Sanjay Raut : మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. రాహుల్ గాంధీ విషయంలో శివసేన వెనక్కి తగ్గింది. వారం క్రితం కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుంటామని హెచ్చరించిన ఆ పార్టీ రోజుల వ్యవధిలోనే స్వరం మార్చింది. తాజాగా రాహుల్ గాంధీని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశంసించారు. రాహుల్ తనకు ఆదివారం ఫోన్ చేసినట్లు వెల్లడించారు. జైలు నుంచి తిరిగివచ్చిన తర్వాత తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని సంజయ్ రౌత్ తెలిపారు. భారత్ జోడో యాత్రతో బీజీగా ఉన్నాసరే రాహుల్ తనతో మాట్లాడారని వెల్లడించారు. ఇదే సమయంలో సంజయ్ రౌత్ బీజేపీపై మరోసారి మండిపడ్డారు. తాను జైలుకు వెళ్లినప్పుడు కాషాయ పార్టీ నేతలు సంబరపడ్డారని విమర్శించారు. వాళ్లు మొగలుల కాలం నాటి రాజకీయాలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.
అసలు వివాదం ఇదీ
భారత్ జోడో యాత్రలో గతవారం వీర్ సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపాయి. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. సావర్కర్ ను విమర్శిస్తే మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర సాగదని అటు సీఎం ఏకనాథ్ శిండే కూడా హెచ్చరించారు. ఆ సమయంలో ఈ ఇష్యూపై శివసేన కూడా స్పందించింది. సావర్కర్ను అవమానించేలా మాట్లాడితే అవసరమైతే కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుంటామని హెచ్చరించింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితిలో మార్పు వచ్చింది. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. రాహుల్పై ప్రశంసల వర్షం కురిపించడం చూస్తుంటే ఇదే విషయం స్ఫష్టమవుతోంది. సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నా రాహుల్ తమతో కలిసి ముందుకు సాగాలనుకుంటున్నారని సంజయ్ రౌత్ స్పష్టతనిచ్చారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని కొనియాడారు.
కూటమికి ఢోకాలేనట్టేనా?
ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో శివసేన-తన పాత్ర మిత్రపక్షం బీజేపీతో కలిసే అవకాశం ఎలాగూ లేదు. అలాగే ఒంటరిగా పోటీ చేసే సాహసం ఆ పార్టీ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే బలమైన నేతలందరూ సీఎం శిండే వర్గంలో చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొనాలంటే కచ్చితంగా కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన జత కట్టాల్సిందే. అందుకే వీరసావర్కర్ పై రాహుల్ చేసిన విమర్శలను సున్నితంగా ఖండించిన ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో బంధాన్ని మరింత బలపేతం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. అందుకే రాహుల్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ , ఎన్సీపీ, శివసేన కలిసి మహావికాస్ అఘాడీ కూటమిగానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.