CM Revanth Reddy & CM Chandrababu Meeting: ఏపీ, తెలంగాణ విభజన జరిగాక.. కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయి. అవి అసలే పరిష్కారం కాకుండా పెద్ద హెడెక్ గా మారాయి. ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ జరగనుండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో విభజన సమస్యలు కొలిక్కి వస్తాయా లేదా అన్నది కీలకంగా మారింది. చెప్పాలంటే చాలా చిక్కుముడులు ఉన్నాయి. ఒక్కొక్కటి విప్పితే కొత్త సమస్యలు వస్తున్నాయి. రెండువైపులా పట్టు విడుపులు ఉంటే తప్ప పరిష్కారం కనిపించడం లేదు. మరి ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా డీల్ చేస్తారు..? వారి ముందున్న ఆప్షన్లు ఏంటి? ఎవరు ఎలా డీల్ చేస్తే ఒక పరిష్కారం దొరుకుతుందో చూద్దాం.
అవును పదేళ్లయినా విభజన సమస్యలకు ఓ పరిష్కారం దొరకడం లేదు. ఆంధ్ర, తెలంగాణ విడిపోయాక.. విభజన చట్టంలో కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆస్తులు, అప్పులను ఎలా షేర్ చేసుకోవాలి.. ఎవరేమి తీసుకోవాలి, వాటిని ఎలా డివైడ్ చేయాలి అంటూ కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. అయితే అక్కడే అసలు సమస్య వచ్చింది. ఆ నిర్వచనాలను ఆంధ్ర, తెలంగాణ వేటికవే అన్వయించుకుంటున్నాయి. ఈ పాయింట్ తమకు అనుకూలంగా ఉందంటే.. అదే పాయింట్ ఫలానా యాంగిల్ లో తమకే అనుకూలమన్న వాదనలు నడుస్తున్నాయి. దీంతో వ్యవహారం ముందుకు కదలడం లేదు. ఎవరూ వెనక్కు తగ్గడం లేదు.
ఎవరికైనా, ఎక్కడైనా వచ్చే సమస్య ఒక్కటే. ఆస్తులు, అప్పుల చుట్టూనే అసలు మ్యాటర్ తిరుగుతుంటుంది. ఇందుకు తెలంగాణ, ఆంధ్ర అతీతం కాదు. ఎందుకంటే చాలా ఏళ్లు కలిసి ఉన్న ఈ రెండు ప్రాంతాల ఉమ్మడి ఆస్తులు, అప్పుల వ్యవహారం తేలడం అంత సులువు కాదు. ఒకడుగు ముందుకు అంటే రెండడుగులు వెనక్కు అన్నట్లుగా పరిస్థితి ఉంది. నిజానికి ఈ విభజన వివాదాలను అలాగే వదిలేస్తే వందేళ్లయినా కంప్లీట్ కావు. అలాగే ఉండిపోతాయి. భవిష్యత్ లో సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. కానీ చాలా ఓర్పు నేర్పుతో ఉంటే పరిష్కరించడం ఈజీనే. ఏ సమస్యకైనా పరిష్కారం కూడా కచ్చితంగా ఉండి తీరుతుంది. అందుకే ఏదో ఒక పరిష్కారం సాధించే దిశగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు డిసైడ్ అయ్యారు.
విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపించారు. మొదట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కలుద్దామని ప్రతిపాదించారు. దీనికి సీఎం రేవంత్ ఓకే చెప్పారు. డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్ చేశారు. మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ వేదికగా శనివారం రోజున మీటింగ్ జరగబోతోంది. ఇప్పటికే రెండువైపుల నుంచి రిపోర్టులు సిద్ధమయ్యాయి. పరిష్కార మార్గాలపై ఆఫీసర్లు లిస్టు రెడీ చేశారు. వీటికి ఆమోదముద్ర వేయించుకోవడమే తరువాయి. కొన్ని వీలు కాకపోతే కేంద్రం కోర్టులోకి బంతి వెళ్లనుంది. అక్కడ కొన్నిటికి పరిష్కారం దొరికే అవకాశం ఉందంటున్నారు. సో మొత్తానికి విభజన సమస్యల విషయంలో ఒక పెద్ద ముందడుగైతే పడింది. మంచి అవుట్ కమ్ వస్తుందని రెండు తెలుగు రాష్ట్రాల జనం, అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి.
Also Read: నేడే తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ..చర్చపై ఉత్కంఠ!
తాజాగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులతో వరుసగా భేటీలు నిర్వహించారు. అందులో చెప్పాల్సినవి చెప్పారు. కావాల్సినవి కోరారు. చొరవ తీసుకుని పరిష్కరించే వాటిని చూడాలన్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ సందర్భంగా విభజన అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాము చేసుకోగలిగినవి చేసుకున్న తర్వాత మిగితా విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలన్నారు. అలాగే ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరారు. అదే సమయంలో పోలవరం ముంపు గ్రామాల విలీనం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలకు గుర్తు చేశారు. తమ పరిధిలో చేయాల్సినవి చేసే ప్రయత్నంలో ఉన్నారు.
గతంలో సీఎంలుగా ఉన్న కేసీఆర్, జగన్ కలిసి భోజనం చేయడం, రాజకీయాలు చేయడం తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో చర్చించలేదని కోదండరాం వంటి నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల తాజా సీఎంల భేటీ ఎలాంటి అవుట్ కమ్ ఇస్తుందోనన్న ఉత్కంఠ ఉండడం సహజమే. నిజానికి విభజన సమస్యల పరిష్కారం సబ్జెక్ట్ చాలా లోతైనది. పట్టువిడుపులతో ఉంటే పరిష్కారం దొరుకుతుంది. అదే సమయంలో ఇందులో రాజకీయంగా చాలా సవాళ్లు కూడా ఉన్నాయి. ఒకటి అప్పగించి, మరొకటి పొందుదామంటే రాజకీయ ప్రత్యర్థులు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండే సందర్భం. అప్పనంగా అప్పగించేశారు అన్న అపవాదును ఇద్దరు ముఖ్యమంత్రులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే శనివారం మీటింగ్ పై అందరి నజర్ ప్రజాభవన్ వైపే ఉంది.