Manipur violence latest updates(Today’s breaking news in India): దారుణం జరిగింది. మణిపూర్లో పరిస్థితి అదుపు తప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనంతో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. అరాచకవాదులు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అంతా ఉలిక్కిపడ్డారు. యావత్ దేశాన్ని కుదిపేసింది.
ఘటనపై రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ వీడియో వైరల్ అవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే డిలీజ్ చేయాలని ట్విటర్ సహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లను ఆదేశించింది.
వీడియోలో దృశ్యాలు దారుణంగా ఉన్నాయి. ఇద్దరు మహిళలు దుస్తులు లేకుండా ఉన్నారు. వారి చుట్టూ చాలామంది మగవారు కనిపిస్తున్నారు. వారంతా కలిసి బాధిత మహిళలపై అత్యాచారం చేశారని ఓ ఆదివాసీ సంస్థ ఆరోపించింది. మే 4న ఈ ఘటన జరగ్గా.. లేటెస్ట్గా ఈ వీడియో వైరల్ అయ్యింది.
ఘటనపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ మౌనం, చేతకాని తనం వల్లే మణిపుర్లో అరాచకాలు జరుగుతున్నాయని.. దీనిపై I-N-D-I-A మౌనంగా ఉండదని.. మణిపుర్ ప్రజలకు తాము అండగా ఉంటామని అన్నారు రాహుల్.
మణిపుర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోలపై సుప్రీంకోర్టు సీరియస్గా రియాక్ట్ అయింది. ఈ పరిణామం తనను ఆందోళనకు గురిచేశాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఘటనపై కేంద్రం తగిన రీతిలో స్పందించకుంటే న్యాయస్థానమే చర్యలు చేపడుతుందంటూ.. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది.
మణిపూర్ ఘటనపై నెలల తరబడి మౌనంగా ఉన్న ప్రధాని మోదీ.. ఈ ఘటనపై మాత్రం స్పందించారు. జరిగిన దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మహిళల భద్రత విషయంలో రాజీపడబోమని.. నిందితులను విడిచిపెట్టబోమని భారత ప్రజలకు భరోసా ఇచ్చారు మోదీ.
మరోవైపు, మణిపుర్ అంశంతో పార్లమెంట్ అట్టుడికింది. ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో రాజ్యసభ వాయిదా పడింది.