Rahul Gandhi latest news(Congress party news today): తెల్లవారుజాము 4 గంటలు. దేశమంతా మత్తుగా నిద్రపోతున్న వేళ. రాహుల్గాంధీ మాత్రం ప్రజల కోసం మేల్కొన్నారు. జనం కష్టాలు తెలుసుకునేందుకు ఎర్లీ మార్నింగ్ రోడ్డెక్కారు. నేరుగా ఢిల్లీలోని ప్రముఖ మార్కెట్ అయిన ఆజాద్పూర్ మండీకి వెళ్లారు. ఆ టైమ్లో.. మార్కెట్లో రాహుల్ను చూసి అంతా అవాక్కయ్యారు.
మండీ మొత్తం కలియతిరుగుతూ.. కూరగాయలు, పండ్ల వ్యాపారులు, కార్మికులతో మాట్లాడారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ లో పండ్లు, కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో కనుక్కున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. రాహుల్ అంతటి వాడు.. అలా సామాన్యులతో కలిసిపోవడం చూసి.. అంతా ఫిదా అవుతున్నారు.
భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీలో అసలుసిసలైన నాయకుడు కనిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు అత్యంత చేరువవుతున్నారు. సామాన్యుల సమస్యలు తెలియాలంటే.. తానూ కామన్మేన్లో వారితో కలిసిపోవాలని గుర్తించారు. అందుకే, బస్సెక్కి ప్రయాణీకులతో మాట కలపడం.. ఫుడ్ డెలివరీ బాయ్ బండెక్కి అతని ప్రాబ్లమ్స్ తెలసుకోవడం.. లారీలో ప్రయాణించి డ్రైవర్లు, క్లీనర్ల కష్టసుఖాలు కనుక్కోవడం.. పొలంలో దిగి రైతులు, కూలీలతో కలిసి నాట్లు వేస్తూ అన్నదాత ఆవేదన వినడం.. దాబాలో టీ తాగడం, బైక్ మెకానిక్లా మారడం.. ఇలా రాహుల్ ఎత్తని అవతారం లేదు. అంతా జనం గోడు వినేందుకే. నేనున్నానని హామీ ఇచ్చేందుకే.
రాహుల్ 2.0 వర్షన్ చూసి బీజేపీ దడుసుకుంటోంది. ప్రజాధారణలో మోడీని మించిపోయేలా ఉన్నారని భయపడుతోంది. అందుకే రాహుల్గాంధీకి మరిన్ని చిక్కులు సృష్టించేలా.. ఆయన ఎంపీ పదవిపై వేటు వేసింది. ఢిల్లీలోని ఇంటిని ఖాళీ చేయించింది. అయితే, ఆ అడ్డంకులను.. రాజకీయంగా మరింత ఎదిగేందుకు సోపానాలుగా మార్చుకున్నారు రాహుల్. ఎంపీ పదవి పోవడంతో మరింత సమయం ప్రజల కోసమే కేటాయిస్తున్నారు. ఇల్లు కూడా లేకుండా చేయడంతో.. రోడ్ల మీద తిరుగుతూ, సామాన్యులను కలుస్తూ వారి గుండెల్లో నిలచిపోతున్నారు. ఆ విధంగా వేటు వేసి రాహుల్గాంధీని మరింత రాటుదేలేలా చేశారంటున్నారు.