ఉమ్మడి అనంతపురం జిల్లాల టీడీపీకి కంచుకోట. టీడీపీ ఎంత కష్టం కాలం ఎదుర్కుంటున్నా అన్నో ఇన్నో స్థానాలు గెలుచుకునేది ఇక్కడే.. 2004 ఎన్నికల్లో వైఎస్ హయాంలో కూడా 6 స్థానాలు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినప్పుడు కూడా 2 స్థానాలు గెలుచుకుంది.ఇక తాజాగా 2024 ఎన్నికల్లో కూడా 14 కు 14 అసెంబ్లీ స్థానాలు 2 ఎంపీ స్థానాలు గెలుచుకొని రికార్డ్ సృష్టించి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీకి అంతలా పట్టు ఉండడానికి కారణం జిల్లాలో ముందు నుంచి ఉన్న క్యాడర్, వారిని సమర్ధంగా నడిపిస్తున్న నాయకులే.
పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకొనే నాయకులు, నాయకుల వెన్నంట నడిచే కార్యకర్తలే పార్టీకి బలంగా మారారు. 2024 ఎన్నికల్లో కూటమి రికార్డు మెజార్టీతో అధికారంలోకి రావడంతో కార్యకర్తలు, నాయకులు సంబరపడిపోయారు. తమ నాయకుడికి ఏదో ఒక పదవి వస్తుంది, తమని బాగా చూసుకుంటాడు అని కేడర్ నమ్మకం పెట్టుకుంది. అయితే కూటమి సర్కారు ఏర్పడి అయిదు నెలలు అవుతున్నా ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులకు ఎలాంటి ప్రాధాన్యతా లభించలేదు. దాంతో సదరు నేతలు, వారి కేడర్కి గెలిచామన్న ఆనందం లేకుండా పోతుందంట.
జిల్లా నాయకులకు ఇంతవరకూ కనీసం ఒక్క నామినేటెడ్ పదవి కూడా రాకపోవడంతో.. అయ్యో అని నిట్టురుస్తున్నారు కార్యకర్తలు. ఇక నాయకులు సైతం బయటికి నవ్వుతున్నా లోలోపల మాత్రం కుమిలిపోతున్నారట. 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందని భావించినా అధిష్టానం నిర్ణయంతో పోటీ చేయలేకపోయిన నాయకులు గెలిచాక ఏదో ఒక పదవి ఆశించారు. అని వారికి ఇంతవరకు ఎటువంటి పదవి రాకపోవడంతో వారి మొహాల్లో ఆనందం మాయమైపోతుంది.
Also Read: పాలిటిక్స్లో బ్యాడ్ టైం.. ముద్రగడకు బ్యాండ్ బాజానే..
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. వైసీపీ హయంలో ఐదేళ్ల పాటు అనేక కష్టనష్టాలు ఎదుర్కొని తన వ్యాపారాలను నష్టపరుచుకుని అనేక కేసులు పెట్టించుకున్న నాయకుడాయన ఎన్నికల ముందు వరకు కూడా టికెట్ తనదే అని ధీమాలో ప్రచారం చేసుకున్నారు. అయితే అర్బన్ టికెట్ ప్రభాకర్చౌదరికి కాకుండా రాప్తాడు మాజీ ఎంపీపీ, వ్యాపారవేత్త అయిన దగ్గుపాటి ప్రసాద్కు కేటాయించారు. అప్పుడు ప్రభాకరచౌదరి అనుచరులు భారీగా ఆందోళన చేయడంతో టీడిపి అధిష్టానం దూతలను పంపి అధికారం లోకి వస్తే రాష్ట్రస్థాయిలో ఏదో ఒక పెద్ద పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో .. ప్రభాకర్ చౌదరి ఆందోళన విరమించి పార్టీ బలోపేతానికి పనిచేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎటువంటి పదవి రాకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి తో కనిపిస్తున్నారు.
సింగనమల నియోజకవర్గం టీడీపీలో మంటిముడుగు కేశవ రెడ్డి, టీడిపి రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసనాయుడు బలమైన నాయకులుగా ఉన్నారు. సింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో వారికి ఎటువంటి అవకాశాలు దక్కడం లేదు. ఎప్పటినుంచో పార్టీ కోసం పని చేస్తున్నా వారికి ఇంత వరకు పదవుల్లో ప్రాధాన్యత లభించలేదు. దాంతో కనీసం ఈ సారైనా ఏదో ఒక మంచి పదవి వస్తుందని ఆశిస్తున్నారు. ఆలం నరసానాయుడు అయితే ఎమ్మెల్సీ పదవి కోసం తన ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగిస్తున్నారు.
ఇక ఇదే పరిస్థితి ఉన్న మరో నియోజకవర్గ గుంతకల్లు. గుంతకల్లులో మొదటి నుంచి టిడిపికి అండగా బీసీలు ఉన్నారు. అదే బిసి సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ టికెట్ ఆశించి భంగపడ్డారు. గుంతకల్ కోసం పక్క జిల్లా నుంచి వైసీపీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. దీంతో జితేంద్రగౌడ్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆయనకు కూడ ఏదో ఒక పదవి ఇస్తామని ఆశ చూపించి టీడిపి కోసం పని చేసేలా ఒప్పించారు. కానీ ఆయనకు ఎటువంటి పదవి ఇచ్చేలా కనిపించడం లేదు.
ఇదే కోవలోకి వస్తారు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి. ఎన్నికల ముందు వరకు కళ్యాణ్ దుర్గం టిడిపి టికెట్ ఆశించారు. కానీ టికెట్ అమిలినేని సురేంద్ర బాబు కు కేటాయించారు. అప్పట్లో ఆయన ఆలిగి టీడిపి అభ్యర్థికి సపోర్ట్ చేయకపోవడంతో టీడిపి అధిష్టానం ఆయనను బుజ్జగించి కుమారుడు మారుతి చౌదరి కి ఏదో ఒక పదవి ఇస్తామని సర్ది చెప్పిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారయింది. ఇలా ఒక్క అనంతపురంలోనే డజను మందికి పైగా టిడిపి నాయకులు పదవుల కోసం గంపెడాశలు పెట్టుకొని ఉన్నారు. మరి వారి ఆశలు ఎప్పటికి నెరవేరతాయో? వారి అనుచరగణంలో అసలు ఉత్సహం నిండుతుందో? లేదో చూడాలి.