Pramod Karan Sethi | మీరు మయూరి సినిమా చూశారా? అందులో మయూరి అనే భరతనాట్యం డాన్సర్ ప్రమాదానికి గురై ఒక కాలును కోల్పోతుంది. అయినా.. నిరాశకు గురికాకుండా, కృత్రిమ కాలు అమర్చుకుని, కష్టపడి సాధన చేసి, తన నాట్య ప్రదర్శనలతో అందరి మన్ననలు పొందుతుంది.
Pramod Karan Sethi | మీరు మయూరి సినిమా చూశారా? అందులో మయూరి అనే భరతనాట్యం డాన్సర్ ప్రమాదానికి గురై ఒక కాలును కోల్పోతుంది. అయినా.. నిరాశకు గురికాకుండా, కృత్రిమ కాలు అమర్చుకుని, కష్టపడి సాధన చేసి, తన నాట్య ప్రదర్శనలతో అందరి మన్ననలు పొందుతుంది. ఈ సినిమాలో మయూరి పాత్ర పోషించిన నటి.. సుధా చంద్రన్ కాగా.. నిజ జీవితంలో ఆ కృత్రిమ కాలును రూపొందించిన వైద్యుడే.. డా. ప్రమోద్ కరణ్ సేథీ. జనవరి 6న ఆయన వర్ధంతి.
ప్రమాదాల్లో కాళ్ళు కోల్పోయి ఇంటికే పరిమితమై, కుమిలిపోతున్న లక్షలాది మందిని సేథీ రూపొందించిన కృత్రిమ కాళ్ళు నడిపించాయి. జైపూర్ ఫుట్గా పేరొందిన ఈ ఆవిష్కరణ.. వికలాంగుల జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది.
సేథీ.. 1927, నవంబర్ 28న వారణాసిలో జన్మించారు. ఆర్థోపెడిక్ సర్జన్గా పేరు సంపాదించిన సేథీ.. ప్రమాదవశాత్తూ కాళ్లు పోగొట్టుకొని, తమ పని తాము చేసుకోలేని స్థితిలో ఉన్న వికలాంగులకు ఏదైనా చేయాలని తపించేవాడు. ఈ క్రమంలో 1969లో నిరక్ష్యరాస్యుడైన రామచంద్ర శర్మ పరిచయమయ్యాడు. శర్మ రబ్బరు, చెక్క అల్యూమినియం వస్తువులను మిషన్ మీద పనిచేసే వాడు. సేథీ మేథస్సు, శర్మ తోడ్పాటుతో వీరిద్దరూ కలసి ఓ చిన్న వర్క్షాప్లో తొలిసారి జైపూర్ పాదాన్ని తయారుచేశారు.
1975కి ముందు కృత్రిమ కాలు అమర్చు కోవాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత చౌకగా, స్థానికంగా దొరికే వస్తువులతో పెద్ద సంఖ్యలో జైపూర్ పాదాల తయారీ చేసిన సేథీ, ఆయన బృందం.. అత్యంత చౌకగా సామాన్యులు సైతం కృత్రిమ కాలును అమర్చుకునే ఏర్పాటు చేశారు. అంతేకాదు.. కోల్డ్ వార్ సందర్భంగా రష్యా అమర్చిన మందుపాతరలు పేలి.. కాళ్లు తెగిపోయిన వేలమంది సైనికులకు ఆ సమయంలో అంతర్జాతీయ రెడ్క్రాస్ సంస్థ వారందరికీ సేథీ రూపొందించిన కృత్రిమపాదాలు అందించటంతో.. సేథీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది.
ప్రమోద్ కరణ్ సేథీ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురష్కారంతో గౌరవించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందికి కృత్రిమ కాలు అమర్చిన సేథీ పేరు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకీ ఎక్కింది. ఆసియాలోనే అత్యుత్తమమైన రామన్ మెగసెసె అవార్డు కూడా సేథీని వరించింది. ఇవిగాక పలు జాతీయ, అందర్జాతీయ అవార్డులెన్నో ఆయనను వరించాయి.
కాళ్ళు కోల్పోయిన ఎందరో అభాగ్యులను తిరిగి నడిపించి, వారి జీవితాల్లో వెలుగును నింపిన సేథీ.. 2008, జనవరి 6న జైపూర్లో కన్నుమూశారు.