Padma Shri Award : ఈ ఏడాది భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో అయిదు.. తెలంగాణకు దక్కాయి. ఈ అవార్డు విజేతలంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినా.. ఆయా కళల్లో అసాధారణ ప్రజ్ఞను ప్రదర్శించి సమాజాన్ని మెప్పించారు.
వారి నేపథ్యాలను ఓసారి పరిశీలిద్దాం.
పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మనోళ్లు పేదరికంలో పుట్టినా తమ రంగాల్లో నిష్ణాతులుగా మారారు. వివిధ కళల్లో గుర్పింపు తెచ్చుకున్నారు. ఉమామహేశ్వరి పుట్టింది ఆంధప్రదేశ్ లో.. పెరిగింది తెలంగాణలో. మచిలీట్నంలోని ఉమామహేశ్వరి తెలంగాణలోని వేములవాడలో ఆమె పుట్టారు. హరికధ అంటే చిన్నప్పుటి నుంచే ఆసక్తి ఉన్న ఉమామహేశ్వరి తండ్రి లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు కావడంతో సహజంగానే కళల పట్ల ఉత్సుకత పెరిగింది. ఆయన వేములవాడ దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా ముప్పయి ఏళ్లకు పైగా పని చేశారు. పదో తరగతి వరకూ చదివిన ఉమామహేశ్వరి సంగీతంపై ఉన్న ఆసక్తితో హరికధ నేర్చుకోవాలని భావించి అందులో శిక్షణ పొందారు. రుక్మిణి కల్యాణం హరికధా గానంతో తొలి ప్రదర్శన ఇచ్చిన ఉమామహేశ్వరి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. హరికధకు దక్కిన గౌరవంగా ఆమె తెలిపారు.
జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడ్డం సమ్మయ్య నిరుపేద కుటుంబంలో జన్మించారు. తండ్రి నుంచి వారసత్వంగా చిందు యక్షగానాన్ని నేర్చుకున్నారు. ఐదో తరగతి మాత్రమే చదివిన సమ్మయ్య తన 12వ ఏట నుంచే రంగస్థలంపై అడుగుపెట్టి.. సమాజాన్ని అలరించారు. పురాణ గాథలకే పరిమితం కాకుండా.. పలు సామాజిక అంశాల ఆధారంగా ప్రదర్శనలు ఇచ్చి సమాజాన్ని చైతన్యవంతం చేశారు. ఇటీవల అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రామాయణంపై యక్షగాన ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.
బుర్రవీణతో మన సంస్కృతిని చాటుతూ సమాజాన్ని రంజింపజేస్తున్న దాసరి కొండప్పను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం వరించింది. నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన కొండప్ప.. వెదురు కర్ర, సొరకాయ, చెక్కమెట్టు ద్వారా అరుదైన బుర్రవీణను తయారు చేసుకున్నారు. ఇలాంటి 12 మెట్ల వాయిద్యం మరెవరి దగ్గరా లేకపోవటం విశేషం. కూలి చేసుకొని బతుకుతున్న కొండప్ప.. ఎవరైనా చనిపోయినప్పుడు తత్వాలు, ఇతర ఉత్సవాల్లో మన పురాణగాథలు చెబుతారు. భార్య, ఓ కుమరుడు చనిపోయినా ఆయన ఈ కళను వదలలేదు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం వెల్లంకి నివాసి కూరెళ్ల విఠలాచార్యకు పుస్తకాలంటే పిచ్చి. ఏ పుస్తకం కనిపించినా వదలకుండా తన ఇంటికి చేరుస్తారు. 2014లో ఆయన తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఆయన కవి కూడా. 2 లక్షల పుస్తకాలను సమకూర్చి తన లైబ్రరీలో పెట్టారు. విద్యార్థులకు ఈయన ఇల్లు ఒక వరంలా మారింది. ఎందరికో పీహెచ్డీ చేసేందుకు ఈ లైబ్రరీ ఉపయోగపడింది. ఈయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో పుట్టి హైదరాబాద్లో స్థిరపడిన వేలు ఆనందాచారి 1980లో దేవాదాయ శాఖలో స్థపతిగా చేరారు. నాటి నుంచి తెలుగునేలపై అనేక ఆలయాలకు రూపకల్పన చేశారు. రిటైర్ అయిన తర్వాత కూడా శ్రీశైల దేవస్థానంలో ఆయన ఆస్థాన స్థపతిగా సేవలందింస్తున్నారు. యాదాద్రి పునర్మిర్మాణంలో ఈయన సేవలకు మెచ్చి యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ ఈయనను ప్రధాన స్థపతిగా నియమించింది. శిల్ప కళారంగంలో ఈయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాదికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆకుతోట బావి తండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ బంజారాలను చైతన్య పరచే అనేక పాటలు రచించారు. సుమారు 16 నెలలు శ్రమించి, 2014లో ఈయన భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. ఆయన సాహిత్యసేవను గుర్తించిన కేంద్రం.. ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.