భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసి. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి మోదీ ఘన విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచే బరిలోకి దిగడ ఖాయం. గత రెండు ఎన్నికల్లో భారీ మెజార్టీతో మోదీ జయభేరి మోగించారు. ప్రత్యర్థుల నుంచి కనీస పోటీ కూడా ఎదురుకాలేదు. కానీ ఈసారి మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది.
వారణాసిలో ప్రధాని మోదీపై ప్రియాంక పోటీ చేస్తే తప్పక గెలుస్తారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. అక్కడ ప్రజలు ప్రియాంకా గాంధీని కోరుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ వారణాసి నుంచి బరిలో దిగితే తప్పక విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయబరేలీ, వారణాసి, అమేథీలో బీజేపీకి గట్టిపోటీ ఎదురవుతుందని విశ్లేషించారు.
ఎన్నికల్లో ప్రియాంక పోటీపై ఇటీవల భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ఆమె పార్లమెంట్లో అడుగుపెట్టాలని కోరుకున్నారు. ఆ విషయంలో కాంగ్రెస్ సరైన ప్రణాళిక రచిస్తుందని అనుకుంటున్నానని అన్నారు.
వారణాసిలో 1991 నుంచి 1999 వరకు వరుసగా నాలుగు సార్లు బీజేపీ అభ్యర్థులే గెలిచారు. 2004 మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్ కుమార్ మిశ్రా విజయం సాధించారు. ఇక్కడ నుంచి 2009లో బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో మోదీపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. ఆ ఎలక్షన్ లో మోదీ 56 శాతం ఓట్లు సాధించగా.. కేజ్రీవాల్ కు 20 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 7 శాతం ఓట్లే సాధించి మూడోస్థానంలో నిలిచారు.
2019 ఎన్నికల్లో మోదీ హవా మరింత పెరిగింది. ఆ ఎన్నికల్లో మోదీకి 63 శాతం ఓట్లు వచ్చాయి. 18 శాతం ఓట్లతో ఎస్పీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి 14 శాతం ఓట్లతో మూడోస్థానానికి పరిమితమయ్యారు. గత 32 ఏళ్లలో అంటే 1991 నుంచి ఇక్కడ కాంగ్రెస్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. 7సార్లు బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ప్రియాంక గాంధీ బరిలోకి దిగితే మాత్రం వారణాసి వార్ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.