ఈ మూడు విషయాల గురించి చర్చించుకుందాం.. అసలేంటి ఈ ల్యాటరల్ ఎంట్రీ అనేది ముందుగా తెలుసుకుందాం. మాములుగా కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని విభాగాలకు సంబంధించిన కీలక బాధ్యతలను మాములుగా అయితే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లను నియమిస్తారు. కానీ గత కొన్నాళ్లుగా.. కాదు కాదు కొన్నేళ్లుగా ఈ కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీంతో యూపీఏ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో వివిధ రంగాల నిపుణులను ఇందులో చేర్చుకుంటారు. అయితే తాజాగా కేంద్రం యూపీఎస్సీ ద్వారా ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 45 జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ వచ్చిందో.. అప్పుడే విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇలా భర్తీ చేసే పోస్టులలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కోటా, రిజర్వేషన్ ఏమీ ఉండవు. దీంతో విపక్షాలతో పాటు ఎన్డీఏలోని కొన్ని పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే విపక్షాలు రిజర్వేషన్లను గాలికొదలి.. బ్యాక్ డోర్లో నియమాకాలు చేపడుతుందంటూ విమర్శలు చేయడంతో వెనక్కి తగ్గినట్టు అర్థమవుతుంది.
అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ప్రసార సేవల నియంత్రణ చట్టం చేయాలనుకుంది. ముసాయిదా రూపొందించి స్టేక్హోల్డర్లకు పంపించింది కూడా.. అయితే ఈ బిల్లు స్వతంత్ర జర్నలిస్టుల గొంతునొక్కేలా ఉందనే విమర్శలు మొదలయ్యాయి. భావప్రకటన స్వేచ్ఛను హరించేలా డిజైన్ చేశారంటూ ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో కేంద్రం ఈ ముసాయిదా బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత వక్ఫ్ బోర్డ్ బిల్లు.. వక్ఫ్ బోర్డుల నియంత్రణ కోసం కేంద్రం ఓ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును ఇలా పార్లమెంట్లో ప్రవేశపెట్టారో లేదో.. ఇండియా కూటమి ముక్త కంఠంతో వ్యతిరేకించింది. ఈ బిల్లు మైనార్టీల హక్కులను కాలరాసేలా ఉందన్న విమర్శలు చేసింది. దీంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతామంది కేంద్రం.
Also Read: జార్ఖండ్లో కొత్త పార్టీ.. మాజీ సీఎం చంపయీ సోరెన్.. ఎవరికి అడ్వాంటేజ్
నిజానికి కేంద్రం మూడు నెలల కాలంలో మూడుసార్లు తన నిర్ణయాలను మార్చుకుంది. దీనికి కారణం.. విపక్షాలతో పాటు ఎన్డీఏ కూటమి నుంచి కూడా కాస్త వ్యతిరేకత రావడమే.. నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే మనం చర్చించుకున్నాం. ఇకపై ఇకముందులా ఉండదని.. ఒంటెద్దు పోకడలు కష్టమని. ఇప్పుడదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మోదీ 3.0 సెట్బాక్స్ను రెండు రకాలుగా చూడొచ్చు.. ఎన్నికల్లో ఊహించని స్థాయిలో సీట్లు తగ్గిపోయిన ప్రభావమో.. మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతుండటం వల్లనో కానీ ఏదైనా నిర్ణయంపై వ్యతిరేకత వస్తే మోదీ ప్రభుత్వం పీఛేముడ్ అంటున్నది. దీనిని రెండు రకాలుగా చూడొచ్చు.
ఒకటి విపక్షాల ఆందోళనలకు వెనక్కి తగ్గడం. రెండోది.. పొత్తులో ఉన్నప్పుడు ఉండే ఇబ్బందులుగా చూడొచ్చు.. ఇప్పటికే ఇది ఆరంభం మాత్రమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి మోదీ సర్కార్కు చాలా డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటుందన్న పేరు ఉంది. మంచిదే.. కానీ విపక్షాలతో చర్చించి.. అందరి అభిప్రాయాలు తీసుకొని వారి సలహాలు, సూచనలు పాటిస్తే ఆయనకే మరింత మంచి పేరు.. మంచి పాలకుడన్న కీర్తి దక్కుతుంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని అర్థం చేసుకొని.. ఇకపై తీసుకునే నిర్ణయాలను స్వపక్షం.. విపక్షాలతో చర్చించి ముందుకు వెళితే మంచిది.