Mughal Gardens: మొఘల్ గార్డెన్స్. రాష్ట్రపతి భవన్ లో కొలువుదీరిన అద్భుత ఉద్యానవనం. రకరకాల మొక్కలు, అరుదైన పుష్ప, ఫల జాతులతో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఆ గార్డెన్.
కశ్మీర్లోని మొఘల్ గార్డెన్స్, తాజ్మహల్ ముందు ఉన్న గార్డెన్.. ఈ రెండింటి స్ఫూర్తితో రాష్ట్రపతి భవన్లో ఉద్యానవనాన్ని రూపొందించారు. చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం, వృత్తాకారంలో అందంగా మొక్కల కూర్పు ఉంటుంది.
పచ్చని చెట్లు, అందమైన పుష్పాల మధ్యన సరస్సులు చూడముచ్చటగా కనిపిస్తాయి. ఔషధి వనం, ఆధ్యాత్మిక వనం, బోన్సాయ్ గార్డెన్తో పాటు జీవవైవిధ్య పార్కు కూడా ఉండటం దీని ప్రత్యేకత.
ప్రఖ్యాత మొఘల్ గార్డెన్స్ పేరును మార్చేశారు. ‘అమృత్ ఉద్యాన్’ అని నామకరణం చేశారు. ఆ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘అమృత్ మహోత్సవ్’ థీమ్కు అనుగుణంగా ‘అమృత్ ఉద్యాన్’ అనే పేరు పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పేరు పెట్టినట్టు చెబుతున్నారు.
వరుసగా ఢిల్లీలో ప్రముఖమైన వాటి పేర్లు మారుస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న.. పరేడ్ జరిగే మార్గాన్ని.. గతంలో రాజ్పథ్ అనేవారు. ఆ పేరును కర్తవ్యపథ్గా మార్చేసింది కేంద్రం. రాజ్పథ్ అనేది బ్రిటిష్ భావజాలాన్ని సూచిస్తున్నందుకే మార్చేశామనేది కేంద్రం వాదన.
ఇక, పలు ప్రసిద్ద మార్గాల పేర్లు కూడా ఇప్పటికే మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. తుగ్లక్ రోడ్ ను గురుగోవింద్ సింగ్ మార్గ్, అక్బర్ రోడ్ ను మహారాణా ప్రతాప్ మార్గ్, ఔరంగాజేబ్ లేన్ ను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మార్గ్, హుమాయిన్ రోడ్ ను మహర్షి వాల్మీకి రోడ్, షాజహాన్ రోడ్ ను జనరల్ బిపిన్ రావత్ రోడ్ గా పేర్లు మార్చింది. లేటెస్ట్ గా రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్స్ ‘అమృత్ ఉద్యాన్’ అయింది.
కావాలనే ఓ మతం పేర్లనే మార్చేస్తున్నారనే విమర్శ కూడా ఉంది. కొత్తగా రోడ్లు వేసి వాటికి మీకిష్టమైన పేర్లు పెట్టుకుంటే తప్పులేదు కానీ, దశాబ్దాలుగా ఉన్న పేర్లను మార్చేయడం బీజేపీ రాజకీయమంటూ ఆ వర్గం మండిపడుతోంది. అయితే, గతంలో పనికట్టుకుని మరీ ఆ వర్గం పేర్లు పెట్టారని.. మనవారికి అన్యాయం జరిగిందని.. ఇప్పుడు పేర్ల మార్పుతో న్యాయం చేస్తున్నారనేది బీజేపీ సపోర్టర్స్ వాదన. ఎవరి మాట ఎలా ఉన్నా.. ఎంతో పాపులర్ అయిన మొఘల్ గార్డెన్స్ పేరు ఇకపై వినిపించదు. ‘అమృత్ ఉద్యాన్’ లోకి జనవరి 31 నుంచి మార్చి 31 వరకు సందర్శకులను అనుమతిస్తారు.