– కొత్త రెవెన్యూ వ్యవస్థకు రూపకల్పన
– గ్రామానికో ఒక రెవెన్యూ ఉద్యోగి
– మెజారిటీ సమస్యలు అక్కడే పరిష్కారం
– రెడీ అవుతోన్న ఆర్వోఆర్ 2024 డ్రాఫ్ట్
– వీఆర్వో వ్యవస్థను రద్దుచేసిన గత సర్కారు
– దాని స్థానంలో ధరణి పేరుతో అక్రమాలు
– నాటి నుంచి భూరికార్డుల్లో గందరగోళం
– ఈ లెక్కలు సరిచేసేందుకే కొత్త చట్టం
Telangana Govt Introduces New ROR Act-2024 : తెలంగాణ రైతాంగాన్ని దగా చేసిన ధరణి స్థానంలో సరికొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్ఓఆర్ చట్టం పేరుతో వస్తున్న ఈ చట్టం ద్వారా గ్రామస్థాయిలోనే భూయజమానుల సమస్యలను పరిష్కరించటం సాధ్యమని భావిస్తోంది. గతంలో ఉన్న వీఆర్వో వ్యవస్థకు కొన్ని మార్పులు చేయటంతో బాటు ప్రభుత్వం తరపున ఊరికొక రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చూడటం వల్ల గ్రామ స్థాయిలోనే ప్రభుత్వ పాలన సులభమవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. తగిన ప్రత్యామ్నాయాలు సూచించకుండా, గతంలో కేసీఆర్ సర్కారు వీఆర్వో వ్యవస్థను రద్దుచేయటం, ధరణి పేరుతో భూరికార్డుల్లో అక్రమాలకు పాల్పడటంతో తెలంగాణలోని రైతాంగం కుదేలైన సంగతి తెలిసిందే.
ఇదీ జరిగింది..
కొందరు వీఆర్వోలు అక్రమాలకు పాల్పడ్డారని చెబుతూ 07, సెప్టెంబర్ 2020న కేసీఆర్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను ఏకపక్షంగా రద్దు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7,039 వీఆర్వో పోస్టులు రద్దయ్యాయి. వీఆర్వోల వ్యవస్థ రద్దుపై కనీసం వారితో సంప్రదింపులు చేపట్టకపోగా, ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. అంతేగాక, వీఆర్వోల వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో నాటి నుంచి తెలంగాణలోని 10,954 గ్రామాల్లో ఉన్న రెవెన్యూ సమస్యలకు సమాధానం చెప్పే వాడే లేకుండా పోయాడు. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలకు ప్రత్యామ్నాయం లేకపోవటంతో రైతులు తమ భూ సమస్యలకు హైదరాబాద్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. కనీసం కుల, ఆదాయ, వారసత్వ ధృవ పత్రాల విచారణ, సంక్షేమ పథకాల అర్హుల జాబితాను రూపొందించేందుకు గ్రామ స్థాయిలో ఒక్క ఉద్యోగి లేకుండా పోవటంతో గ్రామ పాలన అంతా అస్తవ్యస్తం అయింది.
ఆగమైన ఉద్యోగులు
2020 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేసేవారు. వీరిలో కొందరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులు కాగా, మెజారిటీ ఉద్యోగులు 10వ తరగతి, ఇంటర్ చదివిన వారుగానో లేదా కారుణ్య నియామకాల ద్వారా ఎంపికైన వారే. పాత వ్యవస్థను రద్దుచేసి ఉన్నపళంగా వీరందరినీ వేర్వేరు శాఖల్లోకి పంపాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. పైగా, ఉద్యోగుల అనుభవం, అర్హతలను పరిగణనలోకి తీసుకోకుండా, వారిని లాటరీ పద్ధతిలో ఇతర శాఖలకు పంపేయటంతో వారిలో సగానికి పైగా ఉద్యోగులు ఇమడలేకపోయారు. మరికొందరు దీర్ఘకాలిక సెలవు పెట్టారు. గిరిజన కార్పొరేషన్కి బదిలీ చేసిన 16 మంది ఉద్యోగులకు 20 నెలలుగా వేతనాలే లేకపోవటంతో తాము ఉద్యోగులమా? కాదా? అంటూ వారు తాజాగా వీరంతా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఇంకొందరేమో సర్వీస్ మ్యాటర్ని ఫైనల్ చేయండంటూ వేడుకున్నారు. జూన్ 2, 2014 తర్వాత సర్వీస్లో మరణించిన 61 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వీఆర్ఎల వారసులు కూడా ఇలాంటి నియామకాలకు అర్హులుగా పరిగణించబడగా, ఇప్పుడు వారినీ తీసుకుంటారా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
పెండింగ్లో లక్షల దరఖాస్తులు
నాటి నుంచి గ్రామాల్లో భూ సమస్యలకు సంబంధించి లక్షలాది అప్లికేషన్లు పెండింగులో పడిపోవటమో లేదా ధరణి ద్వారా తిరస్కరణకు గురికావటమో జరిగింది తప్ప పరిష్కారం కాలేదు. ఒక్కో అప్లికేషన్కి రికార్డులను వెరిఫై చేసి రిపోర్ట్ రాయాలంటే కనీసం మూడు, నాలుగు గంటలు పడుతుంది. ఈ లెక్కన రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహశీల్దార్లు ఈ పనిని చేయాలంటే రోజుకు రెండు లేదా మూడు కంటే ఎక్కువ దరఖాస్తులను పరిశీలించలేరు. ఈ పనిలో వీరంతా బిజీగా ఉండటంతో గ్రామ స్థాయిలో వేరే ఏ సమస్యలనూ వారు పట్టించుకోలేని స్థితి. అందుకే గ్రామస్థాయిలో పలు సమస్యలకు సంబంధించిన 75 శాతం అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి. పైగా, ఒక్కో భూరికార్డు సమస్య పరిష్కారం కావటానికి కనీసం ఏడాది సమయం పడుతోంది. ఇదిలాగే కొనసాగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చట్టం దిశగా ఆలోచన చేయగా, ఉద్యోగ సంఘాలన్నీ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల క్షేత్రస్థాయి పాలన గాడిన పడుతుందని అభిప్రాయపడటంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ వ్యవస్థకు ప్రాణప్రతిష్ట చేయాలని నిర్ణయించింది. రైతాంగానికి సత్వర సేవలందించాలంటే గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ అనివార్యమని, ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఓ ఉద్యోగి ఉండేటట్లు చూస్తామని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
Also Read: సివిల్స్ అభ్యర్థులకు రూ. లక్ష చెక్కుల పంపిణీ..
కొత్త పద్ధతిలో ఇలా..
ఆర్వోఆర్ యాక్ట్ 2024 ముసాయిదా ప్రకారం తాత్కాలిక భూదార్, శాశ్వత భూదార్, భూదార్ కార్డుల జారీ, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, దరఖాస్తుల పరిశీలన, వీలునామా, వారసత్వ విషయంలో మ్యుటేషన్లో విచారణ, సెక్షన్ 13 ప్రకారం గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, నిర్ణయించిన రీతిలో హక్కుల రికార్డుల తుది ప్రచురణ తర్వాత అమలు చేయాలి. ధరణి పోర్టల్లో తప్పొప్పుల సవరణతో పాటు అసలే నమోదు కాకుండా పార్టు బి కింద పేర్కొన్న సుమారు 18 లక్షల ఎకరాల డేటాను పరిశీలించి ఆ రైతులకు న్యాయం చేయాల్సి ఉంది. ప్రభుత్వం పార్టు బి కింద పేర్కొన్న వాటిని ఏబీసీడీ వర్గీకరణ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్తగా వీఆర్ఓలను నియమిస్తే.. ఈ కార్యచరణనే వేగంగా, సులభంగా, పారదర్శకంగా అమలు చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త నోటిఫికేషన్?
తెలంగాణలో 10,954 గ్రామాల్లో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పని చేసి గత ప్రభుత్వ నిర్ణయం కారణంగా వేర్వేరు శాఖలకు వెళ్లిన వారికి ఒక పరీక్ష పెట్టి అందులో ఉత్తీర్ణులైన వారిని ఎంపికచేయాలని, మిగిలిన పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కొత్త నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ఇంటర్ లేదా డిగ్రీ అర్హతలు పెట్టాలని, ప్రభుత్వం భావిస్తోంది.