Pakistan Sweet: ఒక స్వీట్ కోసం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిన ముచ్చట మీరెన్నడైనా విన్నారా? నిజమేనండీ బాబూ.. 2019 జనవరిలో పాకిస్థాన్లో ఈ ఎన్నిక జరిగింది. ‘పాక్ నేషనల్ స్వీట్’ ఏది ఉండాలనే అంశంపై ఆ దేశ ప్రభుత్వం గతంలో ఈ పోటీ పెట్టింది.
ఈ ఎన్నికల పోటీలో గులాబ్ జామూన్, బర్ఫీ, జిలేబీ పోటీ చేయగా వీటిలో గులాబ్ జామూన్ విజయం సాధించింది. ట్విట్టర్ ద్వారా పెద్ద సంఖ్యలో జనం ఈ ఓటింగ్లో పాల్గొన్నారు.
ఈ ఎన్నికలో గులాబ్ జామూన్కు 47% మంది ఓటువేయటంతో పాకిస్థాన్ దేశపు జాతీయ స్వీటుగా గులాబ్ జామూన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పోటీలో 34% ఓట్లతో జిలేబీ ద్వితీయ స్థానంలో, బర్ఫీ 19% ఓట్లతో మూడోస్థానంలో నిలిచాయి.
అంతేకాదండీ.. ఈ ఓటింగ్ నిజాయితీగా జరగలేదని, ఈ ఎన్నకలో రిగ్గింగ్ కూడా జరిగిందని కొందరు పౌరులు ఆరోపించారు. ట్విట్టర్ మినహా మరే సోషల్ మీడియా ద్వారా ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేకపోవటంపై వారు మండిపడ్డారు. 5 లక్షల కన్నా తక్కువ ఫాలోవర్స్ ఉన్న అధికారిక ట్విట్టర్ నుంచే ఈ పోల్ నిర్వహించటమేంటని వారు నిలదీశారు.
అసలు.. గులాబ్ జామూన్ ముందు నుంచీ పాకిస్థాన్లో లేదని మరికొందరు ఓడిపోయిన స్వీట్ల తరపున వకాల్తా పుచ్చుకున్నారు. రీపోలింగ్ జరపాలనీ వారు డిమాండ్ చేశారు. గులాబ్ జామూన్ మొఘలు చక్రవర్తి షాజహాన్ వంటగాళ్లు కనిపెట్టారని కొందరు, కాదు.. ఇది టర్కీ ఆక్రమణదారుల ద్వారా పాక్ చేరిందని వారు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా.. ఓ స్వీట్ కోసం ప్రభుత్వమే ఆన్లైన్ ఎన్నికలు నిర్వహించటం.. నెటిజన్స్ ఓటింగ్తో అధికారికంగా ఓ స్వీట్ ను ప్రకటించటం చాలా ప్రత్యేకమని మరికొందరు సంతోష పడ్డారు.