Somireddy Vs Kakani Govardhan Reddy(AP political news): నెల్లూరు జిల్లా సర్వేపల్లి.. బెజవాడ గోపాలరెడ్డి లాంటి మహామహుల్ని అసెంబ్లీకి పంపిన నియోజకవర్గం.. మొదటి నుంచి అక్కడ హేమాహేమీల్లాంటి నేతలే తలపడుతున్నారు. అయితే సర్వేపల్లి ప్రత్యేకత ఏటంటే ఇప్పటి దాకా ఎవరినీ మూడసారి ఎమ్మెల్యేగా గెలిపించలేదు అక్కడి ఓటర్లు. ఈ సారి ఆ చరిత్ర తిరగరాయక తప్పని పరిస్థితి ఏర్పడింది సర్వేపల్లి వాసులకి.. టీడీపీ నుంచి పోటీలో ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వైసీపీ అభ్యర్ధి మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి ఇద్దరూ మూడోసారి విజయం సాధించడానికి తలపడుతున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో సర్వేపల్లి ఎవరికి జైకొడుతుంది..?
ఈ సారి ఎవరు ఎమ్మెల్యేగా మూడోసారి ఛాన్స్ ఇవ్వని సర్వేపల్లి ఓటర్లు సర్వేపల్లిలో రెండు సార్లు గెలిచిన సోమిరెడ్డి, కాకాణి మూడో విజయం కోసం తలపడుతున్న నేతలు వరుసగా 4 సార్లు పరాజయం పాలైన సోమిరెడ్డి సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత కలిసివస్తాయని ధీమా కాకాణికి వ్యతిరేకంగా సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్షలు వైసీపీలో వ్యతిరేకతను చక్కదిద్దుకునే పనిలో కాకాణి సర్వేపల్లిలో ఈ సారి గెలిచేదెవరు?
నెల్లూరు జిల్లా అంటే రాజకీయ చైతన్యం ఎక్కువ .. రాష్ట్ర, దేశ రాజకీయాలలో ఉన్నత పదవులు అధిరోహించిన నాయకులు చాలా మంది ఈ జిల్లాలో ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న నెల్లూరులో గత పదేళ్లుగా వైసీపీ హవా కొనసాగుతోంది.
Also Read: కరెంట్ బిల్లుపై లొల్లి.. HCAలో ఏం జరుగుతోంది ?
గత ఎన్నికల్లో టీడీపీకి జిల్లాలో ఒక్క సీటు కూడ దక్కలేదు. అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీ స్పీడ్కి బ్రేక్ పడే పరిస్థితి ఉందంటున్నారు. టీడీపీ కూటమి, వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ప్రత్యేకించి జిల్లాలో మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాలు ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ నియోజకవర్గంలో దేశంలోనే రెండో అతిపెద్దదైన కృష్ణపట్నం పోర్టు ఉంది … పవర్ ప్రాజెక్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలతో సర్వేపల్లి అభివృద్ధిపరంగా ముందు వరుసలో కనిపిస్తుంటుంది. ఇక వ్యవసాయంతో పాటు ఆక్వా సాగు కూడా ఎక్కువగా జరుగుతూ అవకాశాలు కల్పిస్తోంది.
ఈ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 31 వేల 837 మంది ఓటర్లు ఉంటే.. అందులో పురుష ఓటర్లు లక్షా 13 వేల 473. మహిళ ఓటర్లు లక్షా 18 వేల 336… ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో సహా 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ ఏడు సార్లు, తెలుగుదేశం నాలుగు సార్లు, వైసీపీ రెండుసార్లు, సిపిఐ ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. అంతేకాదు ఈ నియోజకవర్గం నుంచి ఏ ఎమ్మెల్యే కూడా మూడుసార్లు గెలిచిన పరిస్థితి లేదు.. కాంగ్రెస్ నుంచి సివి శేషారెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డిలు, టీడీపీ నుంచి మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలను రెండేసి సార్లు ఎమ్మెల్యేలుగా గెలిపించారు సర్వేపల్లి ఓటర్లు.
ఆ క్రమంలో ఈ సారి పోటీచేస్తున్న మంత్రి కాకాణి, మాజీ మంత్రి సోమిరెడ్డిల్లో ఎవరు గెలిచినా అది నియోజకవర్గ చరిత్రలో ఓ రికార్డే అవ్వనుంది. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఓటమి పాలైన టీడీపీ నేత సోమిరెడ్డి ఈసారి సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కలిసివస్తాయని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే 2014లో వైసీపీ నుండి ప్రస్తుత మంత్రి కాకాణి గెలుపొందారు. సోమిరెడ్డి పరాజయం పాలైయ్యారు. అయినా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారం దక్కించుకోవడంతో సోమిరెడ్డిని ఎమ్మెల్సీ చేసిన చంద్రబాబు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా పట్టం కట్టారు.
Also Read: PMLA పవరేంటి ? ఈడీకి చిక్కితే అంతేనా ?
గత ఎన్నికల్లో సైతం సోమిరెడ్డిని ఓడించారు కాకాణి.. మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యే కాకాణికి మంత్రిగా అవకాశం దక్కింది… అయితే వ్యవసాయశాఖ పగ్గాలు చేపట్టిన కాకాణి అధికార బలంతో కక్ష సాధింపులకు దిగు తున్నారని, రైతులకు కానీ వ్యవసాయశాఖకు కానీ ఆయన చేసిందేమి లేదని, అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువ జరిగిందని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు ..కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా, ఇసుక, తెల్లరాయి ఇలా దేనిని వదలకుండా దోచుకుంటున్నారని సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్షలు కూడా చేపట్టారు. ఆ క్రమంలో కాకాణికి తొత్తుల్లా మారిన యంత్రాంగం తీరు మార్చుకోకపోతే తాము అధికారంలోకి వచ్చాక వారి పనిపడతామని హెచ్చరిస్తున్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేసిందేమి లేదని ప్రతి పక్ష నేతలు విమర్శిస్తున్నాయి. సొంత పార్టీలో వ్యతిరేకతను చక్కదిద్దుకోవడానికే కాకాణికి టైం సరిపోవడం లేదని. ఇక ప్రజలను ఏం పట్టించుకుంటారని ఎద్దేవా చేస్తున్నాయి. మరోపక్క వైసిపి ప్రభుత్వం వచ్చాకే సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందని, ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి చేరుతున్నాయని.. టీడీసీ ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ జరిగిందని కాకాణి ప్రశ్నిస్తున్నారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రైస్ మిల్లర్ల దగ్గర డబ్బులు దండుకుని, రైతులకు తీవ్ర అన్యాయం చేశారని సర్వేపల్లి కి సోమిరెడ్డి చేసింది ఏమి లేదని కాకాని ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మాటల తూటాలతో సర్వేపల్లిలో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరిగిపోతుంది. మరక్కడ సోమిరెడ్డి, కాకాణిల్లో మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ చరిత్ర తిరగరాసేదెవరో చూడాలి.