పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం లో కూటమి నేతల మధ్య విభేదలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి . ఎన్నికల ముందు భాయ్ భాయ్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన టిడిపి , జనసేన నేతలు గెలుపు అనంతరం ఎడమొహం పెడమొహం గా ఉంటున్నారు. వాస్తవానికి నిడదవోలు నియోజకవర్గం లో టిడిపి నుండి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పోటీచేస్తారని చివరి వరకు అంతా భావించారు. అయితే రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించిన జనసేన నేత కందుల దుర్గేష్కు చివరి నిముషంలో నిడదవోలు టికెట్ దక్కింది.
అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే శేషారావు కొంత బాధపడినా కూటమి గెలుపు కోసం పాటుపడ్డారు. నిడదవోలు నియోజకవర్గంలో కందుల దుర్గేష్ నాన్ లోకల్ అంటూ వైసిపి నేతలు చేసిన ప్రచారాన్ని సైతం తిప్పి కొట్టిన టిడిపి నేతలు పెద్దన్న పాత్ర పోషించి దుర్గేష్ గెలుపు లో కీలక పాత్ర పోషించారు. మంత్రి కందుల దుర్గేష్ సైతం టిడిపి నేతలు కష్టాన్ని గుర్తుపెట్టుకుంటానని … అసలు నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అని తాను రెండవ ఎమ్మెల్యేని అని ప్రకటించారు. తర్వాత దుర్గేష్ గెలవడం అనంతరం మంత్రి పదవి వరించడం చకచకా జరిగిపోయాయి.
అప్పటి నుంచి శేషారావు కు క్రమేపి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని టిడిపి నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అన్న కాంటీన్ నిడదవోలు నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సమయంలో మాజీ ఎమ్మెల్యే శేషారావుకు మంత్రి దుర్గేష్ నుండి కనీస పిలుపు రాలేదు. ఏదో పిలవాలి అంటే పిలవాలి అన్నట్లు చిన్న స్థాయి అధికారితో ఫోన్ చేయించి అవమానించారని శేషారావు వర్గం ఫీల్ అవుతుందంట .. దానికి తగ్గట్లే అన్నకాంటీన్ ప్రారంభానికి శేషారావు డుమ్మా కొట్టారు. అధికారిక కార్యక్రమాల్లో టిడిపి నేతల్నే కాదు జనసేన నేతల్ని సైతం మంత్రి పట్టించుకోవడం లేదని నిడదవోలు జనసైనికులు మండి పడుతున్నారు. అసలు నిడదవోలు నియోజకవర్గం లో అసమ్మతులకు కారణం మంత్రి దుర్గేష్ కు కవచం లా ఉన్న కడియం బ్యాచ్ వల్లే అంటున్నారు కూటమి నేతలు.
Also Read: బాలకృష్ణ చిన్నల్లుడికి గంటా షాక్.. అసలు కథ ఇదే
మంత్రి వర్గం లో కందుల దుర్గేష్ కు స్థానం వచ్చిన తర్వాత కడియం నేతలు ఆయన చుట్టూ చేరిందంట. ఎన్నికల్లో దుర్గేష్ విజయానికి సహకరించిన నిడదవోలు నేతలైనా సరే.. దుర్గేష్ను కలవాలంటే కడియం బ్యాచ్ అనుమతి తీసుకోవాలంట. నిడదవోలు నియోజకవర్గంలో పలు సమస్యలతో వచ్చే ప్రజలను కూడా మంత్రిని కలవడానికి అనుమతించడం లేదంట. అంతెందుకు అసలు కడియం టీమ్ కు తెలియకుండా మంత్రి గారి కార్యాలయంలో చిన్నవిషయం జరగదని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతా మేమె , మేము చేపిందే జరాగాలి , మాకు తెలియకుండా ఏమి జరగకూడదు అంటూ మంత్రి సిబ్బందికి కడియం బ్యాచ్ ఆదేశాలు కూడా ఇచ్చారంట. దాంతో మంత్రి కార్యాలయ సిబ్బంది నిడదవోలు నియోజకవర్గ నేతలు, కడియం టీమ్ మధ్య నలిగిపోతున్నారట. లోకల్ గా ఉండే నాయకుల్ని విస్మరించి నాన్ లోకల్ నేతలు నిడదవోలు నియోజకవర్గం లో హంగామా చేయడం స్థానికం గా ఉండేవారికి మింగుడు పడటం లేదు. ఇవన్నీ పక్కన పెడితే అసలు మంత్రి దుర్గేష్ ఓటమి కి శతవిధాలా ప్రయత్నించిన వైసిపి నేతలతో కడియం బ్యాచ్ అంట కాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిడదవోలు నియోజకవర్గం లో టిడిపి నేతలే మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనుకుంటే పొరపాటే.. స్థానిక జనసేన నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మంత్రి దుర్గేష్ కాన్వాయ్ లో మొత్తం కడియం నేతలే ఉంటున్నారని.. నియోజకవర్గంలో వారి హవా చూస్తూ అటు మింగలేక కక్కలేక కామ్ గా ఉండిపోతున్నారంట. ఆ అసంతృప్తి భగ్గు మనే పల్లె పండుగ కార్యక్రమం లో మంత్రి దుర్గేష్ కు టిడిపి నేతలు అడ్డుకున్నారు. కూటమి అంటే జనసేన, టీడీపీ, బీజేపీనా లేక జనసేన వైసీపీనా అంటూ టిడిపి నేతలు ప్రశ్నించడం ఇపుడు వైరల్ గా మారింది.
ఎన్నికల ముందు మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గ నేతలకు ఇచ్చిన హామీలు, వారిని ప్రసన్నం చేసుకోవడానికి మాట్లాడిన మాటలు ఇప్పుడు మర్చిపోయినట్లు కనపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దుర్గేష్ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని కడియం బ్యాచ్ చేస్తున్న పెత్తనాన్ని ఇప్పటికయినా అడ్డుకోకపోతే నియోజకవర్గం లో దుర్గేష్పై మరింత అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు సీనియర్ రాజకీయ నేతలు. మరి కందుల సార్ దీనికి ఎలా పరిష్కారం చూపిస్తారో చూడాలి.