Urmila Chaturvedi : ఏనాటికైనా రామచంద్రుడు తన ఆశ్రమానికి వస్తాడని, ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలని రామాయణ కాలంలో.. శబరి జీవితాంతం ఎదురుచూసింది. అది నాటి శబరి కథ కాగా.. రామాలయం నిర్మాణం ఖాయం అనే వార్త వినేవరకు అన్నం ముట్టనని ఏకంగా 28 ఏళ్లపాటు నిరాహార దీక్ష చేసిన నేటి శబరిగా ఊర్మిళా చతుర్వేది(82) జనం మనసులో నిలిచిపోయారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఊర్మిళ గతంలో సంస్కృతం టీచరుగా పనిచేశారు.
1992లో బాబ్రీ మసీదు కూల్చేసిన రోజు నుంచి ఆమె సాధారణ ఆహారం తీసుకోవడం మానేశారు. 27 ఏళ్లుగా పాలు, పండ్లనే పరిమితంగా తీసుకుంటూ రామనామం చేస్తూ వచ్చారు. ఈ 28ఏండ్లలో ఎంతో మంది బంధువులు తనని ఆహారం తీసుకొమ్మని బలవంతం చేసినా ఆమె మాత్రం ఎంతో భక్తి, శ్రద్ధలతో తన ఉపవాసాన్ని కొనసాగించింది.
అయోధ్యలో రామ జన్మభూమి స్థలమంతా హిందువులకే చెందాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన రోజు బంధువులు, కుటుంబ సభ్యులు ‘ఇక చాలు’ అని కోరినా ఆమె దీక్షను విరమించలేదు. మొత్తానికి నిరుడు భారత ప్రధాని మోదీ రామాలయానికి భూమిపూజ చేసిన తర్వాత.. ఆమె అయోధ్య వెళ్లి, సరయూ నదీ తీరాన తన 28 ఏళ్ల ఉపవాస దీక్షను విరమించారు. 54 ఏళ్ల వయసులో ఆమె నాడు ఆరంభించిన ఆ దీక్ష.. ఎట్టకేలకు ముగియటంతో బాటు రామాలయ ప్రతిష్ఠ కూడా జరగటంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.