్లో గెలిస్తే పిల్లలలో గొప్ప ఆత్మవిశ్వాసం, ఓడితే తర్వాతి ఆటలో ఎలా గెలవాలనే దానిపై ఆలోచన ఏర్పడుతుంది. మొత్తంగా క్రీడలు పిల్లల సమగ్ర వికాసానికి దోహదపడతాయి.

Also Read: Smart Cities: ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రం ఆమోదం.. ఇక ఉద్యోగాల జాతరే

నేనొక డాక్టర్‌, ఇంజనీర్‌, సైంటిస్ట్ అని సగర్వంగా చెప్పుకుంటున్న మన సమాజంలో ‘నేనొక క్రీడాకారుడిని.. ఈ దేశంలో నాకు తగిన భవిష్యత్ ఉంటుంది’ అని ఆటగాళ్లు చెప్పుకునే పరిస్థితి లేదు. క్రీడల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులు, తదనంతర కాలంలో తమ రంగంలో అత్యున్నత స్థాయి క్రీడాకారులను తయారుచేయలేకపోతున్నారు. మరోవైపు, పదేళ్ల వయసులోపే ప్రపంచ చెస్‌ స్వర్ణం కొల్లగొట్టిన నిహాల్‌ శరీన్‌‌తో సహా ఎందరో క్రీడాకారులు ఇక్కడ ప్రతిభకు కొదవ లేదని రుజువు చేస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో చురుకైన వ్యవహారశైలి, పారదర్శక విధివిధానాలతో ముడి కోహినూర్లను వెలికితీసే యజ్ఞమే సజావుగా సాగడంలేదు. కనుక ఇకనైనా ప్రభుత్వాలు బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, ఫుట్‌బాల్‌, హాకీ, అథ్లెటిక్స్‌ తదితర క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చి, తగిన వసతులు, ప్రోత్సాహం కల్పిస్తే నూతన క్రీడాభారతం ఆవిష్కృతమవుతుంది.

Related News

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

KTR : కోర్టు తీర్పుతో భయం.. కాంగ్రెస్ అంటేనే డ్రామాలమయం

Kakani Vs Somireddy: కాకాణి VS సోమిరెడ్డి‌.. రూ.100 కోట్ల లొల్లి

Russia-Ukraine war: మోడీ దెబ్బ.. వెనక్కి తగ్గిన పుతిన్.. యుద్దం ఆగినట్లేనా!

KCR Silent: నోరు మెదపని కేసీఆర్.. బయటపడ్డ అసలు కుట్ర!

 YS Jagan: పెద్దిరెడ్డిని సైడ్ చేసిన జగన్.. పుండు మీద కారం

Hindi: హిందీ హమారా.. హిందుస్థాన్ హమారా

Big Stories

×