Nitish Kumar : బీఆర్ఎస్ ఏర్పాటుకు ముందు కేసీఆర్ దేశంలో చాలా రాష్ట్రాలు చుట్టి వచ్చారు. కాంగ్రెస్ , బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలను కలిసొచ్చారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిశారు. మాజీ ప్రధాని దేవగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ప్రకటన రోజు కుమారస్వామి వచ్చి కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కుమారస్వామి కనిపించలేదు. ఏదో రాజకీయ కార్యక్రమం ఉండటం వల్ల కుమారస్వామి రాలేదని వార్తలు వచ్చాయి. అలాగే పశ్చిమబెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ సభకు రాలేదు.
ముఖ్యంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాకపోవడంపై పెద్ద చర్చ జరిగింది. నితీశ్ ఎందుకు రాలేదనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ప్రధాని రేసులో ఉన్న నితీశ్ కు కేసీఆర్ తో కలవడం ఇష్టం లేదేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చర్చ జరుగుతుండగానే బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన సభ గురించి తనకు సమాచారం లేదన్నారు. తనను కేసీఆర్ ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆహ్వానం అందినా సావధాన్ యాత్ర, రాష్ట్ర బడ్జెట్కు సంబంధించిన సమావేశాలు ఉన్నందున ఆ సభకు హాజరుకాలేక పోయేవాణ్ని తెలిపారు.
బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా విపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావాలని కోరుకుంటున్నానని నితీశ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వప్రయోజనాలకోసం ఏమీ కోరుకోవడం లేదన్నారు. జాతి ప్రయోజనాల కోసం విపక్ష నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ముందుకు సాగితే చూడాలని ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో జరిగింది బీఆర్ఎస్కు సంబంధించిన సభ మాత్రమేనని తెలిపారు. కొత్తకూటమి ఏర్పాటు కోసం నిర్వహించిన సభగా చూడకూడదని స్పష్టం చేశారు. ఆహ్వానం అందుకున్న వారు ఆ సమావేశానికి హాజరయ్యారని నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
తనకు ఆహ్వానం అందలేదని నితీశ్ స్పష్టం చేయడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. కేసీఆర్ ఎందుకు పిలవలేదు? జేడీయూతో జతకట్టే ఆలోచన కేసీఆర్ కు లేదా? తానే ప్రధాని పదవికి పోటీ పడతారా? నితీశ్ తో తనకు ఇబ్బందులుంటాయని కేసీఆర్ భావిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మమతను కూడా కేసీఆర్ ఆహ్వానించలేదనే అనిపిస్తోంది. అందుకే ఆమె కూడా రాలేదు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ తో ఇప్పటికే జాతీయస్థాయిలో రాజకీయాలు నడుపుతున్న నేతలు కలుస్తారా? కేసీఆర్ నాయకత్వాన్ని నితీశ్, మమత లాంటి నేతలు ఒప్పుకుంటారా? అవకాశం ఉంటే ప్రధాని పీఠం ఎక్కాలని చూస్తున్న నేతలు కేసీఆర్ మద్దతు తీసుకుంటారు కానీ.. నాయకత్వాన్ని ఒప్పుకోరనేది వాస్తవం. ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్న నేషనల్ పొలిటికల్ హైవేపై కారును కేసీఆర్ ఎలా నడుపుతారో చూడాలి.