AAP : 2014,2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదా? అనే ప్రశ్న తలెత్తింది. ఈ సమయంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకొచ్చింది. 10 ఏళ్ల క్రితం అన్నాహజారే ప్రారంభించిన జన్లోక్పాల్ ఉద్యమం ద్వారా పాపులర్ అయిన కేజ్రీవాల్ ఆప్ను స్థాపించారు. ఢిల్లీలో పుట్టిన ఈ పార్టీ.. అంచెలంచెలుగా ఎదుగుతూ పలు రాష్ట్రాలకు విస్తరించింది. తొలుత ఢిల్లీలో కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు చరమగీతం పాడింది. .చాలా రాష్ట్రాలపై పట్టు సాధించిన బీజేపీకి కొరకురాని కొయ్యగా ఆప్ తయారైంది. అదే ఊపులో రెండోసారి ఢిల్లీని ఊడ్చేసింది. ఆ తర్వాత పంజాబ్ ఎన్నికల్లో ఇటు బీజేపీ కూటమికి, అటు కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. అఖండ విజయంతో పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ 15 ఏళ్ల పాలనకు చెక్ పెట్టింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయ దుందుభి మోగించింది.
పంజాబ్ ఎన్నికల స్ఫూర్తితో గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో ఆప్ బరిలోకి దిగింది. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఆప్ అనే పదేపదే కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్ లో బీజేపీకి షాక్ ఇస్తామన్నారు. అయితే తాజా ఎన్నికల ఫలితాలు ఆప్ ఆశలపై నీళ్లు చల్లాయి. గుజరాత్ లో కేజ్రీవాల్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. కేవలం ఐదు సీట్లు మాత్రమే దక్కించుకుంది. బీజేపీ కంచుకోటను కొట్టాలన్న కేజ్రీవాల్ ఆశలు ఆవిరయ్యాయి. మోదీ ఇలాకాలో ఆప్ ఆకట్టుకోలేకపోయింది. బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా గుజరాత్ లో అన్ని స్థానాల్లో బరిలోకి దిగింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా పార్టీ కీలక నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. పంజాబ్ మాదిరిగానే గుజరాత్లోనూ ఉచిత విద్య, ఉచిత విద్యుత్ అందిస్తామని వరాలు గుప్పించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గుజరాత్లో పర్యటించి ఉచిత విద్యుత్కు సంబంధించి ప్రజల కరెంట్ బిల్లులను తీసుకొచ్చి మరీ ప్రచారం చేశారు. కానీ ఈ ప్రచారాలను గుజరాత్ ఓటర్లు నమ్మలేదు. కేవలం ఓట్లను చీల్చడంలో తప్ప గుజరాత్లో ఆప్ ప్రభావం అంతగా కనిపించలేదు. కానీ 12 శాతం ఓట్లు ఆప్ కు రావడం ఒక్కటే పాజిటివ్ పాయింట్.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ బరిలోకి దిగిన ఆప్ ఎక్కువగా గుజరాత్ పైనే ఫోకస్ చేసింది. అందుకే హిమాచల్ప్రదేశ్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి భంగపాటు తప్పలేదు. ఈ ఎన్నికల సమయంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ పై పూర్తిగా దృష్టిసారించలేకపోయింది. ప్రచారం చేసింది కూడా అంతంతమాత్రమే. ఫలితంగా ఈ రాష్ట్రంలో ఆప్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.
అవినీతిపై వ్యతిరేక ఉద్యమం పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని సాధారణ రాజకీయ పార్టీగా మార్చేశారనే విమర్శలున్నాయి. ఆ పార్టీలోనూ వ్యక్తి పూజ ప్రారంభమైంది. ప్రకటనల్లోనూ కేజ్రీవాలే ప్రధానంగా కనిపించేవారు. ప్రచారం కోసం భారీగా ఖర్చు చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. లోక్పాల్ బిల్లుపై పుట్టుకొచ్చిన ఆ పార్టీ.. ఢిల్లీలో ఇంతవరకు ఈ బిల్లును తీసుకురాలేదు. ఇక అవినీతి ఆరోపణలు ఆప్ కు చెడ్డపేరు తీసుకొచ్చాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం ఆప్ పై తీవ్ర ప్రభావమే చూపించింది. మంత్రులు సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియాపై కేసులు ఆప్ క్లీన్ ఇమేజ్ పై మచ్చతెచ్చాయి. సత్యేందర్ జైన్ జైలులో సకల సౌకర్యాలు పొందతూ వివాదాలకు కేంద్రంగా మారారు. జైన్ జైలు వీడియోలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ప్రతిపక్షాలపై జాతీయ సంస్థలను ప్రయోగిస్తున్నారంటూ బీజేపీపై వచ్చిన విమర్శలను ఆప్ బలమైన అస్త్రాలుగా మార్చుకోలేకపోయింది.
జాతీయ పార్టీ హోదా
ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కాస్త ఊరట కలిగించే అంశం ఒక్కటే అది జాతీయ పార్టీ హోదాకు అర్హత సాధించడం. జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందాలి. లేదా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్సభ సీట్లు సాధించాలి. ప్రస్తుతం ఆప్.. ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉంది. ఈ ఏడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల సాధించి 6శాతం ఓటు షేరు దక్కించుకుంది. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచి 12 శాతం ఓటు షేరు సాధించింది. దీంతో జాతీయ పార్టీగా అవతరించేందుకు అర్హత సాధించింది.