Sir Isaac Newton : మూఢ విశ్వాసాలు, మోతాదుకు మించిన మత ప్రభావం ప్రపంచాన్ని ముంచెత్తున్న మధ్యయుగాల్లో పశ్చిమాన ఉదయించిన వెలుగుతార.. ఐజాక్ న్యూటన్. మనిషి.. తన వ్యక్తిగత ధార్మిక విశ్వాసాన్ని కొనసాగిస్తూనే.. తర్కం, హేతువుల ప్రాతిపదికన ముందుకు సాగిపోవాలని ప్రవచించిన ఈ శాస్త్రవేత్త తన గణిత, ఖగోళ, భౌతికశాస్త్ర పరిశోధనలతో ప్రపంచాన్ని సైన్సు దిశగా నడిపించారు.
ఇంగ్లండులోని లింకన్ షైర్ కౌంటీలోని Woolsthorpe Manor అనే గ్రామంలో 1643, జనవరి 4న న్యూటన్ జన్మించారు. న్యూటన్ పుట్టటానికి 2 నెలల ముందే తండ్రి కన్నుమూశారు. ఎనిమిదో నెలలో పుట్టి, అత్యంత బలహీనంగా ఉన్న ఆ శిశువు బతకడని బంధువులంతా భావించారు. బాల్యంలో పీలగా, నీరసంగా కనిపించేవాడు. న్యూటన్కి మూడేళ్ల వయస్సు వచ్చే సరికి తల్లి బార్ స్మిత్ అనే ఆయన్ను మరో వివాహం చేసుకుంది. దీంతో తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన న్యూటన్.. అమ్మమ్మ, తాతయ్యల సంరక్షణలో పెరిగాడు. బడిలో గణితం, సైన్స్ సబ్జెక్టు్ల్లో చురుగ్గా ఉండేవాడు. కానీ.. వదలని అనారోగ్యంతో బడికి తరచూ డుమ్మా కొడుతుండేవాడు. ఒక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు.
బడిలో తోటి పిల్లలంతా ఆటపాటలతో కాలక్షేపం చేస్తుంటే.. న్యూటన్ లైబ్రరీలో కాలం గడిపేవాడు. న్యూటన్ ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి విద్యార్థిగా ఉండగా, గ్రామంలో పశువుల పోషణలో తనకు సాయంగా రావాలని న్యూటన్కు.. ఆయన తల్లి కబురుపెట్టింది. దీంతో 17వ ఏట తిరిగి గ్రామానికి వెళ్లిన న్యూటన్ పశువులను కాస్తూ.. గణితం, సైన్స్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఈయన పరధ్యానం కారణంగా రోజూ గొర్రెలు తప్పిపోవటంతో సాయంత్రానికి తల్లిచేత చివాట్లు తింటుండేవాడు.
అయితే.. గణితంలో న్యూటన్ ప్రతిభను గుర్తించిన ఓ టీచర్.. అతడిని చదువు ఖర్చు తానే భరిస్తానని కబురుచేయటంతో 1661 జూన్లో న్యూటన్ ట్రినిటీ కాలేజీలో చేరి భౌతిక, గణిత శాస్త్రాల అధ్యయనం ప్రారంభించారు. న్యూటన్ పేదరికాన్ని తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారు. కానీ.. కొద్దిరోజుల్లోనే న్యూటన్ తన అసాధారణ ప్రతిభతో విద్యార్థుల, అధ్యాపకుల మనసు గెలుచుకున్నాడు. అక్కడి ట్రినిటీ కాలేజీలో మెట్రిక్యులేషన్ అతి తక్కువ మార్కులతో పూర్తిచేయటంతో స్కాలర్షిప్ రాలేదు. దీంతో తిరిగి ఇంటికి వెళదామనుకున్న న్యూటన్కు యూనివర్సిటీ బోర్డు సభ్యులు నాలుగేళ్ల పాటు స్కాలర్ షిప్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
ఆ నాలుగేళ్లు.. న్యూటన్ తిండీ నిద్ర మరిచి ఫిజిక్స్ రీసెర్చిలో మునిగిపోయారు. వర్సిటీ లైబ్రరీలో తన సబ్బెక్టులైన గ్రీకు, లాటిన్, హిబ్రు భాషలతో బాటు జామెట్రీ, త్రికోణమితి సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేశారు. ఆ సమయంలోనే కెప్లర్ పరిశోధనల మీద ఆసక్తిని ప్రదర్శించారు. 1665లో కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి డిగ్రీ, 1669 లో కేంబ్రిడ్జి నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1669లో అక్కడే గణిత శాస్త్ర ప్రొఫెసరుగా నియమించబడ్డారు.
అవివాహితుడైన న్యూటన్ జీవితాంతం ఒంటరితనాన్ని అనుభవించారు. రోజులో 19 గంటలు పరిశోధనకే కేటాయించటంతో 50 ఏళ్ల వయసులో నరాలు చచ్చు బడిపోయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కనీసం జుట్టు దువ్వుకునే టైం లేక అలా వదిలేసేవాడు. ఆయనకున్న ఒకే ఒక నేస్తం.. డైమండ్ అనే పెంపుడు కుక్క. దాని ఆలనాపాలనా చూసేటప్పుడే కాస్త సంతోషంగా కనిపించేవాడు. వదలని అనారోగ్యం, ఒంటరితనం వేధిస్తున్నా.. భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రాల్లో ఎన్నో పరిశోధనలు చేశారు. తన ఆలోచనలను ‘న్యూటన్ ప్రిన్సిపియా’ అనే పుస్తకంగానూ ప్రచురించారు. ఆయన ప్రతిభకు మెచ్చిన రాయల్ సొసైటీ.. 1703లో న్యూటన్ను అధ్యక్షుడిగా ఎన్నుకొంది. 1705లో సర్ పురస్కారాన్ని పొందారు.
సైంటిస్టుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన న్యూటన్ చేసిన కొన్ని పనులు మనలను ఆశ్చర్యపరచక మానవు. ఓసారి సూదితో కంటిలో పొడుచుకుంటే ఏమవుతుందని ప్రయత్నించి గాయపడ్డాడట. ఇతర లోహాలను బంగారంగా మార్చగలిగే దిశగా న్యూటన్ కొన్ని ప్రయోగాలు చేశాడు. న్యూటన్ వ్యక్తిగత లైబ్రరీలో 1500 పుస్తకాలుండేవి. వాటిలో తాంత్రిక, క్షుద్ర విద్యలకు సంబంధించిన పుస్తకాలు, థియోలజీ(వేదాంత శాస్త్రం) పుస్తకాలూ ఉండేవి. ఇక.. బైబిల్ అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. దీనిమీద తన ఆలోచనలను పుస్తకాల్లోనూ రాశాడు.
ఇక.. యాపిల్ చెట్టుకింద కూర్చొని ఉండగా, తన నెత్తిన పడిన యాపిల్ను చూసిన తర్వాతే ఆయన భూమ్యాకర్షణ సిద్దాంతం మీద దృష్టి సారించాడని చెప్పే ప్రచార కథనాలున్నా.. అవి వాస్తవాలనేందుకు తగిన ఆధారాలు మాత్రం లేవు. భౌతిక, గణిత శాస్త్రాల్లో విశేష పరిశోధనలు చేసిన ఈ సైన్సు పితామహుడు.. మార్చి 20, 1727న తన 84వ ఏట కన్నుమూశారు. ఈయనను వెస్ట్ మినిస్టర్ అబ్బే లో ఖననం చేశారు. ఆ మహనీయుని స్ఫూర్తితో నేటి తరాలు సైన్సు రంగంలో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.