AP Elections 2024: ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఓటర్లు ఆదరించే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఆ తూర్పు జిల్లాల ఓటర్లు ఎటు మొగ్గితే ఆ పార్టీనే పాలనా పగ్గాలు చేపడుతుందని ప్రతిసారి నిరూపితమవుతూనే ఉంది. 34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ సొంతం. అందుకే అన్ని పార్టీలు అక్కడ పాగా వేయడానికి సర్వశక్తులు ఒడ్డాయి.. మరి ఈ సారి ఉత్తరాంధ్ర ఓటర్లు ఎవరికి పట్టకడతారనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో ఓ చివరన ఉన్న మూడు జిల్లాలు కలిసిన ప్రాంతం ఉత్తరాంధ్ర. రాష్ట్రానికి ముఖద్వారం.. అలాంటి గేట్ వే ఆఫ్ ఏపీ సువిశాల సముద్ర తీరం.. పూర్తిగా వ్యవసాయ ఆధారం.. అక్కడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. తరతమ బేధం లేకుండా ఎక్కడి వారినైనా ఆదరించే అక్కడ ఓటర్లు ఎందరో బడా నేతలను ఆదరించారు. ప్రస్తుతం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. గత కొన్ని దశాబ్దాలుగా అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ఉత్తర కోస్తాలో గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలి గట్టిగా వీచి అధికారం వైసీపీ వశమైంది.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 సెగ్మెంట్లలో 24 చోట్ల గెలిచిన తెలుగుదేశం పార్టీ పాలనా పగ్గాలు చేపట్టింది. 2019 ఎన్నికల నాటికి ఉత్తరాంధ్రలో ఫ్యాను గాలి గట్టిగా వీడి, వైసీపీ 28 సెగ్మెంట్లో గెలిచి పవర్లోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు ఒక్కరే టెక్కలి నుంచి గెలిచారు. విజయనగరం జిల్లాలో టీడీపీ ఖాతానే తెరవలేకపోయింది. విశాఖ జిల్లాలో నాలుగు సీట్లు దక్కించుకోగలిగింది.
Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై
ఉత్తరాంధ్ర అంటే ముందుగా గుర్తొచ్చేది చీపురుపల్లి నియోజకవర్గం. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఈ సారి కూడా చీపురుపల్లి నుంచి ఆయన పోటీ చేస్తుంటే, విశాఖ ఎంపీగా ఆయన సతీమణి బొత్స ఝాన్సీ బరిలో ఉన్నారు. చీపురుపల్లి బరిలో బొత్సాని మాజీ మంత్రి కళా వెంకట్రావు ఢీ కొంటున్నారు. బొత్స ఝాన్సీపై టీడీపీ నుంచి బాలకృష్ణ అల్లుడు భరత్ పోటీలో ఉన్నారు.
శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు మూడో సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టెక్కలిలో మాత్రమే టీడీపీ గెలిచింది. అయినా ఎంపీగా రామ్మోహన్నాయుడు విజయం సాధించారు. టెక్కలిలో ఆయన బాబాయ్, మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలుపొందారు. ప్రస్తుతం టెక్కలిలో వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ నుంచి తిలక్లు ఆ బాబాయ్ అబ్బాయ్లతో తలపడుతున్నారు.
Also Read: కడపలో జగన్ కు షర్మిల చెక్ పెడుతుందా.?
విశాఖ లోక్సభ సెగ్మెంట్లో కీలకమైన భీమిలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. భీమిలీలో గెలిచే పార్టీ అభ్యర్ధి మెజార్టీ విశాఖ ఎంపీ గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంటుంది. దాంతో భీమిలీ స్థానం అందరి దృష్టి ఆకర్షిస్తుంది .. మరోవైపు అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి మాజీ రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయనపై వైసీపీ నుంచి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పోటీలో ఉన్నారు. ప్రశాంతంగా ఉండే అనకాపల్లిలో ఈ సారి ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఘర్షణలు, దాడులతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది.
విజయనగరం మాజీ ఎంపీ అశోక్గజపతిరాజు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుని ఈ సారి పోటీకి దూరమయ్యారు. ఆయన కుమార్తె ఆదితిగజపతి విజయనగరం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీలో ఉండటంతో ఆ సెగ్మెంట్ స్పెషల్ అట్రాక్షన్గా మారింది. మొత్తమ్మీద ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది అన్ని పార్టీల్లో ఉత్కంఠ రేపుతుంది.