అనుకున్నట్టే అయింది. లోక్సభలో విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ఓటింగ్ సందర్భంగా ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ రెండు గంటలకు పైగా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ప్రతిపక్షాలపై ఫోర్లు, సిక్సులతో ఓ ఆట ఆడుకున్నారు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం తవ్విపోశారు. మణిపూర్పైనా తనదైన శైలిలో విమర్శలు, వివరణ ఇచ్చారు మోదీ.
మణిపూర్లో జరిగింది దిగ్భ్రాంతికరం, అమానవీయమన్న మోదీ.. మణిపూర్ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. కొందురు ఎందుకు భారతమాత చావు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదని రాహుల్కు కౌంటర్ వేశారు. వీళ్లు దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
1966లో మిజోరం ప్రజలపై ఎయిర్ఫోర్స్తో దాడులు చేయించారని.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని నెహ్రు అడ్డుకున్నారని చెప్పారు. మణిపూర్లో సాయంత్రం నాలుగు తర్వాత గుడులు, మసీదులు మూసేసి.. సైన్యం పహారా కాసేదని.. ఆ పాపం కాంగ్రెస్ది కాదా? అని నిలదీశారు. తాను ఇప్పటికి 50సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించానని మోదీ అన్నారు.
మణిపూర్లో విధ్వంసాలన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేనని తెలిపారు. మణిపూర్ అభివృద్ధికి ఎన్డీఏ తీవ్రంగా కృషి చేస్తోందని.. మణిపూర్, నాగాలాండ్, మిజోరంలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్ చూడలేకపోతోందని మండిపడ్డారు మోదీ.
INDIA ను I.N.D.I.A గా ముక్కలు చేశారని.. యూపీఏ ముగిసిన అధ్యాయమని.. మూలనపడిన ఆ బండికి రంగు వేసి ఇండియాగా మార్చేశారని ఎద్దేవా చేశారు. తమ NDAకు రెండు I లు చేర్చి INDIA పేరుతో 16 పార్టీలు ఏకమయ్యాయని.. అందులో అందరూ ప్రధాని కావాలని అనుకుంటారని ఎద్దేవా చేశారు.
తమిళనాడు, బెంగాల్, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో దశాబ్దాలుగా కాంగ్రెస్ ఓడిపోతూనే ఉందని.. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని.. కాంగ్రెస్ పని ఖతం అంటూ పంచ్లు వేశారు ప్రధాని మోదీ.
కాంగ్రెస్ను ప్రశ్నించినందుకు అంబేడ్కర్ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది అన్నారు. ఎమర్జెన్సీని ప్రశ్నించినందుకు జగ్జీవన్రామ్ను ఓడించారని.. జయప్రకాశ్ నారాయణ, మొరార్జీ దేశాయ్లాంటి ఎంతోమంది నాయకులను కాంగ్రెస్ ఓడించే ప్రయత్నం చేసిందని..చరిత్ర గుర్తు చేశారు.
ఆస్పత్రులు, రహదారులు, అవార్డులకు వారి పేర్లే ఉంటాయని.. కానీ ఆస్పత్లో చికిత్స ఉండదని.. కొత్త రోడ్లు వేయరని.. పరోక్షంగా గాంధీ కుటుంబాన్ని కార్నర్ చేస్తూ మాట్లాడారు ప్రధాని. మూడు రంగుల జాతీయ జెండాను.. కాంగ్రెస్ జెండాగా మార్చుకుందని తప్పుబట్టారు.