Sibi Chakravarthy : ఏ శివాలయంలోనైనా పరమేశ్వరుడు పూజలందుకుంటాడు. కానీ.. చేజర్లలోని శివాలయంలో శివభక్తుడైన శిబి చక్రవర్తి లింగాకారంలో పూజలందుకుంటాడు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో నరసరావుపేటకు 30 కి.మీ దూరంలో ఉన్న చిన్న గ్రామమైన చేజెర్లలో ఈ శివాలయం ఉంది. ఒకప్పుడు చేరంజెర్లగా పేరున్న ఈ గ్రామమే కాలక్రమంలో చేజెర్లగా మారింది.
Sibi Chakravarthy : ఏ శివాలయంలోనైనా పరమేశ్వరుడు పూజలందుకుంటాడు. కానీ.. చేజర్లలోని శివాలయంలో శివభక్తుడైన శిబి చక్రవర్తి లింగాకారంలో పూజలందుకుంటాడు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో నరసరావుపేటకు 30 కి.మీ దూరంలో ఉన్న చిన్న గ్రామమైన చేజెర్లలో ఈ శివాలయం ఉంది. ఒకప్పుడు చేరంజెర్లగా పేరున్న ఈ గ్రామమే కాలక్రమంలో చేజెర్లగా మారింది.
ఈ భూమిని జనరంజకంగా పాలించిన 16 మంది చక్రవర్తుల్లో యయాతి ఒకరు. ఆయన కుమారుడైన మాంధాతకి ముగ్గురు కుమారులు. వారే.. శిబి, మేఘదంబరుడు, జీమూతవాహనుడు. వీరిలో శిబి చక్రవర్తి కాగానే.. అతని పెద్ద తమ్ముడైన మేఘదంబరుడు తీర్థయాత్రలు చేయాలని అనుకుంటాడు. దీంతో శిబి.. తన తమ్ముడికి తోడుగా 1500 మంది బలగాలను తోడిచ్చి పంపుతాడు. వీరంతా కశ్మీరం నుంచి బయలుదేరి శ్రీశైలాన్ని దర్శించుకుని, నేటి చేజెర్ల సమీపంలోని ఒక కొండ వద్దకు చేరగా అక్కడ అనేక మంది మునులు మేఘదంబరుడికి కనిపిస్తారు. వారి పరిచయం, సాంగత్యంతో ఆయన తపస్సు చేయటం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే ఆయన శివైక్యం చెందుతాడు. తోడుగా వెళ్లిన బలగాలు.. ఆయనకు అక్కడే అంత్యక్రియలు చేయగా.. ఆ భస్మరాసి నుంచి ఒక శివలింగం ఉద్భవిస్తుంది.
దీంతో మేఘదంబరుడికి తోడుగా వచ్చిన బలగాలు తిరిగి శిబి చక్రవర్తి వద్దకు వెళ్లి జరిగిన సంగతి చెప్పగా.. ఆయన తన రెండవ తమ్ముడైన జీమూత వాహనుడిని వెళ్లి.. అసలు సంగతేంటో కనుక్కొని రమ్మని బలగాలు తోడుగా ఇచ్చి పంపుతాడు. ఆయన అక్కడకు చేరుకుని, అన్నగారి శివలింగం రూపంలో ఉన్న అన్నను చూసి, వైరాగ్యంతో అక్కడే తపస్సు ఆచరించి ఆయన కూడా శివైక్యం చెందుతాడు. తోడుగా వెళ్లిన బలగాలు.. అన్నగారి అంత్యక్రియలు జరిగిన ప్రదేశానికి పక్కనే.. జీమూత వాహనుడి అంత్యక్రియలు నిర్వహించగా అక్కడ కూడా మరో శివలింగం ఆవిర్భవిస్తుంది.
ఈ సంగతి తెలుసుకున్న శిబి చక్రవర్తి.. అక్కడికి తరలి వెళ్లి, శివలింగాల రూపంలో ఉన్న ఇద్దరు తమ్ముళ్లను చూసి, దు:ఖించి, 100 యజ్ఞాలు చేయాలని సంకల్పించి, 99 యజ్ఞాలు పూర్తి చేస్తాడు. చివరి యజ్ఞం జరుగుతుండగా, శిబి చక్రవర్తి నిష్టను పరిశీలించేందుకు శివుడు వేటగాడి రూపంలో, విష్ణువు పావురం రూపంలో, బ్రహ్మ శివుని చేతిలో బాణంగా మారి అక్కడికొస్తారు. వేటగాడిగా ఉన్న శివుడు శిబి చక్రవర్తి యజ్ఞం చేసే చోటికి వచ్చి వెతుకుతుండగా, బాణం తగిలిన పావురం శిబి తొడ మీద వాలి.. శరణు కోరగా శిబి దానికి అభయమిస్తాడు.
అప్పుడు.. ఆ వేటగాడు ‘ఈ ఆహారం నాది. నా కుటుంబానికి ఈ పూటకు ఇదే ఆధారం. కనుక దానిని నాకు ఇవ్వు’ అని అడగ్గా, దానికి తాను అభయమిచ్చాననీ, కనుక పావురం బరువుకు సమానమైన తన మాంసాన్ని ఇస్తానని చెప్పి ఒప్పిస్తాడు. అనంతరం ఒక తక్కెడ తెచ్చి అందులో ఒకవైపు గాయపడిన పావురాన్ని ఉంచి, తన శరీరంలో నుంచి కొంత మాంసాన్ని కోసం ఉంచుతాడు. ఇలా.. కాళ్లు, చేతులు, చివరికి తానే అందులో కూర్చుంటాడు.
శిబి త్యాగానికి బిత్తరపోయిన త్రిమూర్తులు తక్షణం.. తమ రూపాలను ధరించి..శిబికి తిరిగి పూర్వరూపాన్ని ప్రసాదించి వరం కోరుకోమని కోరగా, తనకు, తన సోదరులకు కైలాస ప్రాప్తిని ఇవ్వటంతో బాటు తాను ఇక్కడే లింగరూపంగా ఉండిపోవాలని కోరతాడు. నాటి శిబి మోక్షం పొందిన చోటనే ఆయన తల లేని మొండెమే నేటి కపోతేశ్వర లింగంగా మారింది. ఈ లింగానికి వెనక వేటగాడు, పావురం కనిపిస్తాయి. శిబి త్యాగానికి కదిలిపోయిన దేవగణాలంతా నాడు స్వర్గం నుంచి ఆకాశగంగా జలంతో అభిషేకం చేసిన నీరే.. ఓంకార నదిగా మారింది. దానినే నేడు ‘ఓగేరు’ అంటున్నారు.
ఇక.. ఆలయ విశేషాలను పరిశీలిస్తే.. ఇక్కడి స్వయంభువుగా ఉన్న శివలింగం శిరస్సు లేని మొండెం ఆకారంలో, చతురస్రాకారపు వేదిక మీద ఉంటుంది. ఈ లింగం చుట్టూ.. శరీరాన్ని కోసి మాంసం తీసినట్లుగా గుంతలు పడి ఉంటుంది. ఈ శివలింగానికి అభిషేకం చేసిన నీరు గర్భాలయం నుంచి బయటికి పోయే మార్గం లేదు. నాడు శిబి చక్రవర్తి తన రెండు చేతులూ నరికి ఇచ్చినందుకు గుర్తుగా ఈ లింగానికి కుడి, ఎడమవైపు రెండు బిలాలుంటాయి. వీటిలో కుడిబిలములో ఒక బిందె నీరు మాత్రమే పడతుంది. ఎడమబిలంలో ఎన్ని నీళ్ళు పోసినా నిండదు. గతంలో ఒకసారి ఆ ఎడమబిలాన్నినీటితో నింపే ప్రయత్నం చేయగా, అందులో నుంచి పొగ, మంటలు వచ్చాయని, అప్పుడు అపరాథ శాంతి చేశారని చెపుతారు. అంతేకాకుండా కుడిబిలంలో పోసిన నీరు మరునాటికి పచ్చిమాంసపు వాసన వస్తుందని చెపుతారు. ఈ నీటిని ప్రతిరోజు కుంచెకోలతో తీస్తారట. అందుకే దీన్ని శల్యలింగంగా చెపుతారు. లింగానికి సహజ యజ్ఞోపవీతం కనిపిస్తుంది.
ఈ ఆలయం చేజర్ల గ్రామానికి వాయువ్య దిశగా ఉంటుంది. తూర్పు ముఖంగా ఉండే ఆలయంపై చిన్న సాదాసీదా గోపురం ఉంటుంది. స్వామివారికి ఎడమవైపు మండపంలో శ్రీ పార్వతీదేవి కొలువు తీరి ఉంది. ఆలయానికి బయట దక్షిణంగా గతంలో 56 అడుగుల పొడవైన చెట్టు ఉండేది. అది 1917లోనే కూలిపోయింది. ఈ ఆలయ నిర్మాణాన్ని వాస్తుశాస్త్రంలో ‘హస్తిప్రస్త’ (ఏనుగు వీపు) అని అంటారు. ఈ ఆలయంలో 9 శాసనాలున్నాయి. వాటిలో రెండు శాసనాల ప్రకారం.. కపోతీశ్వరుని చుట్టూ 4,444 లింగాలున్నాయి. మరో రెండు శాసనాలు క్రీ.శ.1069, 1087 కు చెందినవి. అలాగే విజయనగర కాలపు శాసనాలు కూడా ఇక్కడ చాలా వున్నాయి.