Tanguturi Prakasam Pantulu : టంగుటూరి ప్రకాశం పంతులు అనగానే చాలామందికి సైమన్ కమిషన్ ముందు తుపాకికి ఎదురుగా ఛాతీ నిలిపిన నేత గుర్తుకొస్తారు. మరికొందరికి ఆంధ్రరాష్ట్రపు తొలి ముఖ్యమంత్రిగా గుర్తుకొస్తారు. పేదరికంలో పుట్టి, చదువు కోసం నానా తిప్పలు పడి, బారిష్టర్ చదివిన ప్రకాశం పంతులు.. ఒక సమయంలో మద్రాసులో అత్యధికంగా ఫీజు తీసుకునే లాయరు. కానీ.. ఆయన జీవితపు చరమాంకంలో మాత్రం.. కటిక దరిద్రాన్ని అనుభవించారు. కనీసం రెండు పూటలా కడుపు నిండా తినలేని దుస్థితిలోనే కన్నుమూశారంటే ముక్కున వేలేసుకోవాల్సిందే.
పంతులు గారు సీఎంగా పదవి దిగిపోయిన కొద్ది రోజులకే ఆయన అభిమానులు ఆయనకో సన్మానం చేశారు. అందులో భాగంగా ఆయనకో శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చారట. ‘ఇవన్నీ ఎందుకురా.. వీటికి బదులుగా ఓ అరడజను అరటిపండ్లు తెస్తే తినేవాడిని కదరా’ అన్నాడట. ఆ మాట విన్న వింటనే.. అక్కడున్న సభికులంతా కన్నీరు కార్చారట.
మరో సందర్భంగా ప్రకాశం పంతులు గారి ఆరోగ్యం బాగోలేదని తెలిసి చూద్దామని ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన తుర్లపాటి కుటుంబరావు గారు మద్రాసు వెళ్లారట. ఆయనను పరామర్శించి ఇంటి నుంచి బయటికి వస్తుంటే.. ఆయన రెండవ కుమారుడు హనుమంతరావు.. కుటుంబరావు గారి వెంటే బయటికి వచ్చారట. సాగనంపటానికి వాకిలి దాకా వస్తాడనుకున్న హనుమంతరావు.. రెండడుగులు వేయగానే.. ‘ నాన్నగారికి మందులు కొనాలి. ఓ ఐదు రూపాయలుంటే సర్దుతారా..?’ అని దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడగ్గా.. కుటుంబరావు ఆ 5 రూపాయలు ఆయన చేతిలో పెట్టి కన్నీరు పెట్టుకుంటూ బయటికి వచ్చారు.
మరోసారి.. ఆయన మాజీ సీఎం హోదాలో హైదరాబాదులో ఓ ప్రభుత్వ గెస్ట్హౌస్లో బస చేశారు. ఆయనను కలిసేందుకు చాలామంది నేతలు ఒక బృందంగా అక్కడికి వెళ్లారట. వీరంతా వెళ్లే సరికి ఆయన సూదితో తన చొక్కాను కుట్టుకుంటూ కనిపించారు. సాక్షాత్తూ ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన ఆయనను అలాచూసిన ఆ నేతలంతా అవాక్కైపోయారు. ‘ఏం చేయనురా.. ఈ ఒక్క చొక్కానే ఉంది మరి’ అన్నాడట ఆయన.
టంగుటూరి జీవితంలో జరిగిన ఈ ఘటనలను ఆయనకు దశాబ్దాల పాటు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన తుర్లపాటి కుటుంబరావు రాసుకున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేస్తే పదితరాలకు సరిపడా సంపాదించే నేతలున్న ఈ రోజుల్లో దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి, చివరి రోజుల్లో కటిక దరిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులు మరెక్కడా కనిపించరు.