Ponguleti | తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు.
Ponguleti | తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఖమ్మం జిల్లా సంజీవరెడ్డి భవన్లో విూడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని.. కేసీఆర్కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు.
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేదన్నారు. “డబ్బు అహంకారంతో.. అధికార మదంతో విర్రవీగే కేసీఆర్ మీరా ప్రజా స్వామ్యం గురించి మాట్లాడేది.. కేసీఆర్కు ఛాలెంజ్ చేస్తున్న.. తడిబట్టలతో ఏ గుడికి వస్తారో రండి.. నాకు ఏ పైరవీలు చేశారు… ఏ కాంట్రాక్టులు ఇచ్చారో చెప్పండి.. నేను కూడా తడి బట్టలతో అదే గుడికి వస్తాను” అని పొంగులేటి సవాల్ చేశారు.
పేరు ప్రస్తావించకుండా తనని టార్గెట్ చేసి మాట్లాడరని చెబుతూ.. “సీఎం నిన్నటి సభలో కేసీఆర్ పక్కన కూర్చుంది ఎవరు? వారు ఏ పార్టీ ఎమ్మెల్యేలు, వారంతా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారు. కేసీఆర్ డబ్బుల కట్టలతో వారందరీనీ కొనేశారు. అలాంటి కేసీఆర్.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది,” అని విమర్శించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే దళిత బంధు కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఈటల రాజేందర్ను ఓడించేందుకు దళిత బంధు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయిందని.. ప్రజలు బీఆర్ఎస్ చెంప ఛెళ్లుమనిపించారని అన్నారు. నిన్నటి సభలో కేసీఆర్ తన పేరు చెప్పి ఉంటే.. తన సత్తా ఏమిటో తెలిసేదని అన్నారు. దమ్ముంటే పాలేరు నుంచి పోటీ చేయాలని సవాలు విసిరారు.
ఓట్లు వేయకపోతే రెస్టు తీసుకుంటామని సీఎం అంటున్నారని.. ఇప్పడు మటుకు చేసేది ఏముంది? కేవలం సోల్లు కబుర్లు చెబుతూ జనాన్ని మోసం చేయటమే కదా అని సెటైర్లు వేశారు. తాను అక్రమంగా సంపాదించిన డబ్బు నోట్ల కట్టలతో వస్తున్నానని సీఎం కేసీఆర్ అంటున్నారని, తాను కష్టపడి సంపాదించిన డబ్బు అని అధికారికంగా చెప్పగలనని పొంగులేటి అన్నారు. మరి ముఖ్యమంత్రి ఏ వ్యాపారం చేశారని, లక్షల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం తెలంగాణను దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు.
ఇంత నీచమైన రాజకీయ నాయకుడిని ఎక్కడ చూడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని.. అయితే మేడిగడ్డతో అసలు రంగు బయటపడిందని అన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని పొంగులేటి జోస్యం చెప్పారు.
స్థాయి మరిచి కేసీఆర్ నాపై విమర్శలు చేశారు : తుమ్మల
పాలేరు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితం గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు సరికాదన్నారు. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి తనపై వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ కబంధహస్తాల పాలనలో తెలంగాణ ప్రజలు చీకటి జీవితాన్ని గడుపుతున్నారని తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు సభలో కేసీఆర్ పక్కన కూర్చున్న వారిద్దరూ వేరే పార్టీ నుంచి వచ్చినవారేనని సెటైర్లు వేశారు. కేసీఆర్ అరాచక పాలన పోవాలనే ఉద్దేశంతోనే సోనియాగాంధీ తనకు సీటు ఇచ్చారని తుమ్మల నాగశ్వరరావు వ్యాఖ్యానించారు.