AP Politics : విశాఖ కేంద్రంగా వైసీపీ, జనసేన మధ్య చెలరేగిన ఘర్షణ వాతావరణం అటు తిరిగి ఇటు తిరిగి… టీడీపీ, జనసేన మధ్య పొత్తుపొడుపులకు దారితీసింది. మూడు రాజధానులకు మద్ధతుగా వైసీపీ విశాఖ గర్జన చేపట్టిన రోజే… జనసేనాని పవన్ కళ్యాణ్… జనవాణి పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకేరోజు అధికార , విపక్షాల కార్యక్రమాలు ఉండడంతో… సాగర తీరంలో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. అందరూ ఊహించినట్లుగానే జనవాణి కార్యక్రమంపై వైసీపీ ప్రభుత్వం తమదైన శైలిలో అణచివేత ప్రదర్శించింది. ఎయిర్ పోర్టులో రెచ్చిపోయారని… మంత్రుల కార్లపై దాడులకు పాల్పడ్డారంటూ… పదుల సంఖ్యలో జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టి లోపలికి నెట్టింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ను నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రానివ్వలేదు. షరా మామూలుగానే దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ చెలరేగింది.
చివరకు పవన్ కళ్యాణ్.. విశాఖ నుంచి మంగళగిరికి చేరుకున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. వైసీపీపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్… బీజీపీతో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమలనాథులు రూట్ మ్యాప్ ఇవ్వడం లేదని చెబుతూ.. పొత్తుల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఇంతలోనే టీడీపీ అధినేత చంద్రబాబు… పవన్ కళ్యాణ్ తో భేటీ అవడం… రాజకీయంగా అత్యంత కీలక పరిణామంగా మారిపోయింది. విశాఖలో పవన్ పట్ల ప్రభుత్వ అవలంభిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ చంద్రబాబు… రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అంటూ ప్రశ్నించారు. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో కలిసి నడుద్దామంటూ… జనసేనానికి ప్రతిపాదనలు ఇచ్చారు. ఇంతలోపే అటు బీజేపీ నాయకులు సైతం… తాము పవన్ తో కలిసే ఉన్నామని.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామంటూ ప్రకటించారు.
వాస్తవానికి ఈ పొత్తుల బేరాలు గత ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ విషయంలో అప్పుడప్పుడూ అసంతృప్తి ప్రదర్శించిన పవన్ కళ్యాణ్… తెగదెంపుల ప్రస్తావన మాత్రం చేయలేదు. ఒంటరి పోరు అంటూ గట్టిగా చెప్పనూ లేదు. పైపెచ్చు అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందంటూ… తన మనసులో ఉన్న వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు. అటు టీడీపీ అధినేత సైతం ఇదే పాలసీతో ఉన్నారు. వైసీపీని గద్దె దించేందుకు అన్ని పార్టీలు ఏకం కావాల్సిందే అంటూ పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇక కమలనాథుల వైఖరి ఏంటన్నది ఎవరికీ అంతుపట్టకపోయినా… వైసీపీతో కలిసి వెళ్ల లేదు.. అటు ఒంటరిగా పోటీ చేయనూ లేదు అన్నది మాత్రం ప్రతీ తెలుగు ఓటరుకు తెలిసిన విషయమే. ఏతా వాతా తేలిందేంటంటే.. ఈ మూడు పార్టీలు చేతులు కలిపేందుకు ఎప్పుడెప్పుడు అవకాశం దక్కుతుందా అని కాచుకుని కూర్చున్నాయి.
విశాఖ ఘర్షణ పుణ్యమా అని ఇప్పుడు ఆ మూడు పార్టీలకు ఓ సందు దొరికినట్లైంది. ఇంతకాలం నుంచి చేస్తున్న విమర్శలే అయినా.. ఇప్పుడు కొత్త సందర్భం కాబట్టి ఆ విమర్శలకు మరింత పదునుపెడుతున్నాయి. అటు అధికార పక్షాన్ని తిడుతూనే ఇటు చెట్టాపట్టాలు వేసేందుకు సిద్ధమైపోతున్నాయి. మూడు పార్టీల ముచ్చటైన వ్యూహం ఎప్పుడు ఫలిస్తుంది… రానున్న ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా ఉండనుందన్నది ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.