Delhi: సడెన్గా పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అదికూడా జగన్ కేంద్రపెద్దలను కలిసొచ్చాక వెళ్లారు. ఇంతకీ పవనే వెళ్లారా? బీజేపీనే పిలిపించారా? ఢిల్లీలో అసలేం జరుగుతోంది? పవన్ లాంగ్ షెడ్యూల్ వెనుక మతలబేంటి?
పవన్ కల్యాణ్ అంటే ఎవరు? ఆయన రేంజ్ ఏంటి? ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. వచ్చిరాగానే తనకోసం వెయిట్ చేస్తున్న ఏపీ బీజేపీ నేతలందరినీ పక్కనపెట్టేసి.. పవన్తోనే ఫస్ట్ భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం పావుగంటే ఉన్నా.. గంటలకు పైగా జనసేనానితో మంతనాలు జరిపారు మోదీ. పవన్ వెళ్లిపోయాకే కమలనాథులతో మోదీ మాట్లాడారు. అదీ ఆయన రేంజ్. అలాంటిది.. ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ రెండు రోజులుగా బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడుతున్నారు. మోదీ, అమిత్షా, నడ్డాల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. గతంలో పవన్ వచ్చినప్పుడల్లా రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికే బీజేపీ నేతలు.. ఇప్పుడెందుకు ఆయన్ను వెయిటింగ్లో పెట్టారు? ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు కారణమా? జనసేనానితో స్నేహమా? దూరమా?
పవన్పై బీజేపీ మైండ్ గేమ్?
పవన్ కల్యాణ్ మొదట రాజస్థాన్ వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా హస్తిన చేరారు. మోదీ, నడ్డాలను కలుస్తారని అన్నారు. కానీ.. వాళ్లిద్దరూ ఇంకా టచ్ లోకి రాలేదు. చేసేది లేక, సోమవారం బీజేపీ ఏపీ ఇంఛార్జ్ మురళీధరన్తో భేటీ అయ్యారు. ఆ తర్వతైనా అసలు పెద్దల నుంచి మెసేజ్ వస్తుందని అనుకున్నారు. కానీ, రాలేదు. మంగళవారం మరోసారి అదే మురళీధరన్తో మళ్లీ చర్చలు జరిపారు. ఓ ఇంచార్జ్ స్థాయి నేతతో రెండు రోజుల పాటు చర్చలు జరపాల్సిన పరిస్థితిని పవన్కు కల్పించారా? ఇదంతా బీజేపీ పెద్దలు ఆడుతున్న మైండ్ గేమా? పవన్ వస్తే కలిసేందుకు మోదీకి, నడ్డాకి టైమ్ లేదా? ఏదో తేడాగా ఉందని అంటున్నారు.
కమలనాథులు హర్ట్ అయ్యారా?
బీజేపీ పెద్దలు జనసేనాని విషయంలో హర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవ్కు సపోర్ట్ చేయలేదని, ఆయన ఓడిపోవడానికి పవనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నారు కమలనాథులు. ఇలా అయితే కష్టమని.. ఇష్టం ఉన్నట్టు రాజకీయం చేస్తానంటే కుదరదని.. పవన్కు అర్థమయ్యేలా చెప్పాలని బీజేపీ భావిస్తోందా? పవన్కు తన స్థాయి ఏంటో తెలిసొచ్చేలా హస్తినలో వెయిట్ చేయిస్తోందా? పవన్కు బీజేపీ పెద్దలు వార్నింగ్ ఇస్తారా? బుజ్జగిస్తారా?
బీజేపీతో డీల్ కుదిరేనా?
జనసేనాని పక్కా క్లారిటీతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోకూడదని ఫిక్స్ అయ్యారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు. సరైన సీట్లు ఇస్తే టీడీపీతో కలిసేందుకు సై అన్నారు. కానీ, సైకిల్ పార్టీ ఏమాత్రం తొందరపడటం లేదు. జనసేనకు అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేదు. పవన్.. టీడీపీతో కలవాలంటే బీజేపీ విషయంలో ఏదో ఒకటి తేల్చేయాల్సిందే. కమలంతో పొత్తు.. టీడీపీతో స్నేహం ఒకేసారి కుదిరే అవకాశం లేదు. రాష్ట్ర బీజేపీ.. టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటోంది. అందుకే, ఢిల్లీ స్థాయిలో నచ్చజెప్పేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారా? అందుకే ఢిల్లీ వెళ్లారా?
పవన్కు బీజేపీనే దిక్కా?
ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఇటీవల పవన్ వాయిస్ కాస్త మారింది. అవసరమైతే ఒంటరిగానైనా పోటీ చేస్తామంటున్నారు. తమకు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వకపోతే ఒప్పుకోమంటున్నారు. పొత్తుకు టీడీపీ నిరాశక్తితో ఉండటంతో జనసేనాని వైఖరిలో మార్పు వచ్చిందంటున్నారు. టీడీపీతో కుదరకపోవచ్చని.. బీజేపీనే దిక్కు అని అనుకుంటున్నారా? గతంలో ఇస్తానన్న రోడ్ మ్యాప్ తెచ్చుకునేందుకే హస్తిన వెళ్లారా? లేదంటే, టీడీపీ విషయంలో బీజేపీ పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారా? కర్నాటక ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ ప్రచారం చేస్తారా? ఇలా అనేక రకాలుగా చర్చ నడుస్తోంది. ఈ అనుమానాలన్నిటికీ పవన్ లేటెస్ట్ ఢిల్లీ టూర్తో క్లారిటీ వచ్చేస్తుందా? కన్ఫ్యూజన్ మరింత పెరుగుతుందా?