Razole Seat Issue in YSRCP : ప్రతిపక్షపార్టీలో గెలిచి అధికార పార్టీకి పనిచేసిన వారు ఒకరు..ప్రతిపక్షపార్టీలో సీటు రాక అసంతృప్తితో అధికార పార్టీలో చేరిన వారు మరొకరు. సీటు సంపాదించుకున్న వారు మరొకరు. ఇదోదే వినడానికే కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నా.. జరుగుతున్న పరిణామాలు మాత్రం రసవత్తరంగా మారుతున్నాయి. సయ్యంటే సయ్యని కాలు దువ్వుకునే ప్రత్యర్ధులు కాస్తా.. ఒకే పార్టీలో చేరడంతో సీటు కోసం అంతర్గత వ్యూహాలు సాగుతున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఏపీలో ప్రతిసారీ సంచలనం అయ్యే రాజోలు రాజకీయం మరోసారి రోడ్డెక్కింది. అధికార పార్టీలో నేతల మధ్య సీటు పంచాయితీ.. రాజకీయ రచ్చకు దారితీసింది. గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాపాక వరప్రసాద్.. తర్వాత కాలంలో అధికార పార్టీకి అనుకూలంగా మారారు. దీనిపై నాలుగున్నర ఏళ్లుగా ఏదో ఒక దుమారం లేస్తూనే వస్తోందట. కొన్ని రోజుల వరకూ రాజోలు నియోజకవర్గం నుంచి అధికార పార్టీ బరిలో రాపాక వరప్రసాద్ ఉంటారని క్యాడర్ డిసైడ్ అయ్యిందట. ఆయన కూడా తనదైన శైలిలో పార్టీ శ్రేణులతో మమేకవుతూ.. కార్యకర్తలతో అనుచరవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని టాక్. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజోలులో వైసీపీ జెండా ఎగరవేసేందుకు.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇక్కడే ఊహించని విధంగా ట్విస్ట్ వచ్చిపడింది.
Also Read : ఈ సారైనా పవన్ గట్టెక్కేనా..? భీమవరం ప్రజలు కాపాడతారా..?
నియోజకవర్గంలో దాదాపుగా అభ్యర్థి రాపాకేనని ఎన్నికల శంఖారావానికి సిద్ధమయ్యారు. అధికార ప్రకటన రాకపోయినా.. కచ్చితంగా తనకే సీటు వస్తుందనే వరప్రసాద్ ధీమాలో ఉన్నారట. ఈసారి రాజోలులో ఫ్యాన్ గాలి వీయించేలా చేద్దామని శ్రేణులనూ సిద్ధం చేసుకున్నారని సమాచారం. మరోవైపు.. రాజోలు స్థానాన్ని టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కొన్ని సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ మాజీమంత్రిగా చేసిన గొల్లపల్లి సూర్యారావు.. ఈ విషయంపై ఆగ్రహం, అసంతృప్తి వెలిబుచ్చినా లాభం లేకుండా పోయింది. సూర్యారావు అసంతృప్తిని టీడీపీ అధిష్టానం అంతగా పట్టించుకోకపోవడంతో.. తన క్యాడర్ని కాపాడుకునేందుకు గొల్లపల్లి అధికార పార్టీ చెంతకు చేరారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.
కండువా కప్పుకున్న గొల్లపల్లి సూర్యారావుకి.. జగన్ బలమైన హామీ ఇచ్చారట. రాజోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యరావు పేరు దాదాపు ఖరారు అనే వార్తలు రావటంతో అసలు రచ్చ ఆరంభమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ను అమలాపురం ఎంపీగా ఖరారు చేయాలన్న అధిష్టానం నిర్ణయానికి.. రాపాక అయిష్టంగానే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రాజోలు అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు పేరు దాదాపు ఖరారుకావటంతో వైసీపీ క్యాడర్లో అసంతృప్తి మొదలైందనే ఊహగానాలున్నాయి. మొన్నటివరకూ ఉప్పూనిప్పులా ఉన్న నేతలు.. ఒక్కసారిగా కలిసి పనిచేయాలంటే సాధ్యం కాదని విషయం తెరపైకి వచ్చిందనే వార్తలు గుప్పుముంటున్నాయి. మొదట్నుంచి వైసీపీలో ఉన్న నేతలంతా ఒకటై.. నిరసన తెలపటం కూడా జరిగింది. గొల్లపల్లి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయటంతో వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. రాజోలు క్యాడర్ మొత్తం.. సూర్యారావుపై అసంతృప్తిని ఒకేసారి తెరపైకి తెచ్చారట. తమను కాదని.. ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి సీటు ఇస్తే.. ఎలా పనిచేయాలని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నట్లు సమాచారం.
Also Read : ఈ ఎన్నికల్లో మార్పు రాకపోతే.. రాష్ట్రంలో జరిగేది ఇదే : చంద్రబాబు
దీనికి తోడు YCP ఆవిర్భావ సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్తా.. రాజకీయ రచ్చకు ఆద్యం పోసినట్లు అయ్యిందని నియోజకవర్గ నేతలే చెప్పుకుంటున్నారు. రాజోలులో వైసీపీ రెండుసార్లు ఓటమి చెందిందని.. ప్రస్తుతం క్యాడర్ అంతా అసంతృప్తితో ఉందని.. ఇలా కొనసాగితే మరోసారీ ఓటమి చెందే అవకాశం ఉందంటూ రాపాక నోరుజారారట. రాజోలు అభ్యర్థి విషయంలో అధిష్టానం పునరాలోచన చేయాలని ఆయన స్టేజ్పైనే అన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశిస్తే.. తాను ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయగలనన్న రాపాక.. గొల్లపల్లి సూర్యారావుపై ఉన్న అసంతృప్తి నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని స్థానిక నేతలే చెప్పుకుంటున్నారు. రాపాకకు సీటు ఇవ్వని పక్షంలో మూకుమ్మడి రాజీనామా చేసేందుకు కూడా శ్రేణులు సిద్ధమైనట్లు సమాచారం. నియోజకవర్గంలో ZPTC, MPTCతో పాటు స్థానిక నేతలు కూడా రాపాక వైపే ఉన్నట్లు తెలుస్తోంది. రాజోలు విషయంలో రాపాక మాట్లాడిని విధానంతో.. అటు అధిష్టానం, ఇటు జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలూ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు సీటు ఇవ్వొద్దనే విషయాన్ని రాపాక చెప్పకనే చెప్పారని క్యాడర్ భావిస్తోందట. దీంతో ఇరువర్గాల నేతలూ కాస్త గందరగోళానికి గురైనట్లు టాక్. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాజోలు సీటు కైవసం చేసుకునేందుకు అధికార, విపక్షాలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. దానికి తగినట్లుగానే అనుచరులను పావులుగా మలుచుకుంటూ.. తమ రాజకీయ భవిష్యత్తుకు నేతలు బంగారుబాట వేసుకుంటున్నారనే వాదనలూ ఉన్నాయి. రాజోలు స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేలా జనసేన- టీడీపీ అడుగులు వేస్తుంటే.. అధికార పార్టీలో మాత్రం సీటు కోసం అంతర్గత కుమ్ములాటలేంటని జిల్లాలోని ఇతర నేతలు ప్రశ్నిస్తున్నారట. సమస్యకు వీలైనంత త్వరగా చెక్ పెట్టేలా అధిష్టానం రంగంలోకి దిగినట్లు సమాచారం.