Rahul Gandhi : భారత్ జోడో యాత్ర.. అక్టోబర్ 23న తెలంగాణలో అడుగుపెట్టనుంది. మక్తల్ నుంచి జుక్కల్ వరకు.. 375 కిలోమీటర్ల మీర పాదయాత్ర జరగనుంది. రాహుల్ వెంట ప్రతిరోజూ లక్ష మంది నడిచేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది టీ-కాంగ్. పాదయాత్రలో ప్రజలను పలకరిస్తూ.. వారి కష్టనష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు. ఎక్కడికక్కడ పార్టీ నేతలతో రాహుల్ గాంధీ మీటింగ్స్ ఉండనున్నాయి. పార్టీ బలోపేతం, అంతర్గత విభేదాలపై రాహుల్ దృష్టి సారించనున్నారు.
ఇక, తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డినే ఆశాకిరణం. అందుకే, సీనియర్లు ఎంతగా వ్యతిరేకించినా.. ఏరికోరి మరీ రేవంత్ కి పీసీసీ పగ్గాలు అప్పగించారు రాహుల్. రేవంత్ రెడ్డికి దన్నుగా నిలబడ్డారు. పీసీసీ చీఫ్ సైతం కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చేలా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పదునైన విమర్శలతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు.
రేవంత్ రాకతో.. కేడర్ లో జోష్ అమాంతం పెరిగింది. అయితే, ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉండటంతో.. భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీని నియమించి దిశానిర్దేశం చేస్తున్నారు.
అటు, మునుగోడులో రేవంత్ రెడ్డి ప్రచారం యమ జోరుగా సాగుతోంది. పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు సిట్టింగ్ సీటు కావడంతో గెలుపును సవాల్ గా తీసుకుని.. భారమంతా తనమీదే వేసుకున్నారు రేవంత్. సో కాల్డ్ సీనియర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటున్నా.. ఎక్కడా తగ్గేదేలే అంటూ రేవంతే పార్టీకి పెద్ద దిక్కులా నిలుస్తున్నారు. రేవంత్ ప్రసంగాలు ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నాయి. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను పదునైన భాషతో ప్రజల ముందుంచడంలో బాగా సక్సెస్ అవుతున్నారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి గట్టి గుణపాఠం చెప్పేలా.. గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇలాంటి కీలక మునుగోడు ఎలక్షన్ సమయంలోనే భారత్ జోడో యాత్రతో తెలంగాణలోకి రాహుల్ గాంధీ రావడం.. కాంగ్రెస్ విజయావకాశాలను అమాంతం పెంచేసే అవకాశం ఉందనేది విశ్లేషకుల అంచనా.