Morarji Desai : మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్… అంటే చాలామందికి తెలియదేమో గానీ.. మొరార్జీ దేశాయ్ అంటే ఎవరైనా ఠక్కున ఆయనను గుర్తుపడతారు. దేశానికి నాలుగో ప్రధానిగా పనిచేసిన ఆయన, అంతకు ముందు ఆర్థిక మంత్రిగా పెద్ద పెద్ద రికార్డులు నెలకొల్పారు. తనను ఎవరూ అధిగమించలేని రీతిలో అత్యధికంగా పది సార్లు బడ్జెట్ను సమర్పించారనే సంగతి తెలిసిందే. 1959 నుంచి 1964 వరకు, తిరిగి 1967 నుంచి 1969 వరకు మొరార్జీ మొత్తం 8 వార్షిక బడ్జెట్లు, 2 తాత్కాలిక బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అంతే కాదు.. పుట్టినరోజు నాడే బడ్జెట్ సమర్పించిన ఏకైక ఆర్థిక మంత్రిగా ఆయన రికార్డులకెక్కారు. మొరార్జీ ఫిబ్రవరి 29న జన్మించారు.
అంటే ఆయన లీఫు సంవత్సరంలో పుట్టారు. 2016 వరకు బడ్జెట్ను ఫిబ్రవరి నెలలో చివరి వర్కింగ్ డే రోజు సమర్పించేవారు. అలా.. నాలుగేళ్లకోసారి ఫిబ్రవరి 29న బడ్జెట్ లోక్సభ ముందుకొచ్చేది. అలా ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో 2 లీఫు సంవత్సరాలు రావటంతో 1964, 1968ల్లో ఫిబ్రవరి 29న పార్లమెంట్కు బడ్జెట్ సమర్పించారు. అలా రెండు సార్లు తన పుట్టిన రోజునాడే బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీకి దక్కింది. ఇక.. ఆర్థిక మంత్రులుగా పనిచేసినా.. బడ్జెట్ సమర్పించే అదృష్టానికి నోచుకోని అభాగ్యపు మంత్రులుగా హెచ్ఎన్ బహుగుణ, కేసీ నియోగి రికార్డుకెక్కారు. అతికొద్ది కాలం ఆర్థిక మంత్రులుగా ఉన్న వీరు.. బడ్జెట్ సమయానికి వీరు పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
వీరిలో నియోగి.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండో ఆర్థికమంత్రిగా 1950లో నియమితులైనా.. కేవలం 35 రోజులే ఆ బాధ్యతలను నిర్వహించారు. ఇక.. బహుగుణ 1979-80 మధ్య ఆర్థిక మంత్రిగా కేవలం ఐదున్నర నెలలే పనిచేశారు. వేర్వేరు ప్రభుత్వాలకు చెందిన ఇద్దరు మంత్రులు.. ఒకే సంవత్సరంలో రెండు బడ్జెట్లు సమర్పించిన ముచ్చట కూడా మన బడ్జెట్ చరిత్రలో కనిపిస్తుంది. 1991-92లో జనతాదళ్ కు చెందిన యశ్వంత్ సిన్హా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే.. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి పీవీ నేతృత్వలో సర్కారు ఏర్పడటంతో నాటి నాటి ఆర్థికమంత్రి మన్మోహన్సింగ్ ఆ ఏడాదికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన ఆ బడ్జెట్.. దేశాన్ని సంస్కరణల బాట పట్టించిన సంగతి తెలిసిందే. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు 300 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 50 శాతానికి ఆ బడ్జెట్ తగ్గించింది. సర్వీస్ టాక్స్ అనేది కొత్తగా వచ్చింది ఈ బడ్జెట్లోనే.