Nellore Nominated Posts| నామినేటెడ్ పదవుల పంపకం నెల్లూరు జిల్లా కూటమి శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతుంది .. ఎన్నికల ఫలితాలకు ముందు ప్రధాన పార్టీలలో ఎలాంటి ఉత్కంఠ నెలకొందో అంతకు మించిన స్థాయిలో ఇప్పుడు కూటమి నేతలు టెన్షన్ పడుతున్నారు … ఫస్ట్ లిస్టులో చోటు దక్కించుకోలేక పోయిన ఆశావహులు రెండో జాబితా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు .. టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి నాయకులు పెద్ద ఎత్తున పదవులు ఆశిస్తుండటంతో ఆశావహుల లిస్ట్ చాంతాడంత కనిపిస్తుంది.
ఎన్నికల్లో గెలవాలి… అధికారం చేతికి రావాలి, రాజకీయంగా పదవులు పొందాలి… ఏ రాజకీయ పార్టీ శ్రేణులైనా అవే కలలు కంటుంటాయి .. మొన్నటి ఎన్నికల్లో కూటమి శ్రేణులు సమిష్టిగా పనిచేసి ఆ పొలిటికల్ డ్రీమ్ నెరవేర్చుకున్నాయి … ప్రత్యేకించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల వైసీపీ ఫలితాలను రివర్స్ చేసి పది అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు… ప్రభుత్వం ఏర్పాటు అయింది.. అప్పటి నుంచి జిల్లా నాయకుల్లో మరో ఉత్కంఠ మొదలైంది … నామినేటెడ్ పోస్టుల పందారంలో తమకు ఛాన్స్ దక్కుతుందో లేదో అని నేతలు టెన్షన్ పడుతున్నారు.
ఎవరికి ఏ కార్పొరేషన్ పదవి దక్కుతుందో? లిస్టులో తమపేరు ఉంటుందా…? ప్రాధాన్యత గల పోస్టు దక్కుతుందా…? ఏ పదవి ఎవరిని వరిస్తుంది? … ఇదే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కూటమికి చెందిన నాయకుల్లో ఏ ఇద్దరు కలిసినా… ఏ నలుగురు అధికార పార్టీ నాయకులు ఒకచోట చేరినా జరుగుతున్న పొలిటికల్ డిస్కషన్… ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత నామినేడెట్ పదవుల తొలి జాబితా ప్రకటించారు .. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల తరువాత నామినేటేడ్ పోస్టులు గత నెల 24న భర్తీ చేశారు .. రాష్ట్ర వ్యాప్తంగా 20 చైర్మన్ల పోస్టులు భర్తీ చేయగా, నెల్లూరు జిల్లాకు రెండు దక్కాయి.
Also Read: కడప జిల్లాలో విచ్చలవిడిగా భూ కబ్జాలు.. వైసీపీ నేతల చేతుల్లో పేదల భూములు!
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ కు రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్, జనసేన నాయకులు వేములపాటి అజయ్ కుమార్కు టిడ్కో కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం దక్కింది … సివిల్ సప్లై కార్పొరేషన్ లో డైరెక్టర్గా మంత్రి నారాయణ అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరెడ్డి సహా మరో అరడజను మందికి వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా స్థానం దక్కింది … తాజాగా రెండో జాబితా నేడో, రేపో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. మొదటి జాబితా విడుదలైన వారం రోజుల్లోనే రెండో జాబితా నామినేటెడ్ పదవుల జాబితాను ప్రకటించాల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడినట్లు తెలిసింది
మొదటి జాబితాలో పదవులు దక్కుతాయని ఆశించి కాస్త నిరాశ పడ్డ కూటమిలోని పలువురు ప్రధాన నేతలు ఇక రెండో జాబితాపైనే ఆశలు పెట్టుకున్నారు. పదవుల కోసం అనేక మంది నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు… పదవుల కోసం ఎవరూ ధరఖాస్తులు చేయొద్దని తామే చూసు కుంటామని టిడిపి అధినేత ప్రకటించడంతో .. అంతా పైవాడి దయ అని దణ్ణాలు పెట్టుకుంటున్నారు… జిల్లాలోని మొత్తం పదవుల్లో 20 శాతం జనసేన, పది శాతం బిజెపికి దక్కనున్నాయి…. ఇక రెండో జాబితాకు కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం … కార్పొరేషన్ పదవులను జనసేన, బిజెపి నాయకులు ఆశిస్తున్నప్పటికీ జాబితా మాత్రం జిల్లా టిడిపి కార్యాలయంలోనే సిద్దమైందంటున్నారు.
ఎంపిక విధానంలో ప్రధానంగా గత ఐదేళ్ల కాలంలో పనిచేసిన నాయకులు, కొత్తగా వచ్చిన నేతలు… ఎవరి ప్రాధాన్యత ఎంత? అనే విషయాలు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది… వ్యక్తిగత సిఫార్సులను పట్టించుకోకుండా అన్ని కోణాల్లో అభ్యర్థుల అర్హతలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్తున్నారు.. ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసి, ఆర్ధికంగా నష్టపోయినవారు, కేసులు పెట్టించుకున్నవారు, గత ప్రభుత్వ హయాంలో దాడులు ఎదుర్కొన్న వారు పదవుల రేసులో ముందున్నారంట … సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుంచి ఎన్నికలకు ముందు టిడిపిలోకి వచ్చిన నేతలు, ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని విజయం సాధించారు.
ఆ వలస నేతలు తమ అనుచరులు, బందువులు, స్నేహితుల కోసం సిఫార్సులు చేస్తున్నట్లు తెలుస్తుంది … ఈ నేపథ్యంలో ఎవరికి నామినేడెట్ పదవులు వర్తిస్తాయో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవైపు అధినేత తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని చెప్తూనే… మరోవైపు కార్పొరేషన్ పదవుల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట…. మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో కొందరికి మొదటి పదవుల పందారంలో అవకాశం దక్కలేదు … వారిలో మాజీ మంత్రి పనబాక లక్ష్మి, పనబాక కృష్ణయ్య, మాజీ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతమ్మ, ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, మాలేపాటి సుబ్బానాయుడు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వంటి సీనియర్లు కనిపిస్తున్నారు…
అలాగే మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, బొల్లినేని రామరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టి.అనురాధ, పోలంరెడ్డి దినేష్రెడ్డి, డాక్టర్ జెడ్ శివప్రసాద్, ఆనం వెంకట రమణారెడ్డి, గూటూరు కన్నబాబు, జడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ సహా పలువరు ఆశావహులు వెయిటింగ్లో ఉన్నారు … వీరితోపాటు పార్టీలోని వివిధ విభాగాలు, వర్గాలకు చెందిన నాయకులు కార్పొరేషన్ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారట. జనసేన, బిజెపి ల నుంచి పలువురు నేతలు కార్పొరేషన్ పదవులు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది … మరి ఇంత మంది ఆశావహుల్లో ఎంత మందికి న్యాయం జరుగుతుందో చూడాలి