Swami Vivekananda Jayanti : భారతీయ ఆధ్యాత్మికతను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో స్వామి వివేకానంద ముందువరుసలో ఉంటారు. వివేకానందుల గురించి మాట్లాడేవారిలో చాలామంది 1893 సెప్టెంబర్ 11 నాటి చికాగో ప్రపంచ మత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం గురించి తప్పక ప్రస్తావిస్తారు. ఇంతకూ ఆరోజు ఆయన అక్కడ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఇవే.
అమెరికా సోదర సోదరీమణులారా.. ఇక్కడ మాట్లాడేందుకు నన్ను ఎంతో ఆత్మీయంగా మీరు ఆహ్వానించిన తీరుకు నా మనసు నిండిపోయింది. ప్రపంచపు అత్యంత పురాతన సంస్కృతికి, సకల మతాలకు పుట్టినిల్లయిన నా భారతదేశం తరపున, అక్కడి అన్ని వర్గాలకు చెందిన కోట్లాది మంది తరపున మీకు నా కృతజ్ఞతలు. ‘మతసహనం’ అనే ఉదాత్త భావన తూర్పు దేశాల నుంచి వచ్చిందని ఇప్పటికే ఈ సదస్సులో వెల్లడించిన కొందరు వ్యక్తులకు నా కృతజ్ఞతలు. పరమత సహనం, పరమత ఆదరణ వంటి లక్షణాలను ప్రపంచానికి ప్రబోధించిన మతానికి చెందిన వాడినైనందుకు నేను గర్వపడుతున్నాను.
మేం కేవలం మతసహనాన్ని నమ్మటంతో బాటు అన్ని మతాలనూ స్వాగతిస్తాం. అన్ని మతాలకు, అణగారిన జన సముదాయాల ఆశ్రయమిచ్చిన దేశం నుంచి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. రోమన్ నిరంకుశ పాలకులు ఇజ్రాయేలీయుల పవిత్ర స్థలాలను ధ్వంసం చేసినప్పుడు, ఆ దీనులు.. దక్షిణ భారతదేశంలో తలదాచుకున్న వేళ మేం వారిని మా హృదయాలకు హత్తుకున్నాం. పార్సీలకు ఆశ్రయం ఇచ్చిన మతానికి చెందిన వాడిగా నేను గర్విస్తున్నాను. మేం ఇప్పటికీ వారికి అండగా నిలుస్తూనే ఉన్నాము. నేటి ఈ మత సమ్మేళనం అత్యంత పవిత్ర సంగమం.
ఈ సందర్భంగా నా బాల్యం నుంచి వింటున్న, నేటికీ అనేక లక్షల మంది చెప్పే మాటలను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడెక్కడో పుట్టి, పలు రీతుల్లో ప్రవహించే నదులన్నీ ఏ విధంగా చివరికి సముద్రంలో కలుస్తాయో.. అలాగే మనిషి కూడా తనకు నచ్చిన దారిని ఎన్నుకుంటాడు. చూసేవారికి ఈ దారులన్నీ వేరుగా ఉన్నప్పటికీ.. అవన్నీ చివరికి పరమాత్మనే చేరుకుంటాయి. ‘నా వద్దకు వచ్చిన దేన్నైనా, అది ఎలాంటిదైనా, దానిని నేను స్వీకరిస్తాను. మనుషులు వేర్వేరు దారులను ఎంచుకుంటారు, కష్టాలను ఎదుర్కొంటారు.
కానీ, చివరకు వారంతా నన్నే చేరతారు’ అనే నన్ను చేరుకుంటారు’ అనే భగవద్గీత వాక్యాలే దీనికి నిదర్శనం. మతతత్వం, మూఢ భక్తి పర్యవసానాలు ఈ అందమైన ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. అవి సృష్టించిన హింసతో ప్రపంచవ్యాప్తంగా నేల ఎరుపెక్కిపోయింది. ఆ కారణంగా ఎన్నో నాగరికతలు నేలగలిశాయి. ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఆ భయంకరమైన మత తత్వం, మూఢభక్తి లేకుంటే.. ఈ మానవ సమాజం ఇంతకన్నా మెరుగైన స్థితిలో ఉండేది. ఈ సర్వమత సమ్మేళనం అన్ని రకాల మూఢభక్తిని, పిడివాదాన్ని, హింసను దూరం చేస్తుందని విశ్వసిస్తున్నాను.