Sharad Pawar latest update(Political News India): మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది ఊహించని అత్యంత కీలక పరిణామం. శరద్ పవార్ తీసుకున్న మరో అనూహ్య నిర్ణయం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేయడం వెనక ఏం జరిగింది? ఏ ఒక్కరు ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించలేదు. ఎవ్వరూ ఆయన్ను దిగిపోవాల్సిందిగా కోరలేదు. అసలు శరద్ పవార్ లీడర్షిప్పై పార్టీ లీడర్లలో, కేడర్లో ఎలాంటి సందేహాలు లేవు. అలాంటిది పార్టీ నుంచి ఎందుకు తప్పుకోవాలనుకున్నారు?
బీజేపీతో పెట్టుకుంటే అట్లుంటది మరి. ఎలాంటి రాజకీయ యోధుడైనా కంగు తినాల్సిందే. కురవృద్ధుడైనా తలపట్టుకోవాల్సిందే. ఆట నుంచి తప్పుకోవాల్సిందే. మహారాష్ట్రలో కమలనాథులు ఆడుతున్న పవర్ ప్లేతో సీనియర్ మోస్ట్ లీడర్ శరద్ పవార్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. ఆయన ఫ్యామిలీని ఓసారి చీల్చి.. ఇప్పుడు మరోసారి ముక్కలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది తెలిసి.. ఇక తనవల్ల కాదంటూ.. తాను ఈ రాజకీయాలను తట్టుకోలేనంటూ.. ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు పవార్.
మహారాష్ట్రలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ జోరుగా నడుస్తోంది. పవార్ అన్న కొడుకు, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీలో తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో బీజేపీతో దోస్తీకి వెళ్లబోతున్నాడంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. అయితే అజిత్ పవార్ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు. బాబాయ్-అబ్బాయ్ నడుమ గ్యాప్ గురించి, హఠాత్తుగా ఏం పరిణామం జరగబోతుందా అనే ఆసక్తికర చర్చ మహా రాజకీయాల్లో నడుస్తుండగానే పవార్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా ప్రకటించారు.
అధికారంలో ఉన్న బీజేపీ, ఏక్ నాథ్ షిండే సారథ్యంలోని శివసేనకి ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఏక్ నాథ్ షిండే వ్యవహార శైలి ప్రజలకు నచ్చట్లేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇదివరకు శివసేనను కలిగివున్న ఉద్ధవ్ ఠాక్రే వైపు ప్రజలు చూస్తున్నారనే టాక్ ఉంది. ఇలాంటి సమయంలో.. బీజేపీతో కలిసి ముందుకెళ్లేందుకు ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రయత్నిస్తున్నారనే వార్తలొచ్చాయి. ఏక్నాథ్ షిండేను దించేసి.. ఆ పీఠం అజిత్కు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అబ్బాయ్ వ్యవహార శైలిపై బాబాయికి అనుమానం బలపడింది. ఎన్సీపీని వీడి బీజేపీ మద్దతుతో అజిత్ పవార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఊహే.. శరద్ పవార్కి నచ్చలేదు. ఈ వివాదమే అటు పార్టీలో.. ఇటు ఫ్యామిలీలో చిచ్చు రేపి.. చినికి చినికి గాలివానలా మారి.. శరద్ పవార్ రాజీనామా వరకు వెళ్లిందని విశ్లేషకుల మాట.
బాబాయ్ గేమ్ అబ్బాయిని డిఫెన్స్లో పడేసిందా? అజిత్ పవార్తో కలిసి పార్టీని వీడేందుకు సిద్ధపడినవాళ్లు డైలమాలో పడ్డారా? ఎందుకంటే మీ నాయకత్వమే కావాలంటూ నాయకులు, కార్యకర్తలు ఏకంగా ఆందోళన చేసిన పరిస్థితి. పవార్ వారసులుగా అజిత్ పవార్, సుప్రియా సూలే వాళ్లకు స్వయంగా నచ్చజెప్పాల్సి వచ్చింది. అయినా విన్లేదు. మీరే మా నాయకుడంటూ ఇప్పుడు చెప్పిన అజిత్ పవార్ ముందరి కాళ్లకు బంధం పడినట్టే అయింది. ఇప్పటికిప్పుడు ఆయన పార్టీని వీడేందుకు రీజన్ లేకుండా పోయింది. పవార్ పొలిటికల్ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.. మరెన్నో డేరింగ్ డెసిషన్స్ తీసుకున్నారు. అసలు సోనియాగాంధీ ప్రధానమంత్రి కాకుండా అడ్డు చక్రం వేసిందే శరద్ పవార్. ఆ సమయంలో పురుడు పోసుకున్నదే ఎన్సీపీ. అలాంటి పార్టీ ముక్కలు చెక్కలు అవుతుంటే.. పవార్ చూస్తూ ఊరుకుంటారా? అయినా.. రాజకీయాల్లో ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో చెప్పడం కష్టం. ఈ నిమిషానికైతే పవార్ గేమ్ సక్సెస్ అయింది. మరి భవిష్యత్లో ఏం జరుగుతుందన్నది చూడాలి. ముఖ్యమంత్రి కుర్చీ కంటే ముఖ్యం రాజకీయ నాయకుడికి వేరే ఉంటుందా? అన్నట్టు.. శరద్ పవార్ రాజీనామాతో మరో ముఖ్యమైన అంశం తెరపైకి వచ్చింది. అదేమిటంటే.. పవార్ తర్వాత ఎవరు? పార్టీని నడిపించే వారసుడు ఎవరు? సొంత బిడ్డ సుప్రియా సూలేనా? అన్న కుమారుడు అజిత్ పవారా? మరి, దీనికి శరద్ సమాధానం ఏమిటన్నది చూడాలి.