RevanthReddy: రేవంత్రెడ్డి పక్కా పీసీసీ చీఫ్ అనిపించుకున్నారు. కాంగ్రెస్ను వీడిన వారంతా తిరిగి పార్టీలోకి రావాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలని అన్నారు. తనతో ఏదైనా ఇబ్బంది ఉంటే.. తన పై వారితో మాట్లాడొచ్చని సూచించారు. పార్టీ కోసం ఒక్క మెట్టు కాదు.. పది మెట్లు అయినా దిగుతానంటూ అసలుసిసలు నాయకుడిలా మాట్లాడారు రేవంత్రెడ్డి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, వివేక్ వెంకటస్వామి.. ఇలా పేరు పేరునా వాళ్లను కాంగ్రెస్లో చేరాల్సిందిగా ఓపెన్ ఆఫర్ ఇచ్చారు రేవంత్. వాళ్లంతా కేసీఆర్ను ఓడించేది బీజేపీ మాత్రమేననే నమ్మకంతో ఆ పార్టీలో చేరారని.. అంతేకానీ వాళ్లకు బీజేపీ సిద్ధాంతాలతో సంబంధం లేదన్నారు. వాళ్లు వీళ్లను నమ్మరు, వీళ్లు వాళ్లను నమ్మరని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిదని.. అందరినీ అక్కున చేర్చుకుంటుందని.. పార్టీలోకి ఎవరైనా రావొచ్చని భరోసా ఇచ్చారు రేవంత్రెడ్డి. తనతో ఏదైనా సమస్య ఉంటే.. అధిష్టానంతో మాట్లాడొచ్చని సూచించారు. తాను మాత్రమే నాయకుడిని కాదని.. తాను సైతం ఖర్గే నాయకత్వంలో పని చేస్తున్నానని.. పార్టీ కోసం ఎంతైనా తగ్గుతానని.. తనను తిట్టినా పట్టించుకోనని చెప్పుకొచ్చారు రేవంత్రెడ్డి.
రేవంత్రెడ్డి ప్రస్తావించిన వారంతా కీలకమైన నాయకులే. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మళ్లీ కాంగ్రెస్లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతుండగా.. వస్తే ఆహ్వానిస్తామని రేవంత్ అన్నారు. ఇక, ఎటు వెళ్లాలో తెలీక పొలిటికల్ జంక్షన్లో నిలుచున్న పొంగులేటి, జూపల్లిలకు షేక్ హ్యాండ్ ఇస్తాం రమ్మంటున్నారు. ఈటల రాజేందర్కు బండి సంజయ్తో పొసగడం లేదని తెలిసి.. ఆయన్నూ కాంగ్రెస్లోకి ఇన్వైట్ చేశారు. కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఎప్పటినుంచో కన్నుంది. వివేక్ వెంకటస్వామి ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడే. బలమైన మీడియా అధినేత కూడా. వీళ్లంతా ఇటీవల కాలంలో కాషాయ కండువా కప్పుకున్న నేతలు కావడం.. వారంతా అక్కడ ఇమడలేకుండా ఉన్నారని ప్రచారం జరుగుతుండటంతో.. వారికి రేవంత్రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విధానం బాగుందంటూ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వస్తున్నాయి. మరి, రేవంత్ ఆఫర్కు అటునుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో.